కొత్త పోస్టులు

శీర్షికలు

కథలు

చెదిరిన కల

పొధ్ధాటి కల్లు వాసన కమ్మగా వోత్తాన, ఏ పుర్గు పుట్రో అచ్చి కుడ్తదన్న భయంతో, సలిని కప్పుకున్న శీకట్ని సూత్తు ఒక్కడే కంకిశేను కాడ వన్కుతూ కూసోని ఎదుర్సూత్త ఉండు జోసఫ్. సెకను ముల్లుల తన గుండె సప్పుడు ఒక్కటే కల్వరింత, పూర్ణ ఎప్పుడొత్తదా అని. ఈ ఎదురుసూపులు కొత్తేం కాదు, అయ్న ఆళ్ళు కల్శిన ప్రతిసారి ఒక కొత్త కలలా ఉంటది. సుట్టు శీకట్లో ఈదర గాలులు ఉక్కిరిబిక్కిరి సెత్తుంటే, డిశంబర్ నెలలో అచ్చె తూర్పు దిక్కు సుక్కలోలే, అంత సీకట్లో కుతం ఎన్నెల ఎల్తురొలే వొత్తాన పూర్ణను సూత్తు జోసెఫ్ "ఏమైంది ఇంతశేపైంది, ఇగ రావేమో అనుకున్న" అని అన్నడు.  తన మాటల్ని పట్కోకుండా పూర్ణ అచ్చి జోసెఫ్ పక్కపొంటి కూసోని తన కొంగును ఇద్దర్కి కప్పుకుంటూ కండ్లల్ల నీల్లు నింపుకొని జోసెఫ్ని అల్లుకపోయింది.

పూర్ణ సుట్టూరా శేతులు పోనిచ్చి తనకి ఇంకా దగ్గర్గా లాక్కొని, "ఏమైంది" అని అడ్గిండు జోసెఫ్.

"మా మామ శెట్టుమించెలి జారిండే" అని తన లోపలున్న బాధనన్సుకుంటు సమ్దానమిచ్చింది పూర్ణ.

అవునా..! అసలు ఏమైంది నర్సి బాబాయ్కి అని అచ్చెరంతో మల్ల అడ్గిండు జోసెఫ్.

"సాయింకాలం మామ శెట్టెక్కి కల్లు లొట్టి దించ్తుంటే మోకు జారిందట, ఐతే ఎంబటే తాటిశెట్టును కర్సుక పట్టిన కుతం జర్ర జర్ర జారిపడి, మామ చాత్పొంటి, కొంకుల్పొంటి మల్ల జబ్బలపొంటి తాటిపేడ్లు గీర్కపోయి ఎర్రగా ఐంది అని ఏడ్తూ జెప్పింది.

తన శంపలపొంటి కార్తున్న నీల్లను తుడ్సుకుంటా జోసెఫ్ మరింత్గా పూర్ణను అముల్కొని తన నొసల్పై ముద్దునిత్తు, "ఇప్పుడైతే మంచిగనైతే ఉండు కద అని అన్నడు.

"హ కానీ, మా అవ్వ సచ్చిన్కానుండి నన్ను దెచ్చుకొని బిడ్డలెక్క సాత్తాండు, కన్నబిడ్డ అమ్ముల్ని గూడట్ల జూశ్కోలే. అయిన మా మామ శెట్లెక్కితే గాని మాయిల్లు గడ్వదు. అద్గాక రికాం లేకుండా ఏ పని దొర్కితే ఆ పన్కిబోతడు. అట్లాంటిది మావోనికేమన్నైతే ఏంగాను మా బత్కు" అని బదులిచ్చింది పూర్ణ.

జోసెఫ్ ఒక్కశార్గ పూర్ణలోని బాధను మర్శెలా గట్టిగా అముల్కొని పూర్ణ వొల్లంత తడ్ముతూ, ముద్దుల్తో తడ్పేశాడు. ఎచ్చగా జోసెఫ్ శేతులు తాకేసరికి పూర్ణ వొల్లంత అదిరి, తన ఆలోచలన్లన్ని దెంకపోయాయి. ఆ రాత్రిలో ఏకమయ్యి ఇద్దరు కల్శి మరో కొత్త కల కన్నరు. సూట్టురా ఎన్నో ఇసపు పురుగులు పూశున్న, ఆ కంకిశేను చీకట్లను మిన్గురేల్గులు శీర్తుంటే, ఊపిరి తీశ్నట్లైతున్న సలిలో ఈదర గాడ్పులు గూడ ఎచ్చగా అనిపిత్తాంది యిద్దరికిప్పుడు. ఆ కలయ్క రేపిన ఆయితో పూర్ణ "బావ మనం మన కులాల్ని కాదని కల్తానం కద, రేపీళ్ళు మనల్ని ఒప్పుకుంటరంటవా" ? అని అడ్గింది.

"అస్సలు ఒప్పుకోరే"

"మరి ఏం జేద్దామే, నేనైతే నిన్ను ఒదిలి బత్కలేను బావ, ఎటైనబోయి బత్కుదామా"

"నాగ్గుత అట్లనే అనిపిత్తాంది గానీ, మా ముసల్లోలను సూత్తనే బయమేత్తాంది. మా అవ్వాయ్య లేకున్నా నన్ను ఇంతటోన్ని జేశిర్రు, నే ఏటన్నబోతే ఆళ్ళేం గావలే అని గొంతులో గుట్కెత్తు జోసెఫ్ మొఖం మాడ్చిండు.

పూర్ణ, మాడ్చిన జోసెఫ్ మొఖాన్ని శేతుల్తో తుడ్తూ తన చెంపల్పొంటి ముద్దిచ్చి, "కొన్ని దినాలెలే మల్ల ఇటే అద్దాం.

సరే మరి నేన్బోనా అచ్చి చాలా సేపైతంది" అని అన్నది.

"సరే మంచపో"

*

ఊళ్లే పొద్దెక్కగానే పనారాటంతో ఎక్కడోళ్ళు అక్కడ్కి బోయిండ్రు. అట్లనే గొర్లను కొట్టుకుంటూ బాషి, జోసెఫ్ని ఎంబడెట్టుకొని ఊర్దాటి శాన దూరమచ్చిండ్రు. నెత్తి మీద ఎండ సుర్రుమంటు ఎన్ను తాక్తుంటే జోసెఫ్ శిరాక్తో "ఏమే బాషన్న మంచ పన్నోన్ని ఈ ఎండల తిప్పబడ్తివి".

"ఏమ్రా అయ్సు పొరడు పొద్దెక్కేదాక పంటర్రా" అని ఎక్కిరిచ్చిండు బాషి.

"గదంత గాద్గాని గిప్పుడు నీ గొర్లతోబాటు నన్నెంద్కు దోల్కచ్చినవో గద్జెప్పు" అని మల్ల గదే శిరాక్తో అన్నడు జోసెఫ్.

"ఉచ్చాగ్దార , జేప్పెదాక ఇనవ్ ఇటిను మొదాలు, మీ అయ్య నేను సొంత అన్నదమ్ముల్లెక్క ఊళ్లే తిరిగేటోళ్లం, తాగేటోళ్లం. కానీ, మీవోడు కొత్వాల్ దొరోడి బాయి పన్కిబోయి సచ్చిన్కానుండి నాకు నిమ్మలం లేద్రా. ఆరోజు మస్త్ లొల్లి జెశ్నగనీ, ఆడి దొరతనం ముందు నేచెల్లలేద్రా" అంటు కండ్లకత్తాన నీల్లను తుడ్శుకుంటూ "ఐతే ఇయ్యాల కోన్ని కోశ్నరా, మీ అయ్యకు పెట్టలేన్గా, కనీసం నీకైనా ఇంత పెడ్దామని దిస్కచ్చినరా" అని సద్దిని జూపిత్తు అన్నడు.

బాషి మాటల్కి జోసెఫ్ కత్తాన బాధనన్సుకుంటు, "ఊకోయే బాషన్న బోయినోళ్లు మల్లాత్తర" అని సమ్దాయిత్తు "సరే దిందాంబ" అంటూ పక్కనే ఉన్న తుమ్మశెట్టు కిందకు దిస్కపోయిండు.

యిద్దరి నెత్తికున్న తువ్వాల్నిప్పి తన శెమట మోకాన్ని తుడ్తుంటే అత్తాన వేడి గాడ్పులు కుతం దాక్గానే ఒళ్ళంతా ఆయిగనిపించి ఎన్కకు ఒర్గి కండ్లు ముస్కుండ్రు. గప్పుడు జోసెఫ్ పక్కకి బాషి దిర్గుతూ "అరె చిన్న ఒక పాట పాడ్రాదురా" అని అడ్గిండు.

"నీకెట్ల ఎర్కనే నే పాడ్తని" మూశున్న కండ్లను తెర్తు అడ్గిండు జోసెఫ్.

"ఎహే నాకెంద్కు దెల్వదురా ఆరోజు మీ కిస్మస్ పండ్గరోజు బీరు సాయిబోళ్ల యింటి కాడ స్టేజేశి అది.., అది,

దాన్నేమంటార్రా" ?

"అదానే, గిటార్".

ఆ అదే దాన్ని వాయించ్కుంటా స్టేజి మీద నువ్వు పాడ్తాంటే సిన్మాలా హీరో లెక్క కొట్టినవ్ పో" అని మస్త్ సంబ్రపడ్డాడు బాషి.

ఒర్గినోడు లేశి సకులం ముకులం పెట్కొని "అవునానే అన్న" అని అడ్గిండు జోసెఫ్.

"అవున్రా, ఆ మీటింగ్ నడ్తాంటే మొత్తం ఆడపొరగాళ్ల కండ్లల్లా మొత్తం నువ్వే మెదిలినవ్. అది జూశి ఊళ్లే ఎంత మంది కుల్లుక సచ్చిండ్రో" అని అంటూ "నాకోసం ఓ పాట పాడ్రా" అని మల్ల అడ్గిండు బాషి.

ముశి ముశి నవ్వుకుంటా "సరే అన్నం దిన్నంక పాడ్తలే" అని జోసఫ్ లేశి ఎంటదెచ్చుకున్న బాటిల్ నీల్లతో శేతులు కడ్కుండ్రు ఇద్దరు.

 

*

"అరే జోసెఫ్ గిప్పుడన్న పాడ్రా" అని బాషి అయిపోయ్న సద్ది డబ్బను డొల్లేక్క కోడ్తుంటే "జీవనదిని నా హృదయములో" అంటూ ప్రభువు పాటనెత్తుకుండు జోసెఫ్.

ఇంతకు మున్పు డోలు కొట్టిన అన్భవంతో బాషి మార్శి మార్శి కొడ్తుంటే, జోసెఫ్ పాటలు మార్సుకుంటబోతూ యిద్దరు పాటల్లో మునిగిబోయిండ్రు.

"దెలికుండానే శాన సేపయ్తాంది, ఇగబోదాంబ" అని లేశి గొర్లను మల్లెశిర్రు యిద్దరు. ఎన్నో ముచ్చట్లు ఎట్టుకుంటూ, నవ్వుకుంటా, చూశేటోళ్లకు ఒక్కింట్లోల్ల లెక్కకొడ్తు బోతావుంటే, శేరువు కట్ట మీద పోడ ఎండ సొగసుకు శెమట సుక్కలద్దినట్లు ఈపంత మెర్తుంటే కట్టెల మోపెత్తుకొని, పిల్లకాలువంకోలే నడుమంకను తిప్పుతూ నడ్తాంది పూర్ణ.

ఆళ్ల మాటలిని పూర్ణ ఎన్కకు ఒక్కశార్గ తిర్గి జోసెఫ్ని జూత్తు ఓ నవ్వు నవ్వి ముంద్కుబోతుంటే, జోసెఫ్, పూర్ణ కండ్లాంకలను, నడుమంకను జూశి తన కాళ్ళ అడుగుల్కి వంకలు పడ్డాయి. ఇందంత జూత్తాన బాషి "ఏడిదాకచ్చిందిరా మీ కత" అని అడ్గిండు.

జోసెఫ్ అదిర్బడి పూర్ణ మత్తులోంచి బయటకత్తు "నీకెట్ల దెల్సునే" అని అచ్చెరంతో మల్లదిర్గి అడ్గిండు.

బాషి పక్కకు బోతున్న గొర్లను మర్రెత్తు "నాకు బోనాలప్పుడే దెల్సుర వారి, మా పండుగల్కి నేనెప్పుడు పిల్శిన రానోడివి, ఆరోజు ఆపోరి చిల్కల బోనమెత్తుకొని వొత్తాంటే ఎన్కేన్క నువ్వు ఎగిరేగిరి జూశినప్పుడే సమజైంది నాకు" అని జేప్పిండు.

బాషి మాటల్కి జోసెఫ్ శిగ్గుపడుతూ, నవ్వుకుంటా బాషిని హత్తుకుండు. ఎంబటే "భయంగల్ల కోడాట బదాట్ల గుడ్డెట్టినట్టు, శేశిందంత శేశి గిప్పుడు శిగ్గుపడ్తానవారా" అని నవ్వుకుంటా అండు బాషి.

"అద్గాదే బాషన్న అసలు ముచ్చట, మా పెళ్లి ఐతదా ? అని బయమైతందే" అని నవ్వుతున్న మోకాన్ని మాడ్శి జెప్పిండు జోసెఫ్.

"నీకేందక్కువరా, మంచ సదువ్కున్నావ్, రేపో మాపో నౌకరైతది. వాళ్ళోళ్ళు ఒప్పుకోకపోతెం మీరే ఏటన్నబోయి పెళ్లి జేసుకోనచ్చి, పోలీస్ స్టేషన్లో కూసొండ్రి" అని సలయిచ్చిండు బాషి.

బాషి మాట్లాడుతాంటే గమ్మునుండి సోచాయిత్తు నడ్త ఉండు జోసెఫ్. పర్తితి బాష్కి సమజై జోసెఫ్ కాడ్కిబోయి ఎన్కనుంచి ఎన్నుమీద నేనున్న అన్నట్లు రెండు దెబ్బలేశి "బోయి ఆ పిల్లతో ఏమన్నా మాట్లాడుబో" అని ముంద్కు దోశిండు బాషి.

గొర్లను దాట్కుంటూ జోసెఫ్, పూర్ణ కాడ్కి రాంగానే పూర్ణ ఒక్కశార్గ అదిర్పడి "అబ్బా..! నువ్వుబోయే బావ ఎవల్లన్న జూత్తరు" అని బయంతో అన్నది.

"అద్గాదే నే జెప్పేదీను" అని ఏదో జెప్పబోయిండు జోసెఫ్.

"జెప్పేదేంలే, చీకటైనాక కల్దాం గాని మొదలూ ఈన్నుంచిబో" అని ముంద్కు దన్న దన్న బోయింది  పూర్ణ.

బాషి ఆళ్ళిద్దరిని సూత్తు "అరేయ్ గిట్ల బయపడ్తే, రేపు మీ రెండు కులాల పెద్దమనుషుల్ని ఎట్ల ఎదుర్కుంటరు, మీ పెళ్లెట్ల జేసుకుంటరు" అని నవ్వుతుండు.

"అట్లేం లేదే, ఆళ్ల మామ సూత్తడన్న భయం తప్ప, నేనంటే మస్త్ ఇష్టమే ఆ పిల్లకి, నాగోసం ఏమైన జేత్తది" అని అన్నడు జోసెఫ్.

"సరే ఊకే గదె సోయిలుండకు, ఎట్లాయ్యేది గట్లనైతది గాని ఇగ నువ్వు ఇంటికిబో పొద్దుబోయింది" అని జోసెఫ్ ధైర్నం జెప్పుతూ పంపిండు బాషి.

మాపటెండ కుంకుమ్బుసుకోని సన్నగా ఒంటిమీద పడ్తాంటే, రూమల్సుట్టుకొని ఇంటికెళ్తున్నా జోసెఫ్ని జూత్తు "ఈ పొరగాళ్ళు కులాలు కాదన్న కలలా బత్కుతాళ్ళు, రేపీల్లా ముచ్చట ఊళ్లే తెల్తే ఎంత పెద్దలొల్లయింతదో" అని బాషి మెదడ్ల దిర్గుతూ, ఏమైనగాన్ని గానీ పొరగాన్కి ఏం గాకుండా కాపాడ్కోవాలే" అని మన్సుల అన్కుంటూ గొర్లను ఇంటికి తోల్కబోయిండు.

*

జోసెఫ్ ఇంటికచ్చి గోలెంకాడ కాల్శేతులు కడ్కోని ఇంట్ల అడ్గెట్టెశరికి, సలికాలం పొద్దునచ్చె పొగమబ్బులా ఇల్లంత సుట్టపోగతో నిండుంది. "ఓ ముసల్లచ్చి, నువ్వన్న నీ మొగన్కి జెప్పాల్సిందిబోయి, ఇద్దరు కల్శి గుప్పు గుప్పుమంటూ సుట్టతాగుతాల్లా? ఇగ సూడు ఇల్లంత మీ సుట్టపోగతో అసలేం అవుపడ్తలే" అని మొత్తుకుండు.

ఇద్దరు ముసలోళ్లు ముశి ముశి నవ్వుకుంటా "ఇట్రారా అయ్యా" అని శేతుల్శాశి జోసెఫ్ని పిల్శింది లచ్చి.

జోసెఫ్, లచ్చి కాడ్కి రాంగానే తన రెండు శేతుల్తో జోసెఫ్ మోకాన్ని దీస్కొని ముద్దునిత్తు "అరయ్య నీ అవ్వయ్యలు కాలం జేశినాక నిన్నే కండ్లల్లబెట్టుకోన్ని బతుక్తున్నంరాయ్యా" అని నీల్లు దెచ్చుకుంది.

"ఇగ ఊకొయే అవ్వ, ఏదో సుట్టవాసోనోచ్చి అన్న మల్లగిట్ల ఏడ్వకు" అని అన్నడు జోసెఫ్.

"సరే బిడ్డ ఏడ్వనుగాని సుట్ట ఆరిపోయ్నట్టుంది, ఇంత నుప్పు దెచ్చియ్యారయ్యా" అడ్గింది లచ్చి.

"దోశ్ బో, మీరు మారారే ఇగ" అంటూ జోసెఫ్ బయటిక్తాంటే "అరే పిలగా నీగోసమని వట్టితున్కల కూర అండిన్రాయ్యా  ఎటుబోతనవ్, ఇంతదింద్వురా" అని పిల్శింది లచ్చి.

"దెహె బో మీ సుట్టపొగ బోయేదాక నే తిన" అన్కుంటూ యింటి ముందు కూసుండు జోసెఫ్.

సాటింపు జెప్పే పెద్దమనిషి కట్టన్న సైకిల్ మీద జోసెఫ్ కాడ్కి ఆగమాగం వొత్తాంటే "ఏమే పెద్దయ్య ఇట్గిట్ల బాట పట్టినవ్ ఏమన్నా అయింద ఏంది" అని అడ్గిండు జోసెఫ్.

"అవునాయ్య కొత్వాల్ సారోత్తండట, మన నాల్గువాడల పెద్దమనుషుల్ని, జనాల్ని, అందర్ని గిన్నెశెట్టు కాడ్కి రమ్మన్నరు. అందరు ఆన్నే ఉన్నరు, మిగిలినోళ్ళకు జెప్పుకుంటా నీదాకచ్చిన ఆడ్కిబా" అని అన్నడు కట్టన్న.

"సరే వత్తనబాయే" అని జోసెఫ్ జెప్పగానే కట్టన్న ఆడ్నుండి బోయిండు.

"కొత్వాల్ దొరంటే ఈ సుట్టుపక్కల ఆయిన్ను కాదని ఏ పనిగాదు, ఏ కాంట్రాక్ట్ ఐన అయినే పట్టాలి, ఏ ఇక్కటోచ్చినా అయినే తీర్వాలి. ఊళ్లేగూడ ఏ కులన్కి పెద్దమన్శి ఎవడున్న పెద్దరికమైతే కొత్వాల్దె. ఆయిన్ను కాదని ఏ కులపొడు ఏపని జెయ్యడు, కాదన్నోన్ని జూశిన దాకల్లేవు గూడ. ఒకేలుంటే ఆడి సంగతేందో జెప్పేదాక ఊకోడు. అందేందోగాని కొత్వాల్ ఇన్నిజెత్తున్న ఒక్క కేసుగూడ కాలేదు. అయిన అచ్చిన ప్రతాఫీసర్లు, పోలిసొళ్ళు కొత్వాలిచ్చే దావత్లా మున్గుంతాంటే ఎట్లా ఐతది. అసోటోండు మా వాడక్తాండంటే ఏదో పెద్దపనే ఉంటది" అని మన్సుల అన్కుంటూ గిన్నెశెట్టు కాడ్కి నడ్తాండు జోసెఫ్.

*

గిన్నెశెట్టుకాడ అందరూ కొత్వాల్ కోసం ఎదురుజూత్తాల్లు. ఆ గుంపులోంచి రమేష్ గిన్నెశెట్టు గద్దెకాడ్కిబోయి నిలబడ్డాడు. "అసల్కి కొత్వాల్ దొర ఎందుకు పిల్శిండు" అని నాల్గు వాడల మంది అంత ఆడ ఈడ మోపై ముచ్చట్లు యెట్కుంటాళ్లు. రమేష్ ఆ ముచ్చట్లన్నింటిని బంజేత్తు ఒక్కశార్గా "దోశ్ మనకు పని లేదన్కున్నాడు ? మనమచ్చి గింతసేపైతున్న రాడేమే ఈ దొర అనేటోడు" అని అన్నడు.

"ఏంరో దొరను గట్ల అంటన్నావ్, నీ లెక్కనార ఆయిన్కి వంద పనులుంటయ్" అని గద్దెమీద కూసున్న పెద్దమన్శి లేశి అన్నడు.

"ఓ పెద్దమన్శి ఎవన్కే దొర, మీగావచ్చు మాగాద్, అయిన మాకుతం మస్త్ పనులున్న ఒదిలి పెట్టుకొనచ్చినం" అని రమేష్ మాట్లాడ్తుంటనే కొత్వాల్ కార్ అచ్చాగింది.

గిన్నెశెట్టుకాడ్కి కొత్వాల్ తన మన్శులతో దిగ్గానే వయిస్సుబడ్డొల్లేమో లేశి దండలేడితే, నడీడుల్లోలేమో అట్లనే నిలబడి సూత్తున్నరు. ఐతే ఎంబటే పెద్దమన్శి కట్టన్న తన నెత్తికున్న రూమల్దీశి, ఉరుక్కుంటబోయి కూర్చి తెచ్చేశిండు.

గప్పుడే జోసెఫ్ గుంపులోకచ్చి సూత్తాండు ఏంటాని, తనకేం సమజ్గాక గద్దెమించెలి దిగ్తున్న రమేష్కి సైగ జేశిండు. "ఏమో దేల్వదు" అని జబ్బలేగరేసుకుంటు మల్ల సైగ జేశిండు.

గమ్మునున్న వాతవర్ణాన్ని పలగ్గొడుతున్నట్లు కొత్వాల్ "ఇగో అందరూ ఇటినండి, పైనున్న సర్కారోళ్లతోని, పార్టోళ్లతోని కొట్లాడి మరి తీస్కచ్చిన, ఇంకో మున్నెల్లోచ్చె ఎన్నికల్లో మీదాంట్లోనే ఒకడు మనఊర్కి సర్పంచ్" అని మాట్లాడ్తుండగా కింద మంది గట్టిగా సప్పట్లు కొట్టారు.

"ఆగండి ఆగండి, ముందు నే జెప్పేది ఇనుర్రి" అని కొత్వాల్ జనాలనాపుతూ, "ఐతే రేపు గ్రామస్థాయి ఎన్నికల మీద  పార్టీ మీటింగుంది. దానికోసం MLA సారత్తండు, దీన్కోసం ఒక ఇరవై డప్పుల్దెచ్చిన, అవేవలు గొడితే వాళ్ళకే, ఒకపక్క డప్పులు నడ్తాంటే ఇంకోపక్క ఆడోళ్ళు కోలాటాలెయ్యలే, ఎశ్నందుకు రెండొందలు, మీటింగ్కుచ్చిన ఒక్కో మన్శికి వందరూపాల సోప్పున ఇత్తం. మీగోసం కొట్లాడి  మరింత జేశినందుకైనా మీ అందర్రావలె" అని మందిని నాన్పుతూ మాట్లాడ్తుంటే,

"ఎహే ఆపే అన్న, ఏం జేశినవ్ నువ్వేదో బగు జేశినట్టచ్చి మాట్లాడ్తానవ్" అని కిందున్న మందిలోంచి అన్నడు రమేష్.

అక్కడ మొత్తం నిసబ్దం అల్ముకుంది. రమేష్ మాటల్కి ఏమైతదాని అమ్మలక్కాలందరు సూత్తాండ్రు. కొత్వాల్ నింపాదిగా కూసుంటు "ఏంరా రమేశ్గా, నీయన్ని తండ్లబడె మాటలేనరా, నేనేం జెశిన్నో మీ పెద్దమన్శుల్ని అడ్గుర, అదికుతం శాతకాకపోతే, మీరు శెర్వుశికం కాడ దున్నుతారే ఆ భూమ్లేవరిచ్చిండ్రో దెల్సుకోర" అంటూ గుర్రుగా సూత్తు దొరమధంతో అండు.

ఆడమోపైన మందిలో కొందరు రమేష్ని సూత్తు నవ్వుతాంటే ఏం మాట్లాడాలో ఆన్కి అర్ధంగాలే. పెద్దమన్శుల్లో ఒకలు లేశి "మాట్లాడేటోన్ని మాట్లాడనియ్యకుంటా నడిమిట్ల నీ లోల్లేందిరా" అని కోపంతో కొత్వాల్కు వత్తాస్ బల్కిండు.

రమేష్కి మొకం లేకుండ బోయిందాడ. మొత్తం గమనిత్తాన జోసెఫ్ "దెహే మీకేమన్న సమజైతాంద ఐనా మనలందర్ని ఎడ్డిగుద్దోళ్లను జేత్తాండు. ఆ శెర్వుశికం భూమ్లన్ని అసైండ్ భూమ్లు, అవేం ఆళ్ళ అయ్యా జాగిరేంగాదు" అంటూ రమేష్కి వంత బల్కిండు.

కొత్వాల్కి జోసెఫ్ మాటలన్ని తన్నినట్లై, కోపంతోని "ఏంరా కట్టయ్య నేనేం జెశిన్నో మీకు దెల్వదార, గిప్పుడు ప్రతోడ్కి నే జెప్పల్లారా" అని ఎగేశిండు.

"దొశ్ పోరగ, ఏం దెల్సురవారి నీకు, నిన్నమొన్న మొల్శినోన్వి బగు దెల్సినట్లాత్తనవ్, నడువ్ ఈన్నుంచి" అని దొర మెప్పుబొందనికి గద్దెమించెలి లేశి అన్నడో పెద్దమన్శి.

గిన్నెశెట్టు మీద పిట్టల సప్పుళ్ళు తప్ప ఏం ఇనబడనంత నిసబ్దంగుంది వాతావర్ణం. ఏమైతదాని మందిలో ఉచ్చిలు పెర్గుతుంటే, నే జెశ్నా ఇకమాతు పనిజేశిందన్నట్లు ముశి ముశి నవ్వుతుండు కొత్వాల్.

"అవ్ నాకేం దెల్సు, ఐనగాని, ఇంకెవలన్నగాని ఇంత ఇత్తె లొట్టల బోసుడుదప్ప" అని పెద్దమన్శి అన్న మాటల్కి ఎదుర్గుల్లిచ్చినట్లు మాట్లాడిండు జోసెఫ్.

ఆడైతున్నా యవ్వరాన్కి అమ్మలక్కాలందరు నవ్వుతూ సూత్తాంటే, పెద్దమన్శికి ఇజ్జత్ బోయినట్లై, ఇగ కోపంతో "ఏం రా ఏమన్నావ్" అని జోసెఫ్ మీద్కి ఉరికిండు.

ఒక్కశార్గ ఆడోళ్ళందరూ జోసెఫ్ కాడ్కి అమంతామచ్చి "ఏమయ్యా గిదేనా నీ పెద్దమన్శితనం, ఏమో పొరన్మీకీ బాగా ఉరికత్తానవ్" అని మన్శికో మాట అందుకున్నారు.

"మరి ఆడన్నది" మంచిగున్నదా ?

"మరి మీరు ఎవ్వల్కాడ ఏం దీస్కోకుండా, ఊకనే పంచాయితిలు జేశిర్ర ?" అని ఏంగాకుండా జోసెఫ్ని పట్టుకుంటు అన్నది.

పక్కనున్న రమేష్ ఈ లోల్లంత ముదురుతదేమోనని "ఓ ఆగే పెద్దమన్శి, ఎందుకంత ఆగమైతనవ్, మీతో లొల్లి పెట్టుకోనికేం ఉండలే ఈడ. ఒక్కశారి జోసెఫ్ గాన్ని మాట్లాడనియ్యి మీకే తెల్తది" అని మద్యలచ్చిండు.

పెద్దమన్శి అందరి మాటల్కి ఎన్కకు బోగానే "అరేయ్ నువ్వుబోయి మాట్లాడురా" అని జోసెఫ్ని రమేష్ ముంద్కు నెట్టగానే, జనంలో శానమంది కుతం మాట్లాడమని కోరిర్రు.

జోసెఫ్ ఛాతినిండా గాలి పీల్సుకొని, గిన్నెశెట్టు కాడ్కి బోతావుంటే కొత్వాల్కి ఎక్కడ్లేని కోపంతో సూత్తు పక్కకి జరిగిండు, ముందు కూసున్న పెద్దమన్శులు లేశి నిలబడ్డరు. నిసబ్దం సింగరించుకొని కూసున్నట్లు వాతావర్ణం అముల్కొని గద్దెమించెలి దిక్కుజూపే మోషేలెక్క జోసెఫ్ అగుపడ్తాంటే, అందరూ కండ్లు మిట్కలెయ్యకుండా సూత్తవుండ్రు.

*

తన పనులన్ని ఒడగొట్టుకొని జోసెఫ్ కోసం కంకిశేనుకాడ కూసోనుంది పూర్ణ. సుట్టు శీకట్లు కమ్ముకొనత్తాన ఈదర జోసెఫ్ కౌగిలోలే తన ఊపిరి ఆపేత్తానయ్. కంకిశేనంత పురుగుల మోతల సప్పుళ్ళున్న, పూర్ణకింతైన భయం లేదు, ఉన్నదల్లా ఎదుర్జూపే జోసెఫ్ ఎప్పుడోత్తడని.

పూర్ణ తన్వంత ఎచ్చగా కోరుకుంటుంటే, తన కొంగును తానే హత్తుకుంటూ, జోసెఫ్ శేతులు తాక్తున్నట్లుగా తల్సుకుంటా, "ఇంక రాడేంది" అని తనలో తానే మాట్లాడ్తాంది.

తన మెడోంపులపోంటి కార్తున్న శెమట సుక్కలు చెక్కలగుల జేత్తాంటే, మొదటిశార్గా ఆళ్ళు మాట్లాడ్కున్న ప్రేమ మాటలు గుర్తు జేత్తానయ్.

"బావ, నేనంటే ఎందుకంత ఇష్టం" అని పూర్ణ అడుగంగానే, జోసఫ్ తన దగ్గరగచ్చి, తన నడుంమీద శేతులేసి గుంజుకొని, ఒకరి మొసలు ఒకరికి తాక్తుంటే "ఎండిన ఎముకలకు యెహోవా జీవం పోశినట్లు, నువ్వు నాలో ప్రేమకు ప్రాణం పోశావ్" అని పోలికెడ్తూ ఇచ్చిన ముద్దును తల్సుకుంటా, పంటికింద పెదవిని నల్పుతా నవ్వుతాంది. ఆళ్ళు జేశ్నయన్ని కలల గుర్తుకత్తంటే ఒకింత ఆయిగున్న, మరోదిక్కు కల్వర పెడ్తాంది.

"అసలు ఏంది ఇది, ఎందుకిన్ని కులాలు? ఎంచక్క మన్సులందర్కి ఒక్కటే కులముంటే మస్తుండుగా, గప్పుడు మమ్మల్ని ఆపేటోళ్లే ఉండరు. అయ్యా దేవుడా, మమ్ము కల్పినోడివే ఏ లొల్లిలేకుండా మా పెళ్లి అయ్యేట్టు చూడు దేవా, ఐన ఎంబటే ఎములాడ కచ్చి నీ మొక్కు తీర్సుకుంటా" అని కోర్కుంది.

"ఈ మన్శికి ఏం ఆయే, నా మీద సోయి ఉందా? ఇంక రాడేంది" అని సూట్టురా సూత్తు అక్కడ్నుండి లేశి, మబ్బుల మీద ఎన్నెల అలిగినట్లుగా, పూర్ణ అలిగి ఎల్లింది.

*

సల్ల సలేడుతున్న, దోమలచ్చి శిట్ట శిట్ట కుడుతున్నా జనం ఓపిగ్గా జోసెఫ్ మాటల్ని ఇంటాళ్లు.

"జూశిర్రా శీకట్కాంగానే ఎవలం, ఎవల్కి అవ్పడ్తలేం. అస్సల్ గిప్పుడే గాదు ఎప్పటికుతం, మన వాడలు ఈళ్ళకి ఊరిలెక్క అవ్పడవ్. లైట్లు లేవ్, కాలువల్ లేవ్, రోడ్లు లేవ్. వర్షమత్తె సాలు వర్దంతా ఇండ్లల్ల కత్తంటే, ఊళ్లే కుక్కల్లెక్క బుర్దలో ఒకళ్లకోకళ్ళం నీల్లాత్తనయని కొట్లాడ్కుంది మర్శిర్రా. గిప్పుడచ్చి సర్పంచ్ జేత్తం, మాగోసం డప్పుల్ కోట్టుండ్రి, కోలటాల్లేయ్యండ్రి అంటే ఎంబటే పోనికి గింతన్న ఇజ్జత్ ఉండాలే మనకి. ఆడెవాడోత్తే మన అమ్మలక్కలేందుకు ఆన్ముందు ఆడాలే, అంతగనం కావాలంటే ఆళ్ళ ఇండ్లళ్ళున్న ఆడోళ్లతో ఎయించుకోవచ్చుగా, మనమెందుకేయ్యలే" అని జోసెఫ్ అందర్కి జెప్తుంటే, కొత్వాల్తో అచ్చిన మన్శి కిరణ్ మధ్యలచ్చి ఆపిండు.

"ఏంరా, చిన్న పొరన్వని అని సూత్తాంటే, శానెక్కువ మాట్లాడ్తున్నావ్, ఊకనే ఎత్తాల్ల పైశల్ దీస్కుంటలే"?

ఆన్మాటల్కి జోసెఫ్కి బగ్గ కోపమచ్చి"ఇగో జూశిర్రా, ఆళ్ళేం అంటుర్రో. గిప్పుడా పైశల్గోసం, ఆళ్ళు ఆడమందల్లా ఆడితే, మనకి ఇలువుంటాద? అసలు ఊరంత సర్పేశి కడిగినట్లుంటే, ఆ కడిగిన నీళ్ళన్ని మావాడల కత్తనయ్యని ఎన్నిసార్లు గ్రామపంచాయత్కి బోయి జెప్పిన, మాకేదన్న పన్జేయండ్రని ఎంత మొత్తుకున్నా మొకం జూశినోడ్లేడు గాని, గిప్పుడచ్చి సర్పంచ్ జేత్తడట, ఆ సర్పంచ్ ఎవ్వడో గాని ఈ కొత్వాల్ శేప్పులు తుడ్శెటోడే అత్తడుగాని, ఏరేటోడు రాడు. అందుకే జెప్తనా మన్మందరం ఒక్కట్గావలే, మన బత్కులు ఎవ్వడ్ మార్వడు, మనమే మార్సుకోవాలే. గి దొరనేటోన్తోనేం లేకుండా మన సర్పంచ్ని మనమే ఎన్నుకోవాలి. ఇంకో ముచ్చట రేపీళ్లు పెట్టె మీటింగ్కు నేనైతే ఆళ్లిచ్చే పైశల్కోసం అసల్కేబోను. మీరు బోతాంటే నేనాప. కానీ, ఒకటి మాత్రం జెప్తున్న ఇనుండ్రి నాకు అన్నం లేక ఆకలితో సత్తమాయే గాని, నేను ఆత్మగౌరవంతో బత్కుత" అని గట్టిగా ఓర్రుకుంటూ మాట్లాడిండు.

ఒక్కశార్గా కటిక శీకట్లో సుక్కలు మెర్శినట్లు, జనాల మొఖాళ్ళు మెర్శినయ్. ఆ మెరుపంత ఒళ్ళంతా పాకినట్లు అయ్సు పొరగాళ్ళంతా ఈలలెత్తుంటే, అమ్మలక్కాల సప్పట్లతో వాడంత మోగినయ్. ఆ సప్పట్లన్ని కొత్వాల్కి సావు డప్పులెక్క ఇనబడ్తున్నాయి. ఒక్క నిమిసం గూడ ఆడుండలేకబోయిండు. ఒక్కమారు మాట్లాడకుండా గద్దెమించెలి దిగి కారెక్కిండు.

పెద్ద మన్శులందరు కొత్వాల్కాడ్కి బోయి "ఏమైందొర" అని అడిగిర్రు.

"ఏమైంది ఏంద్రా, మీ కాడ్కత్తే గిదార మీర్జేశే మర్యాద. ఇగ మీ ఇష్టం, మీసావు మీర్సావండి. ఇగో ఇవైతే దీస్కోండి, రేపచ్చేటోళ్లయితే రండి" అని పైశలకట్టిచ్చి కార్లబోయిండు.

రమేష్ ఉర్కుంటబోయి జోసెఫ్నెత్తుకొని "అరేయ్ మొదటిసార్రా కొత్వాల్కి మొఖం లేకుండా జేశినవ్" అన్కుంటూ ఎగుర్తుండు. వాడంత అరుపుల కేకలతో జోసఫ్ సూట్టుర పొగయ్యారు ఏదో సాధించాం అని.

"మా అయ్యనే ఎంత బాజెప్పినవ్" అని ముసలోళ్లందరు దగ్గర్కత్తాంటే, జోసెఫ్ ధన్న ధన్న రమేష్ భుజాలమించేలి దిగి కుక్కను కొడితే ఉరికినట్లు ఒగ ఉరుకుడు ఉరుకుతాండు పూర్ణ గుర్తచ్చి. వాడంత ఏం పట్టిందీ పొరనికన్నట్లు జూత్తాండ్లు.

జోసెఫ్ కంకిశేను కాడ్కచ్చి మొత్తం జూశిండు. పూర్ణ ఏడ అవ్పడక బోయేసర్కి, ఎల్లిపోయిందేమోనని జూశి జూశి అన్నుంచి ఎల్లిపోయిండు.

*

పొద్దు పొద్దుగాల్నే గద్దెకాడ కొత్వాలిచ్చిన కొత్త డప్పులు, కోలలు దెచ్చిపెట్టిర్రు పెద్దమన్శులు. "మీటింగ్కు టైం అయితాంది. మంది ఒత్తరా రారా? ఏందో దెల్సుకొబో"  అని కట్టయ్యను మత్లావ్ దెల్సుకోనికి తోలిర్రు.

కట్టయ్య నాల్గు వాడలు దిర్గచ్చి "ఒక్కొక్కడు గడ్డ మీద కూసోనున్నరు. ఏడ ఏర్పడతలేదు ఆళ్లకు. ఆడోళ్ళు, మొగోళ్ల కాన్నుంచి ఒక్కలు ఒచ్చేట్టు అవ్పడ్తలే" అని పెద్దమన్శులతో అన్నడు.

"రాకబోతే రాకబోనియ్, చిన్న పొరన్ని బట్టుకొని ఏతుల్ జేత్తా ల్లు. మనమన్నా బోదాంబా" అని పెద్దమన్శులు డప్పులందుకున్నరు.

మీటింగ్కు కావాల్సిన పనుల్ని కొత్వాల్ ఆగమాగమవుకుంటా, అన్ని తానై జూసుకుంటుండు. ఎట్లైన ఎమ్మెల్యే మెప్పుబొంది, ఈశారి పార్టీలో గట్టి పదవి దీస్కోవాలని మస్త్ ఆశతో ఉండు.

"అరేయ్ కిరణ్గా, నిన్న అంత అయ్యిందిగా డప్పుల్లోళ్ళు ఒత్తరంటవ" అని అన్మానంతో అడ్గిండు కొత్వాల్.

"ఎందుకు రార్ సార్, పైశల్ పార్దెంగింతే ఎవ్వడైన వోత్తడు. దాంట్లో మావోళ్ళు ముందుటరు" అని గట్టి నమ్మకంతో అన్నడు కిరణ్.

అంతలోనే నల్గురు పెద్దమన్శులు మిగిల్న డప్పులతో, కోలలతో ఒత్తవుండ్రు. ఆళ్ళను జూశి కొత్వాల్ "ఏంరా కట్టయ్య గి నల్గురచ్చి ఎవ్వన్ని బాద్నం జేద్దాంమని ఒత్తాల్లురా, గింతన్నన్నా గుద్ద శిగ్గుడాలే రానీకి" అని కోపంతో అర్శిండు.

"సారు తప్పయింది. ఆ పోరని మాటల్కి ఇంట్లకేళి ఒక్క పుర్గు గూడ బయటక్రాలే. ఈ ఒక్కశారి క్షమించండి దొర, ఇంకోశారి ఇట్ల కానీయం" అని కొత్వాల్కి దండం బెట్టిర్రు పెద్దమన్శులు.

"అరేయ్ మీరీన్నుంచి బోండ్రా, నాక్కసలే మాటల్ సక్కగ రావ్" అని కొత్వాల్ తిడుతుంటే, పక్కనున్న కిరణ్ పెద్దమన్శులను పక్కక్ దిస్కచ్చి "మీరైతే ఆడుండ్రి నే జెప్తా సార్కి" అని అన్నడు.

"కిరణ్గా ఎంత పనైందిరా, ఎమ్మెల్యే కాడ ఇజ్జత్ పోతదిరా నాది. ఆ లంబిడికొడుకులు ఎంత పన్జేశిర్రా" అని మొత్తుకుంటుండు.

"ఊకోండి సార్ గ పొరగాళ్ళు మళ్ళేం జెప్పి జనాలను రానియ్యకుండా జేశిర్రో, ముందైతే ఎట్లనో గట్ల ఈ మీటింగ్ ఒడగొట్టుకుందాం" అని కొత్వాల్ని సందాయించాడు కిరణ్.

కొత్వాల్ కొంచెం నిమ్మలపడి "అవ్ రా ముందైతే ఈ మీటింగ్ కానీయ్. ఆళ్ళ సంగతి తర్వాత జెప్పుదాం. అదేట్లుండాలంటే ఇంకోశారి కొత్వాల్ పేరు ఎత్తాలంటే కింద్కేలి సమర్కారలే, నా కొడుకుల్కి" అని సుర్కంటిన పిల్లిలెక్క అటిఇటు దిర్గుతుండు.

"ఎటుబోతర్ సార్, దొరుకుతర్ ఆళ్ళు గప్పుడు జెప్పుదాం. ముందైతే గి పని చూద్దాం" అని కొత్వాల్ని దిస్కోబోయిండు కిరణ్.

*

"కూలికి బోయేదాన్ని శేన్లకు గుంజుకచ్చి, ఏంది నువ్వు లే నామించేలి" అని కసుర్కుంది పూర్ణ.

"అబ్బా కోపమత్తందా?"

"హ రాక, నువ్వు రాగానే ఎంబడేసుకొని ముద్దులిత్తనుకున్నవా? నిన్న రాత్రంతా నీగోసం ఎంతశేపు జూశిన్నో దెల్సా" అని పక్కకి దిర్గింది పూర్ణ.

"నేనొచ్చిన్నే గానీ, నేనొచ్చేశర్కి నువ్వు బోయినవ్" అంటూ జోసెఫ్ తన శేతుల్లోకి పూర్ణ శంపలను దీస్కొని పెదాలను అందుకోబోతుండగా మొకం పక్కకి దిప్పుకున్నది.

పూర్ణను జోసెఫ్ బుజ్జగిత్తాంటే,

"ఎవల్లుళ్ళ ఆడ" అని శేను లోపల్కచ్చి పిల్శిండు కావాల్కాశే స్వామి.

ఆ మాటతోని పూర్ణజోసెఫ్ లిద్దరు అదిరిపడ్డారు. ఆళ్ళు ఎన్కకు దిర్గి జూడగానే స్వామి కట్టేబట్టుకొని రానే వొచ్చిండు.

"గిల్లకచ్చి మీర్జేశే పనులు గివ్వ? మీ సంగతి జెప్తాగు"

పూర్ణ వన్కిబోతాంది. జోసెఫ్కేమో ఏం మాట్లాడాలో సమజైతలేదు. ఐన ఎట్లనో గట్ల ధైర్నం దెచ్చుకొని "పూర్ణ నువ్విన్నుంచి బో, నే జూశుకుంటా" అన్నడు.

పూర్ణ పోవడాన్కి లేవగానే "ఓ పోరి ఎటుబోయేది. ఊళ్లేందరచ్చే దాక ఎటుబోయేదిలేదు" అంటూ బెదిరిక్జిండు స్వామి.

"అన్న నీకు దండం పెడ్తా బోనియ్" అని బతిలాడుకుంటూ పూర్ణకు బొమ్మని సైగ జేశిండు జోసెఫ్.

ఎంబటే పూర్ణ ఉర్కుడు అందుకుంది. అది జూశి పూర్ణ ఎన్క స్వామి ఉర్కబోతుంటే, స్వామి గల్ల బట్టుకొని గుంజగానే బోర్లబొక్కలబడ్డాడు. జోసెఫ్ గూడ ఆన్నుంచి తప్పించుకబోయిండు.

స్వామి తేరుకొని లేశి జూశేశర్కి ఇద్దరు కనబల్లె "ఈళ్ళ సంగతి గిట్ల గాదు, ఊళ్ళే జెప్తా" అన్కుంటూ ఊళ్లేకు నడ్శిండు.

*

ఊరి పని దీరాగ, సూరీడు ఎర్ర మందారంలా మెర్తాంటే, స్వామి శేయబట్టి ఊరంతా పూర్ణజోసెఫ్ల యవ్వారం తెల్శింది.

పూర్ణకింకా అదురుపోలేదు. భయం భయంగానే నడ్తాంది ఇంటికి. ఆళ్ళ భాగ్యత్త పూర్ణను జూశి "రామ్మ తల్లి, కూలికని బోయి నువ్వు జేశే నిర్వాకమిద? మీ మామైతే తాళ్ళల్లా నుంచి రానియ్, నీ సంగతి జెప్తా" అని సదువుతుంది.

పూర్ణ ఏడ్తూ కాల్శేతులు కడ్కోకుండానే మంచంలా పడింది. కండ్లల్ల నుంచి నీళ్లు ధారలు అట్టకట్టినయ్. తన శంపలు నావర్పట్టికి అతుక్కబోయి మస్కనిద్రలకు బోయింది.

నర్సయ్య ఎప్పుడచ్చిండో తెలీదు. నిద్రమబ్బులోనున్న పూర్ణకు కొంచెం కొంచెం ఆళ్ళ అత్తమామలు మాట్లాడ్కుంటున్న మాటల్ ఇనబడ్తున్న, ఏం దెల్వనట్లు అట్లే పడ్కుంది.

"జూశినవా, మేనకోడలని నెత్తిమీదేట్టుకుంటే ఎంత పన్జేశింది. మల్ల ఏం ఎర్గనట్లు ఎట్ల పన్నదో జూడు" అని పూర్ణని భాగ్య లేపబోయింది.

"ఏయ్ ఆగావే. లే నడ్వు ఈన్నుంచి, పన్నదాన్ని లేపుతానవ్. అది చిన్న పోరి దానికేం దెల్సు. వాడే దీనికేదో మందు బెట్టివుంటడు" అని కొప్పాడ్డాడు నర్సయ్య.

"గిట్లనే ఎన్కేసుకుంటరా, ఏదో ఒకరోజు మనల్ని బదాట్ల నిలబెడ్తది" అని కసుర్కుంటా బోయింది భాగ్య.

పూర్ణ పక్కపొంటి మంచం మీద నర్సయ్య కూసోని నెత్తికున్న తువ్వాల దీశి, పూర్ణ కాళ్లకున్న దుబ్బను తూడ్తు "బిడ్డ లేరా" అని లేప్తుండు.

పూర్ణ కండ్లు ముసుకున్న మెల్కతోనే ఉంది. ఏమైతే అదే అయితదని ధైర్నం దెచ్చుకొని "నన్ను సంపినమాయే గానీ, నే వాన్నే పెళ్లి జేశుకుంటని మామకు జెప్తా" అని లేశింది.

"ఏమైంది బిడ్డ? కంకిశేను ఏంది? ఎవడెవ్వడోచ్చి ఏదేదో జెప్తున్నరు" అని మన్సుల మాట అడ్గిండు.

"మామ నేనే ఎప్పుడో జెప్పుదాం అనుకున్నానే, నాకు జోసెఫ్ అంటే శాన ఇష్టమే. మా పెళ్లి జెయ్యి మామ నీకు దండం పెడతా" అని నర్సయ్య రెండు శేతుల్బట్టుకొని వేడ్కుంది.

నర్సయ్యకి కోపమత్తాన అన్సుకొని "కుదరదు బిడ్డ, కులాన్ని కాదని మనం ఈ ఊళ్ళ సక్కగా ఉండలేం. వాన్ని మర్వు బిడ్డ మన మంచికే జెప్తున్న" అని పూర్ణ తల నిముర్తూ జెప్పిండు.

నర్సయ్య మాటల్కి పూర్ణకింకా ఏడ్పు ఎక్కువై "ఆడు మంచోడే మామ, నన్ను నీ లెక్కనే బా జూశ్కుంటడు" అని అంది.

నర్సయ్య నిమ్మలంగా పూర్ణను నొప్పియకుండా, "ఇక్కడ కావాల్సింది గుణం కాదు బిడ్డ కులం. నీకు జెప్పిన సమాజ్గాదు. నా మాటీను అంతకన్న మంచోన్ని నీకు జేత్తా" అని సమ్దాయించిండు.

పూర్ణ ఏం మాట్లాడ్కుండా మంచంలా కూసోనుంది. నర్సయ్య అక్కన్నుంచి బయటికత్తు పొరగాళ్లందరిని పిల్శిండు.

"అరేయ్ జోసెఫ్ గాడెక్కడున్న ఎతకండ్ర" అని కేకెశిండు. దాంతో గౌండ్లోళ్ల పొరగాళ్లంతా ఒక్కాడికచ్చి ఎతకనీకి బోయిర్రు.

పూర్ణకి ఆళ్ళ మామ మాటల్కి, ఏదో అన్పించి ఎట్లైనా జోసెఫ్ని కల్వలన్కుంది.

పోరగాళ్ళు ఊరంతా ఏ వాడ ఒదిలిబెట్టకుండా ఎత్కుతాళ్ళు. ఏడా జూశిన జోసెఫైతే అవ్పల్లె. ఎట్లయిన దొర్కబట్టాలని కంటికి కున్కు లేకుండా దిర్గుతాళ్ళు.

 

ఇదే అదునన్కొని కొత్వాల్, కిరన్ని పిల్శి "అరేయ్ నా మాటగా గౌండ్లోళ్ల పెద్దమన్శులకి జెప్పురా. ఆడు దొర్కకబోతే గాజులేశుకోని దిర్గమను" అని అన్నడు.

"సరే సార్" అని కిరణ్ బోతుంటే, మల్లాపి కొన్ని పైశల కట్టనిత్తు "ఆళ్లకు శాతగాకపోతే, నువ్వన్న వాన్నేయ్ రా"

కిరణ్ మారు మాట్లాడ్కుండా కొత్వాల్ మోకాన జూత్తాండు.

"ఏమిరా అట్ల జూత్తానవ్. మీ కులపోడని జూత్తానవా, ఒగాల అదైతే, రేపాడు నీ సర్పంచ్ సీట్ని శింపుతడు. నువ్వైతే ఈ పని కానీయ్, నిన్ను సర్పంచ్గా నే జేత్తా" అని రెచ్చగొట్టిండు.

సర్పంచ్ జేత్తానేశరికి మస్త్ సంబ్రమయ్, ఇగేమి ఆలోశించకుండా పైశల కట్టందుకొని గౌండ్లోళ్ల కాడ్కి ఉర్కిండు కిరణ్.

 ఇగ ఊళ్లే నాకెదురు లేదనుకుంటూ నింపాదిగా ముశి ముశి నవ్వుకుంటా కుర్చీలో కూసున్నడు కొత్వాల్.

*

నర్సయ్య ఊరంతా ఎతికి ఎతికి గొల్ల బాషన్న ఇంటిదాకచ్చి తల్పు కొడ్తుండు.

"ఎవలయ" అని అడ్కుంటూ తలుపు దీశిండు బాషి.

"ఏం నర్సయ్య గింత శీకట్ల, గిటు బాటబట్టినవ్. ఏమన్నా పన ఏంది" అని దెల్సుకోనికి అడ్గిండు.

"జోసెఫ్గాడు గావలే బాషి. వాడీటు ఒచ్చిండా? ఒత్తె ఏడున్నడో జెప్పు".

"ఆడేడున్నడో, ఎటుబోయిండో నాకెట్ల దెల్తది. దీనిగోసం గి శీకట్లచ్చి అడుగుతానవా? ఏదన్నుంటే రేపొద్దుగాల మాట్లాడుదాంగాని నువ్వుబో."

"నీక్దెల్సు బాషి, ఆడేడున్నడో ఆనికి జెప్పు. ఇంకోశారి నా మేనకోడల్ జోల్కి ఒచ్చిండో, సంపి బొందబెడతానని"

"ఏంరా నర్సిగా బెదిరిత్తనావ? నా ముంగట ఆడి మీద శెయ్యి ఏయ్, గొడ్డలి శిప్ప మర్రేశి సంపుతా బిడ్డ. ఆని జోల్కత్తె నడువ్ ఈన్నుంచి" అని బెదిరిచ్చిండు బాషి.

"బోతన్న, గానీ మా జోల్కత్తె నే అదే పన్జేత్తా జూడు" అన్కుంటూ మర్రిబోయిండు నర్సయ్య.

ఆళ్ళు బోగానే తల్పేసుకొని మంచంలా ఒరిగిండు బాషి.

"ఎంత పనాయే, పోరనికి ముందున్నుంచే జెప్తున్న జాగ్రత్తరాని, గిప్పుడు గి లొల్లి ఏడిదాక బోతదో" అని ఆలోచిత్తాంటేనే మల్లేవరో తల్పు కొట్టిన సప్పుడైంది.

"దెహే నీయమ్మ మల్ల ఎవల్రా" అని శికాక్తో తల్పు దీయగానే ఎదుర్గా పూర్ణ.

ఎడ్శి ఎడ్శి మొకమంత వాడిపోయిన పూర్ణను జూశి ఎంబటే ఇంట్లకు గుంజి తల్పేశి "ఏమైంది బిడ్డ గిప్పుడచ్చినవ్, ఎవలు జూడలేగా" అని అడ్గిండు.

"అన్న నే జోసెఫ్ని జూడాలే. వాడికేమయ్యిందో" నని ఎడ్తాంది.

"వాడు ఈడ లేడు బిడ్డ, ఏడున్నడో నాక్దెల్వదు" అని ఊకోబెడ్తుండు.

"అట్ల అనకే అన్న, నీక్దెల్వకుంటా వాడేట్బోడు. మా మామ మాటలు ఇంట ఉంటే భయమేత్తాంది. జర కల్పియన్న" అని దండం బెట్టింది.

ఏం జెయ్యాలో బాషికేం సమాజ్గాలే, ఈ పిల్లతోబాటు ఎవరన్న ఒచ్చిర్రాని బయట సూట్టురా జూశిండు. ఎవర్రాలే అని అన్కున్నకానే పూర్ణను దీస్కొని గొర్లమంద కాడ్కి బోయిండు.

"లోపల్కి బోయి జూడుబో బిడ్డ"

గొర్లమందను దాటుకుంటా పూర్ణ బోయేశర్కి, గొర్లమధ్యల గొంగడి గప్పుకొని జోసెఫ్ పడుకొని ఉండు.

జోసెఫ్ని అట్ల జూశేశర్కి పూర్ణకి ఏడ్పు ఎక్కువై ఎంబటేబోయి తనని అముల్కొని "నావల్లనే నీకీ గతచ్చెనే బావ, ఎవ్వల్ లేనట్టుగా గొర్లల్ల పన్నవానే బావ" అని ఎక్కి ఎక్కి ఏడ్తూ జోసెఫ్ మొకమంత ముద్దులు పెట్టింది.

"లే బావ లే, మనం ఈడ అద్దు. ఈడ ఇట్లనే ఉంటే మనల్ని బతకనియ్యరు, ఎటైనా బోదాంబా" అన్కుంటూ జోసెఫ్ని లేపింది.

"ఎట్బోతమే, ఏడ్కని బోతం. ఏడ్కిబోయిన ఇదే బత్కు, ఆడ్కెడికో బోతే నా కులమేమన్నా మార్తదా పూర్ణ. ఏది ఏమైనా ఈన్నే ఉండి కొట్లాడుదాం."

"అద్దు ఈడ అద్దె అద్దు. మా మామను జూత్తనే భయమేత్తాంది నాకు" మంకు బట్టుకుంది పూర్ణ.

అంత గమనిత్తున్న బాషి ఆళ్ళ దగ్గర్కత్తు "అవ్ రా జోసెఫ్, ఈ రాత్రి ఏమైతదో కుతం తెల్వదు. మీరేటన్న బోయి ఎట్లనోగట్ల పెళ్లి జేశ్కోని రండ్రి, గప్పుడు నే జూశ్కుంటా" అని సలయిచ్చిండు.

"ఎటుబోనే ఏడికనిబోను, మల్లోకటి శేతిలో రూపాయిబిళ్ళ గూడ లేదు" అని అంటుండగానే బాషన్న పైశల్ దీశి జోసెఫ్శేతిలో బెట్టిండు.

జోసఫ్ గమ్మునవుండి, నోరు మెదపలేదు. కండ్లపొంటి వాటంతటవే నీళ్లు కార్తానయ్.

"ఊకోరా పిచ్చోడ నే లేనారా నీకు" అని జోసెఫ్ ఎన్నుమీద భరోసాగా రెండు దెబ్బలేశిండు బాషి.

జోసెఫ్ నీళ్లు తుడ్శుకుంటు "నీకు బాకి పడ్తనే అన్న"

"సరే సరేగాని ముందు ఈన్నుంచి ఎల్లుండ్రి" అని తోల్తుంటే జోసెఫచ్చి బాషిని కౌగిలించుకున్నడు.

"అరేయ్ జోసెఫ్, నిన్ను నమ్మత్తాన పిల్లకు ఏ కట్టం రాకుండా జూశ్కోరా" అని ఇద్దర్నిబంపిండు బాషి.

*

ఊరంతా దిర్గి దిర్గి నర్సయ్య ఇంటికచ్చేశర్కి, ఆడ జనాలంత మోపైండ్రు. భాగ్య గద్మల గూసోని సాపిత్తాంది.

"ఏమైందే, ఎవలో సచ్చినట్లు జేత్తానవ్" అని ఆగమాగంగా అడిగిండు నర్సయ్య.

"కోడల్ కోడలిని మీదేశ్కుంటే, మన కొంప కూల్శి ఆ మాదిగొన్తోని లేశ్పోయిందిరయ్య" అని ఉన్నముచ్చట జెప్పింది భాగ్య.

మా మాటకు నర్సయ్య దట్టుకోలేక బోయిండు. ఒక్కశారిగా ఒళ్ళుదిర్గి కూలబడ్డాడు. ఎంబటే ఆడున్నోళ్లు అందుకొని నీళ్లు దాపిచ్చిర్రు.

కిరణ్, గౌండ్లోళ్ల పెద్దమన్శులందరు కల్శి కొత్వాల్ జెప్పింది జేయడానికి, ఆళ్ళు అనుకున్న ముచ్చట జెప్పనీకి నర్సయ్య కాడ్కచ్చి "జూడు నర్సయ్య, గిట్ల కూలబడితే గాదు ముచ్చట లేశి ఏదొకటి జెయ్యి లేకపోతే మేమేదొకటి జెయ్యల్శి ఒత్తది. అదెట్లంటే నువ్వు గిప్పుడు ఎక్కే శెట్లు బంద్బెట్టి, వేరేటొళ్ళకిత్తం. నిన్ను కులంలకేలి ఎలెత్తం. ఆళ్ళు గన్క పెళ్లి జేశ్కొనత్తే, ఇదే జరుగుద్ది జాగ్రత్త" అని పెద్దమన్శులు నర్సయ్యను భయబెట్టిర్రు.

నర్సయ్యకింకింత ఆగమాగమయ్యిండు. ఒక్కశారిగా తలకాయలో పుర్గు దిర్గినట్లై, ఎంబటే లేశి గుంజకున్న ముస్తాద్లోంచి కత్తి దీశిండు.

"నాతోని ఎవ్వదత్తడో రండ్రి. ఇయ్యలా వాన్ని సంపి, నా కోడల్ని దెచ్చుకుంటా" అని అన్నడు.

పోరగాల్లు, కిరణ్ మల్ల ఆనితోనచ్చిన మన్శులు తలో కట్టె బట్టుకొని గుంపులు గుంపులుగా బోయిర్రు. ఏడబడితే ఆడ అటు నర్సాయ్యోళ్ళు, ఇటు కిరణోళ్లు ఎంత దిర్గిన పూర్ణజోసెఫ్లిద్దరు కనబల్లేదు.

ఇగ కిరణ్కి ఆళ్ళ మన్శులకి మోసచ్చి, కెనాల్ బ్రిడ్జ్ కాడ కూసున్నరు.

"ఎందన్నా, ఎంత ఎతికిన దొర్కుతలేరు" అని గుంపులోంచి ఒకడు అంటున్న, కిరణ్ దేకకుండా ఏదో కదుల్తుందని కెనాల్ కట్టకేలి జాత్తాండు.

"అరేయ్ నాకే కనబడ్తాంద? ఓశారి అటు జూడుండ్ర, ఆడేదో ఉంది" అని జూపిచ్చిండు కిరణ్.

"అవ్ అన్న మాకు కనబడుతాంది"

"సరే బోయి చూద్దాంబా" అని కొంచెం ఆళ్ళు ముందుకుబోగానే పూర్ణజోసెఫ్లిద్దరు నడ్సుకుంటబోతాళ్ళు.

అదిజూశి కిరణోళ్లందరు ఎంబటే ఆగి, నిమ్మలంగా అడ్గులేశి, ఒక్కశారిగా ఆళ్ళ మీద్కి దుంకిళ్ళు.

ఏదో సప్పుడు అయితందని జోసెఫ్ ఎన్కకు దిర్గానే, కిరణోళ్ళు ఆళ్ళ మీదకు ఉర్కిరాడం జూశి, ఎంబటే పూర్ణ శెయ్యి బట్టుకొని ఉర్కబోతుంటే లంగదట్టి ఇద్దరు బోర్లబొక్కల బడ్డారు.

పూర్ణజోసెఫ్లిద్దర్ని సుట్టు ముట్టిర్రు.

"అరేయ్ ఈ పోరిని దీస్కబోయి, నర్సన్నను దీస్కరాబోండిరా" మోసబోసుకుంటా అన్నడు కిరణ్.

జోసెఫ్ని అన్గబట్టి పూర్ణను గొర్ర గొర్ర గుంజుకబోతుంటే కాళ్లడిత్తు అర్తాంది.

"అన్న అన్న మీకు దండం బెడతా, మమ్మల్ని వదిలేయండన్న" అని కిరణ్ కాళ్ళు బట్టుకొని బతిలాడుతుండు జోసెఫ్.

కిరణ్ నవ్వుకుంటా జోసెఫ్ని మోకాళ్ళ మీద కూసోబెట్టి, ఆళ్ళు ఎంట దెచ్చుకున్న కట్టెలతో యిపరితంగా కొట్టిర్రు.

"నువ్వు ఊరిని మార్తావ్రా? దొరకెదురత్తవరా? నీ మోకాన్కి ఈ పోరి గావాళ్లరా? అని సదువుతూ జోసెఫ్ మొకం మీద ఉమ్మేశి, జోసెఫ్ బట్టలు శింపి పారేశిర్రు.

ఆ బర్వాతన జోసెఫ్ రక్తంతో తానం జేశినట్లు అగుపడుతుండు. కనీసం నోట్లకేలి మాటెల్లక సోయిలేకుండా బడ్డాడు. తన రెండు కాళ్ళను ఎడంజేశి మధ్యలో ఒకలు తర్వాత ఒకలు వీడు బతికితే మమ్మల్ని బతకనియ్యడన్నట్లు పిచ్చల్శితికి బోయేట్లు తన్నుత్తుండ్రు. నొప్పిని భరించలేక జోసెఫ్ ఒగ ఒర్రుడు ఒర్రుకుంటా శేతితో భూమిని కొడుతుండు.

అట్నుంచి నర్సయ్య కత్తి బట్టుకొని ఉర్కతాండు. ఆళ్ళు జోసెఫ్ని లేపి తలకాయ బట్టుకోని "అన్న ఏయ్ అన్న నర్కు ఈన్ని" అని రెచ్చగొడుతుండ్రు.

నర్సయ్య కత్తి లేపిండు. ఒక్కశారిగా మెడ దాకచ్చి, ఆగిపోయి ఆలోచిత్తాండు.

"ఏమైందన్న ఏమైంది. నర్కు వాన్ని నర్కు" అని అందరూ అర్తాళ్ళు.

"సంపలేను నే సంపలేను" అని కత్తిని విసిరిగొట్టిండు నర్సయ్య.

అందరు, "ఏంది ఏం జేత్తాండు" అని జూత్తాళ్ళు

"నీకేమన్న తెల్తాంద, శాతకానోన్లెక్క జేత్తానవ్" అని పెద్దమన్శోకడు అనగానే,

"తెల్తాంది అంత తెల్తాంది. నేను ఈ కూని జెయ్యలేను అట్లాని కులాన్ని కాదనలేను. వీన్ని సంపితేనే కులంలో ఉంటాన? నా కోడల్ నాకాన్నే ఉంది, గిప్పుడు వీన్నెందుకు సంపాలి. నేను సంపను. ఇది నా సమస్య నే జూశుకుంటా, మీర్ బోండ్రి ఈన్నుంచి" అని బాధపడుతూ అందర్ని బతిలాడిండు.

"ఛీ వీడబ్బా గిట్ల జేశిండేంది, కొత్వాల్కేం జెప్పలే" అని కిరణ్ అనుకుంటుంటే, పొరగాళ్ళు మల్ల పెద్దమన్శులు ఎల్లిబోయిండ్రు.

నర్సయ్య నెత్తికున్న తువ్వాలను దీశి బర్వాతనున్న జోసెఫ్ నడుంకి గట్టి కూసోబెట్టిండు. జోసఫ్కు సోయి ఉండి లేనట్టుండు. ఒళ్ళంతా రక్తం ధారలు అట్టు గట్టినయ్. నర్సయ్య ఆడి అవస్థ జూడలేక,

"అరే నాయ్న, నా మాటీనురా. నిన్ను జూత్తాంటే నాకు బాధైతాందిరా, అట్లని నా కోడల్నీకు ఇచ్చి పెళ్లిజేయలేను. శాన చిన్నోళ్ళంరా మేము. కులాన్ని కాదని బత్కలేము. బత్దేరువుండదు నా ఇంట్లొళ్ళందరం బదాట్ల బడ్తాం. నావోళ్ళ మధ్య ఏం కానోన్లెక్క బతకాలే. నీకు దండం బెడ్తా, మమ్మల్ని వదిలేయ్రా" అని బతిలాడుకుంటుండు.

నర్సయ్య మాటల్కి జోసెఫ్ ఓపిక దెచ్చుకొని నిమ్మలంగా కండ్లు దెర్శి "నాయిన మేం ప్రేమించుకున్నమే, మీరే మమ్మల్ని ఒదిలెయ్యండ్రి. నీకు పుణ్యముంటది" అని అన్నడు.

పట్టరాని కోపంతో జోసెఫ్ ఎదురుబొచ్చె మీద నర్సయ్య "లంజోడక ఇనవరా" అని ఒక్క తన్ను తన్నగానే ఎల్లెలకల బడ్డాడు. ఎన్కకు దిర్గకుండా నర్సయ్య, జోసెఫ్ని ఆన్నే ఒదిలేశి బోయిండు.

జోసెఫ్ నిమ్మలంగా లేశి తన నడుముకున్న తువ్వాలను సదురుకుంటు, ఒంట్లో నుంచి రక్తం కార్తున్న ఓపిక దెచ్చుకొని ఒక్కో అడుగేశుకుంటు నడ్తాండు.

నర్సయ్య బోయింది జూశి కిరణ్ ఎవలకు కనబడకుండా జోసెఫ్ ఎన్కకచ్చి ఎన్నులోకి నర్సయ్య విసిరిగొట్టిన కత్తి దించిండు.ఏమైందోని దేరుకునే లోపు తన్ను తన్నెశరికి జోసెఫ్ కెనాల్ కట్ట మించేలి జర్ర జర్ర జారుకుంటా వారి మల్లల్లా బడ్డాడు.

జోసెఫ్ నెత్తురుతో వరిశేను తడ్తాంటే లేవలేకబోయిండు. కండ్లు దెలేశి, ఆకాశంలోనున్న సగం ఎన్నెలను జూత్తు పూర్ణ నవ్వోలే గుర్తచ్చి పెదాల చిరునవ్వుతో, "ఈ ఎన్నెల నీ నవ్వులా ఉన్న ఇప్పుడెంత ఎడ్తానవో" అని అన్కుంటు,

"తండ్రి, సమాప్తమైనది.

దేవా, హతుడనై నా జీవాత్మ నన్నొదిలెల్లు సమయాన నీ దరికి నన్ను చేర్చుకోనుము.

ఆమెన్."

 

కవితలు

కొడుకా...

కొడుకా...

ఎట్లున్నవో.

మీ అమ్మ

కంటికి పుట్టెడు దారలు కారుతున్నాయి

నీ జాడ కోసం.

 

కొడుకా.. ఓ కొడుకా

కండ్లల్ల నీరూపే మెదులుతుంది

కాళ్ళల్ల చేతుల్లో తిరిగినట్లున్నది

చాత కానీ ముసలి దాన్ని

కండ్లు లేవు

కాళ్ళు లేవు

నువ్వు యాడ ఉన్నవో చూద్దామన్నా.

 

ఏ యమ కింకర్ల చెరలో చేరితో

ఏ చిత్ర హింసల కొలిమిలో

కాగుతున్న వాడివో కొడుకా.!

 

కొడుకా

అవ్వకు చిన్నొడివి

బుద్దులు నేర్చినొడివు

అందరిలో కలుపుగోలుపుతనము ఉన్నోడి

నీ మీదనే పంచ ప్రాణాలు పెట్టుకున్న అమ్మకు

కన్నీళ్ళ బాటను తెస్తివా కొడుకా

 

ఏ గ్రహణం వెంటాడింది నిన్ను

అమ్మకు కొడుకు యెడ బాటు

చెరసాలనే నీన్ను బందీని చేసేనా

కొడుకా...!!

 

కొడుకా

నీ ప్రేమగల్ల మాటను

నీ రూపును

నేను కన్ను మూసే లోపు చూస్తానా..!?

అవ్వ అన్న పిలుపు

అమ్మమ్మ అనే నీ ఆప్యాయతను

నా గుండెలకు హత్తుకొని

నా కండ్ల నిండా నీ రూపాన్ని

మీ అమ్మతోడు చూసుకొని

మా అమ్మ చెంతకు పోతాను కొడుకా..

 

కొడుకా

రాళ్ళ మీద పూలు పూసే రోజులు రావాలి

మీరు చల్లగ బతుకుండ్రి కొడుకా..

 

(అమ్మమ్మ గంగవ్వ బాధను చూడలేక, అక్రమంగా అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైళ్లలో ఉన్నప్పుడు అమ్మ ములాఖాతుకు వచ్చిన సందర్భంతో (feb 8,2019)పాటు,చివరగా (Feb 17,2022) అమ్మమ్మను చూసి అప్పటి జ్ఞాపకాన్ని ఇప్పటి తల పోతాను కలుపుకొని అమ్మమ్మ మాటనే ఇలా రాసుకున్నది......)

 

 

నవలలు

కూలి బతుకులు – పదవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                         10

బిజెపి పార్టీ రామజన్మభూమి వివాదం రెకెత్తించింది. అద్వాని నాయకత్వలో జరిగిన రథయాత్ర మత ప్రాతిపదికన దేశాన్ని రెండుగా చీల్చింది. ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఎదో విదంగా అధికారంలోకి రావటానికి పన్నిన కుట్రలో బాగంగానే రామజన్మభూమి వివాదం ముందుకు తెచ్చారు. దానికి తోడు మోడిముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన గుజరాత్‍ అల్లర్లు ముస్లీంలూచకోత హిందు మతోన్మాదాన్ని తీవ్ర స్తాయికి తీసుకపోయింది. కాంగ్రెసు పదెండ్ల పాలన ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. సరికదా అనేక కుంభకోణాతో భ్రష్టు పట్టపోయింది. ఈ నేపథ్యంలోనే జరిగిన ఎన్నికల్లో నరెంద్రమోడి నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చింది.

  పదిహెడవ లోకసభ ఎన్నికలను ప్రకటించింది. ఏప్రిల్‍ రెండవ వారం నుండి నాల్గవ వరకు ఏడు పేజుల్లో జరుగనున్నాయి.

  రామయ్య కాలనీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అసలే ఎండలు మండి పోతున్నాయి. అంత కంటే ఎక్కువగా ఎన్నికల వేడి మొదలైంది. రామగుండం పెద్దపల్లి పార్లమెంటు యస్సి నియోజక వర్గంలోకి వస్తుంది. కాని ఎన్నికల్లో పోటీ పడుతున్నాది మాత్రం ఇద్దరు హేమాహేమీలు. పేరుకు వాళ్ళు యస్సిలేకాని అర్థికంగా బాగా బలం కలిగినోళ్ళు.

  తెలంగాణలో అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి తరుపున వెంకటేశ్‍నేతను పోటికి నిలిపారు. రాజకాయాల్లో ఏదీ శాశ్వతం కాదు గత డిసెంబర్‍ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిదిలోని చెన్నూరు నియోజక వర్గం నుండి వెంకటేశ్‍ కాగ్రెసు తరుపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిండు. అంతా అర్నెల్ల కాలేదు. అంతలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చినవి. పార్లమెంటు ఎన్నికల ప్రకటన వెలువడిన తరవుఆత ఆయన టి.ఆర్‍.యస్‍ పార్టీలోకి మారి సీటు దక్కించుకున్నాడు.

  రాజకీయ పార్టీలు ఏవి ఏవిలువలు పాటించటం లేదు. ఎన్నికల్లో గెలువగలిగే సత్త ఉండి, డబ్బు దస్కం బాగా ఖర్చుపేట్టె వారిని ఏరి కోరి, పిలిచి మరి టికట్‍ ఇస్తానయి. అంటే గెలుపు గుర్రాల మీద పార్టీలు పందెం కాస్తున్నాయి. అ విదంగా చూసినప్పుడు వెంకటేశ్‍ నేతఅందుకు సమర్థుడని పార్టీ బావించింది. పెద్దపెద్ద కంట్రాక్టులు చేసి ఆయన వందల కొట్లు సంపాధించిండు.

  ఎన్నికలంటే మాటలు కాదు కొట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. పుట్టపిత్తులా పైసలు ఎగజల్లి ఓట్లు రాబట్టుకోవాలి. ఎన్నికల్లో నెగ్గిన తరువాత అంతకు పదింతలు రాబట్టుకోవచ్చు. రాజకీయాలు పక్తు వ్యాపారం అయిన చోట అంతకంటే ఎక్కువ ఏమి అశించలేము.

  ఇటువంటి రాజకీయాల్లో అరితేరిన వాడు తెలంగాన రాష్ట్ర సమితి నాయకులు చంద్రశేఖర్‍ రావు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తిగా పేరుంది అవిదంగా ఆయన 2014లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకిజరిగిన ఎన్నికల్లో నెగ్గి మొదటి ముఖ్యమంత్రి అయిండు.

 

  అధికారంలోకి వచ్చిన తరువాత అయన అసలు రంగు బయట పడసాగింది.

  ఏ ఆశల కోసమైతే తెలంగాణ ప్రజలు పోరాడిండ్లో ఆ ఆశలను నీరుగరుస్తు పోయిండు. తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి, తనకు ఎవరు రాజకీయాల్లో పోటీ రాకుండా ఉండటం కోసం ఉధ్యమంలో తనతో కలిసి పనిచేసిన వారిని ఒక పద్దతి ప్రకారం పక్కకు పెట్టి అవకాశ వాదులు, జంపు జాలానిలను, తన చెప్పు చేతుల్లో మెదిలే వాళ్ళను పార్టీలో చేర్చుకొని వారికే సీట్లు ఇచ్చి రెండో సారి కూడా అధికారంలోకి వచ్చిండు. తన అధికారాన్ని పటిష్ట పరుచుకొని తన తదనంతరం తన వారసుడే అధికారంలో వచ్చే లక్ష్యంతో మొత్తం యాంత్రంగం సిద్దం చేసిండు.

  ఇప్పుడిక రాష్ట్రంలో ఆయన మాటకు ఎదురు లేదు. ఆయన నంది అంటే నంది పంది అంటే పంది అని తలలు ఊపపటం తప్ప ప్రనజాప్రతినిధులు ఎవరు ఎదురు చెప్పె పరిస్థితి లేదు.

  వాస్తవానికి టి.ఆర్‍.యస్‍. పార్టీ పెద్దపల్లి పార్లమెంటు పార్టీ సీటు వివేక్‍ కు ఇవ్వాల్సి ఉండే. వివేక్‍ రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రమిక వెత్తె కాకుండా అటు కేంద్రం లోను ఇటు రాష్ట్రంలోను పలుమార్లు మంత్రి పదివి చేసిన సుదీర్ఘ రాజకాయ చరిత్ర కల్గిన వెంకటస్వామి కొడుకు.

  తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్‍.యస్‍ పార్టీకి మధ్య సయోధ్య కుదర్చటంలో కీలక పాత్ర వహించిండు. సోనియా గాంధీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు సాసు చేయించటంలో వెంకటస్వామి పాత్ర ఉంది. ఎమైతే నేమి తెలంగాణ వచ్చింది. అయితే అవసరానికి  బొంత పురుగు నైనా ముద్దుపెట్టుకొనే టి.ఆర్‍.యస్‍ నాయకునికి అవసరం లేదనుకుంటే నిర్దక్షక్ష్మీ్యంగా కాలతో తన్నె స్వబావం కూడా ఉంద. అవిదంగా చంద్రశెఖర్‍రావుకు వివేక్‍ మధ్య విబేదాలు పొడుసూపినవి. అందుకు మరో కారణం కూడా ఉంది. కేసిఆర్‍ మొదటి సారి ఎన్నికలకు పోయినప్పుడు తల ఎన్నికల ప్రణాళికలో  తెలంగాణ రాష్ట్రానికి మొదటి  ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిండు. తాను తెలంగాణ రాష్ట్రనికి కావాలి కుక్కలా ఉంటాగాని ఏ పదవులు అశించనని పలు సందర్భాల్లో ప్రకటించిండు. అవిదంగా తెలంగాణలో టి.ఆర్‍.యస్‍ అధికారంలోకి వస్తె మొదటి ముఖ్యమంత్రివి నువ్వె నంటూ వివేక్‍కు ఆశ చూపి డబ్బు దస్కం కాజెసిండు. చివరికి ఎన్నికల ముందు సీట్లు పంచేకాడ వివిక్‍ను ముఖ్యమంత్రి పోటీదారుడుగా రాకుండా చేయ్యటానికి వివేక్‍కు పార్లమెంటు సీటు ఇచ్చిండు. అంతే తనను ముఖ్యమంత్రి కాకుండా చేయటానికి కపట నాటకం అడుతున్నాడని గ్రహించిన వివేక్‍ టి.ఆర్‍.యస్‍ పార్టీని వీడి మళ్ళి కాంగ్రెసు పార్టీలో చెరి అ పార్టీ తరుపున పెద్దపల్లి పార్లమెంటుకు పోటి చేసిండు. కాని అప్పటికి టి.ఆర్‍.యస్‍ గాలి ఉండటం వలన అపార్టీ అభ్యర్థి చెతలో ఓడిపోయిండు.

  సామన్యులకైతే ఎవడు అధికారంలో ఉన్నా ఓరిగేది ఏముండదు కాని వ్యాపార వెత్తలకు పారిశ్రామిక వెత్తలకు అధికారం అండలేకుండా మనుగడ సాధించటం కష్టం అప్పటికి కెంద్రంలో రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెసు పార్టీ, ఒడిపోయి కెంద్రంలో జిజెపి ప్రభుత్వం రావటంతో రెంటికి చెడ్డ రేవడిలా అయింది వివేక్‍ రాజకీయ పరిస్థితి. దాంతో ఆయన చివరికి రాజీపడి పోయి అనివార్యంగా మళ్ళీ టి.ఆర్‍.యస్‍ పార్టీలోకి వచ్చిండు. అట్లా వచ్చిన వారికి ఎదో నామినేటడ్‍ పదవి అయితే కెసిఆర్‍ ఇచ్చిండు కాని వీడు ఎప్పటికైనా తనకు ప్రమాదమేనని బావించిన కెసిఆర్‍అదను చూసి వివేక్‍ను చావు దెబ్బతీసిండు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే గడువు చివరినిముషం ముగిసే వరకు నాన్చి చివరినిమిషంలో వెంకటేశ్‍కు సీటు ఇచ్చిండు. వివేక్‍ ఇంకో పార్టీ తరుపున ముఖ్యంగా కాంగ్రెసు తరుపున పోటీ చెయటానికి వీలు లేకుండా చేసిండు. దాంతో వివేక్‍కు అటు టి.ఆర్‍.యస్‍ తరుపున కాని కాంగ్రెసు తరుపున కాని పోటికి నిలబడే పరిస్థితిలేకుండా పోయింది.

  కాంగ్రెసు పార్టీ చివరి నిముషం వరకు వివేక్‍ను సీటు ఇవ్వటానికే ఎదురు చూసింది. కాని చంద్రశెఖర్‍రావు వారికి అటు వంటి అవకాశం ఇవ్వలేదు.

  కాని చాల విచిత్రం ఏమిటంటే కాంగ్రెసు తరుపున ప్రస్థుతం పోటీ చేస్తున్న చంద్రశెఖర్‍రావు కూడా ఒకప్పుడు టి.ఆర్‍.యస్‍ పార్టీకి చెందినవాడు. అ పార్టీ తరుపున ఎమ్మెల్యెగా నెగ్గి రాజశెఖర్‍ రెడ్డి ప్రభుత్వంలో టి.ఆర్‍.యస్‍ పార్టీ తరుపున మంత్రిగా చేసినవాడు. ఇప్పుడు కాంగ్రెసు అభ్యర్థి తన భవితవ్యాన్ని తెల్చుకోవటానికి బరిలోకి దిగిండు.

  జిజెపి పార్టీకి తెలంగాణలో బలం అంతంత మాత్రమే. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంనుండి నిన్న మొన్నటి నక్సలైట్‍ మూమెంటు వరకు అనేక పోరాటలు జరుగటం వలన ప్రజల్లో కమూనిస్టు బావజాలం ఎక్కువ. పలితంగా జిజెపి మతోన్మోద రాజకీయాలు తెలంగాణలో అంతగా ప్రబావం చూపలేక పోయింది. హైద్రాబాద్‍ పట్టణంలో మాత్రం ఎం.ఐ.ఎం. ప్రాబల్యం ఎక్కువ ముస్లీంమతో న్మోదాన్ని రెచ్చగోట్టి అక్కడ అ పార్టీకి ఒక పార్లమెంటు సీటు, అరేడు అసెంబ్లీ సీట్లు ఎప్పుడు గెలుస్తుంటాయి. దానికి ప్రతిగా అ ప్రాంతంలో బిజెపి హిందు సమాజాన్ని రెచ్చ గొట్టె కొంత బలంసంపాదించి అక్కడి నుండే ఒక రెండు అసెంబ్లీ సీట్లు గెలుస్తుంది తప్ప తెలంగాణ వ్యాపితంగా దాని ప్రాబల్యం తక్కువ కాని ఈ సారి కెంద్రంలో బిజెపి అధికారంలో ఉండటం వలన దాని అండ దండలతో బిజెపిపార్టీ తెలంగాణలో పాగా వేయాటానికి సిద్దమై చాలచోట్ల తను అభ్యుర్థులను నిలిపింది. అవిదంగా బిజెపి కూడా పెద్దపల్లి అసెంబ్లికితన అభ్యర్థిని నిలిపింది.

  ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్నవి. ఇది వరలో అయితే రెపు ఎన్నికలనగా అంతో ఇంతో తాగబోయించి, పదో పర్కొ చేతుల్లో పెట్టి ఓట్లు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాలేదు. ఓటర్లను ప్రలోభ పెట్టి ఖర్చుబాగా పెరిగిపోయింది. చివరికి మీటింగ్‍లు పెట్టాలన్నా ర్యాలీలు తీయలన్నా జనాలకు బిర్యాని పొట్లాలు ఇచ్చి మందు పోసి మీదికేలి రోజు మూడు నాలుగు వందల చేతిలో పెడ్తెకాని జనం రావటంలేదు. ఇవ్వాళ ఈ మీటింగ్‍లకు పోయిన వాళ్ళె మరో రోజు మరో పార్టీ పిలిచే మీటింగ్‍ లకు పోతాండ్లు. ఇకతాగు బోతులకైతే ఎన్నికలు వచ్చిన వంటే పండుగే మరి.

  కాంగ్రెసు నాయకుడు ఒక పర్యయం వచ్చి కాలనీలో ఇల్లిల్లు తిరిగి పోయిండు. టి.ఆర్‍.యస్‍ నాయకుడు వెంకటేశం మాత్రం కాలనీకైతే రాలేదు. కాని ఆయన అనుచరుడు సత్యనారయణను పంపించి గోదవరిఖనిలో తమనాయకులతో జరిగే బారి బహిరంగ సభకు మనిషికి ఐదువందలు ఇచ్చి మరి తీసుకపోయిండ్లు.

  రామయ్య కాలనీలో కూలీలు రెండు గ్రూపులుగా చీలిండ్లు. ఒకటితెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ల దైతే రెండోది కాంగ్రెసు వాళ్ళది. ఈ రెండు పార్టీలు కాకుండా బిజెపికి చెదిన అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నడుకాని  అతనికి అంతగా అర్థిక స్థోమత లేదు. ఎదో ఒకటి రెండు సార్లు జీపుల్లో వచ్చి ఒక రౌండు కాలనీలో తిరిగి పోయిండ్లు. అది కూడా కంట్రాక్టరు రంగయ్య బలవంతం మీద.

  కాలనీలో కాంగ్రెసు పార్టీకి చిన్న చితుక కంట్రాక్టులు చేసే జానకిరాం నాయకత్వం వహిస్తే టి.ఆర్‍.యస్‍ పార్టీకి సుబ్బారావు నాయకత్వం వహిస్తున్నారు.

  గంగమ్మకల్లు బట్టీ కాడ సాయంత్రమే కాదు. పొద్దంత కూలీలు ముగుతున్నారు.

  ‘‘మీరేమి రంది పడకుండ్లే కడుపు నిండా తాగుండ్లే బిల్లు సంగతి నేను చూసుకుంటా’’ అంటూ జానికిరాం బరోసా ఇచ్చిపోయిండు.

  సాయంత్రం అయితే కనుకమల్లు ఇంటికాడ చీప్‍ లిక్కర్‍ పంచుతాండ్లు. అవిషయం తెలిసి రాంలాల్‍ వచ్చి నాగయ్యను కనకమల్లు ఇంటికి తీసుక పోయిండ్లు. అక్కడ రాజీరు కనిపించి ‘‘కొడుకు టి.ఆర్‍.యస్‍ తండ్రి కాంగ్రెసు’’ అన్నాడు వ్యంగంగా....

  అమాటకు నాగయ్యకు మనసుకు బాదేసింది సత్తెన్న గులాబి జెండా పట్టుకొని తిరుగుతాండు. నియోజక వర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సత్యనారాయణ సత్తెయ్యను వెంటేసుకొని తిరుగుతండు. రామయ్య కాలనీ బాధ్యతంత నువ్వె చూడాలిఅంటూ సత్యనారాయణ సత్తెయ్య మీద బారం పెట్టిండు.

  అప్పటి నుండి సత్తెయ్య క్షణం రికామి లేకుండా తిరుగుతాండు. అవసరం కొద్ది ఎమ్మెల్యే రాసుక పుసుక తిర్గెసరికి సత్తయ్య ఉబ్బితబ్బిబ్బు అయి ఎన్నికలు తప్ప వేరే లోకం లేకుండా పోయింది.

  రాజీరు మాటలకు చిన్నబోయిన నాగయ్యను చూసి రాంలాల్‍ ‘‘వాడుత్తతాగుబోతు... వాని ఇంట్లకేలి ఎమన్నా ఇస్తాడా.. మంచి మంచోళ్లె ఇయ్యల ఈ పార్టీలో ఉంటే రేపు మరో పార్టీలో ఉంటాండ్లు. రాజీరు మాటలేమి పట్టించుకోకు అన్నాడు.

  అయిన నాగయ్య మనసు ఓప్పక కనకమల్లు ఇంట్ల అడుగుపెట్టక అటునుంచి అటే తిరిగి వచ్చిండు. అది చూసి కనకమల్లు ఎన్నికల సమయంలో ఇటువంటివ ఏం పట్టించుకోవద్దు అంటూ రాజీరు మీద కోపం చేసిండు.

  తెంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ కాలంలో మొదటి నుండి పని చేసిన కవారిని కాదని నిన్నగాక మొన్న పార్టీ మారిన వాన్ని పిలిచి టికట్‍ ఇచ్చుడేందీ అంటూ మొదటి నుండి జెండా మోసిన వాళ్ళు కొందరు అలిగి పార్టీ విడిచిపోయిండ్లు. మరికొందరిని బురదగించి నామినేట్‍డ్‍ పదువులు వస్తయని ఆశ చూపి కొందరిని డబ్బులిచ్చి కొందరిని అధికార పార్టీ కాపాడుకొన్నాది.

  ఓట్ల కోసం నాయకులు కులాల పేరు మీద ప్రాంతాల పేరుమీద జనాలను చీల్చిండ్లు. జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి ‘‘ఇదిగోమనమంత ఒక్కటిగా ఉండాలి. లోకలోల్ల మాటలు విని మనం బొర్లా పడవద్దు. కాంగ్రెసుపార్టీ అంటే ఎనకటి నుంచి ఉన్న పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీ స్థాపించిన పార్టీ కుక్కమూతి పిందెల్లా పుట్టుకొచ్చె ప్రాంతీయ పార్టీలు ఇవ్వాల ఉంటాయి రేపు మట్టికలుస్తయి వాటిని నమ్ముకుంటే లాభం లేదు. నేను చంద్రశేఖర్‍ సారుతోని మాట్లాడిన ఎన్నికల్లో నెగ్గిన తరువాత ఆయన చేసే మొదటి పని ఏటంటే మన అందరికి రేషన్‍ కార్డులు ఇప్పిసతనన్నడు. మన ఓరియా వాళ్ళకు తాగేందుకు మంచి నీళ్ల పంపులు వేయిస్తనన్నడు.

  ‘‘అంటూ చెప్పుకొచ్చిండు.

  జనాలకు ఆ మాటలు సమజ్‍ కాలే ఇయ్యాల ఎన్నికలు వచ్చినయిని ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవటానికి ఇటు ఓరియా వాళ్ళమని అటు ఆంద్రోళ్లని ఎదో ఎదో చెప్పుతున్నరు కాని వాళ్ల జీవితంలోవాళ్ళె ప్పుడు అ తెడాలు పాటించనే లేదు. కూలి చేసేకాడ అందరు సమానమే. ప్రాంతలు వేరైనా వారందరి బాధలు ఒక్క తీరుగానే ఉన్నాయి. ఒకరి కష్ట సుఖల్లో మరోకురు పాలుపంచుకున్నారు. అక్క తమ్ముడు అంటూ వరసలు పెట్టి పిలుచుకున్నారు. అంతెందుకు నెల రోజుల క్రింద లారీమీది క్లినర్‍ పనలు చేసే చన్నులాల్‍ చనిపోతే వీళ్ళు వాళ్ళు అనకుండా అందరు కలిసి మనిషింత చందాలు వేసుకొని చావు చెసిండ్లు.

  చన్నులాల్‍కు ఎనక ముందు ఎవరు లేరు. కుటుంబం ఎక్కడో ఓరిస్సాలోని మారు మూల గ్రామం ఒక్కడే పని వెతుక్కుంటు వచ్చిండు. అందరితో కలవిడిగా ఉండేవాడు. ఒక్కడే ఉండేవాడు. ఎమైందో ఎమో వానికి టి.బి. వచ్చింది. చీకేసిన బొక్కలా బొక్కలు తేరి, తిండికి లేక ఎండి పోయి ఎండిపోయి సచ్చిండు.

  జానకిరాం కూడా ఒకప్పుడు అందరిలాగే పొట్ట చేతపట్టుకొని బ్రతక వచ్చిండు. కాని కాస్త హుషారు తనం ఎక్కువ. అట్ల ఇట్ల చేసి కంట్రాక్టర్ల దగ్గర మేస్త్రీ పనిచేస్తూ క్రమంగా సబ్‍ కంట్రాక్టులు పట్టి నాల్గు పైసలు సంపాదించిండు. ఎవరిని లెక్క చేసేటోడుకాదు. అటువంటి వాడు ఎన్నికల వచ్చే సరికి మెత్తమెత్తగా మాట్లాడుతాండు. లేని ప్రేమ వొలక పోస్తాండు.

  ‘‘ముందుగాల పంపులు వేయించుండ్లీ, నీళ్ళు దొరకక హరిగోస పడ్తానం’’ అంటూ బసంత్‍ నాగ్‍ భార్య సుభనా అడ్డుతగిలింది.

  జానకిరాం సుభన కేసి చూసి ‘‘ఎన్నికల్లోగెలిచినంక చేయించే మొదటి పని అదే’’ అన్నాడు మరోసారి.

  ‘‘ఆఎన్నికలైనంకమా మొఖం ఎవలు చూస్తరు’’ అంటూ హరిరాం అడ్డుపడ్డడు.

  ‘‘ఎన్ని ఏన్నికలు చూడలేదు ఎన్నికలప్పుడు గిట్లనే చెప్తరు పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్లు. రెషన్‍ కార్డులు ఇప్పిస్తమన్నారు. పంపులు వేయిస్తమన్నారు. ఓట్లు వేయించుకొని గెలిచి ఇటు మొఖంరాలే’’ అంటూ మరోకరుగుణిగిండు.

  జానకిరాంకు మనసులోకోపం కల్గింది కాని బయట పడలేదు. మొఖం మీద శాంతాన్ని తెచ్చుకొని’’ టి.ఆర్‍.యస్‍ వాళ్ళ పనే అంత. ఎన్నికలప్పుడు మాట చెప్తరు. గెలిచినంక ఇటుదిక్కు అయినా రారు. కాని మన సారు అట్లా కాదు. మాటిస్తె చేసేదాక నిదురపోడు’’ అన్నాడు బరోసాగా...

  ‘‘ఆ అందరుగంతే’’ అన్నాడు మరోకరు.

  పరిస్థితి చెయ్యిదాటెట్టుందని జానకి రాంకు అర్థమైంది. ఇంకా ఎక్కువసేపు మీటింగ్‍ పొడిగిస్తె ప్రమాదమని బావించిండు.

  ‘‘ఇదిగో నామాట నమ్ముండ్లీ. మనమంతా ఒక్కకటే ఈ సారి మాట తప్పెదుంటే మళ్ళీ మీకు నా మొఖం చూయించ’’ అన్నాడు.

  మీటింగ్‍ ముగించి జానకిరాం సోన్‍లాల్‍, ప్రసాత్‍, రాంజీని, గోపాల్‍, బాసంతనాగ్‍ను వెంట బెట్టుకొని వెళ్ళిపోతుంటే సుభాన పెద్ద గా గొంతు చేసుకొని ‘‘ఇంట్ల తిండికేం లేదు. తాగితందానలాడి వస్తే ఊరుకునేదిలేదు. అ ఇచ్చేది ఎదన్నా ఉంటే మాకే ఇచ్చిపోండ్లి’’అంది.

  జానకిరాం చిన్నగానవి ‘‘ఇప్పుడదేంలేదు’’ అంటూ వాళ్ళను తోలుకొని పోయిండు.

  రామయ్య కాలనీలో జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి మాట్లాడిన సంగతి తెలిసి సుబ్బారావు అగమెఘాల మీద తెలుగోళ్ళ గుడిసెలను చుట్టెసి బెంగాలివాళ్ళ గుడిసెల కేసి నడిచిండు.

  ‘‘బెంగాలి వాళ్ళయి ఎన్ని ఓట్లుంయి’’ అని సత్తయ్యను అడిగిండు.

  ‘‘ఎంతలేదన్నా యాబై అరువై ఉంటయి’’ అన్నాడు సత్తయ్య వినయంగా...

  ఒక్క ఓటు కూడా జారిపోవద్దు.. అందర్ని కలువాలి ఎట్లయితే వింటరో అట్లా విన్పించాలి. డబ్బుల గురించి అలోచించవద్దు... ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఓట్లు మనకు పడాలి’’అన్నాడు సుబ్బరావు.

  సమస్యేలేదు సార్‍... ఒక్క ఓటు కూడా అపోజిషన్‍కు పోదు... అందరు మనోళ్ళె’’అన్నాడు సత్తయ్య...

  ‘‘అట్లాఅనుకోవద్దు...వోవర్‍ కాన్పిడేన్స్కు పోతే అసలుకే మోసం వస్తది’’ అన్నాడు సుబ్బారావు బొమ్మలు ఎగరేసి.

  సుబ్బారావు తన అనుచరులతో కలిసి బెంగాలి వాళ్ళ గుడిసెలకేసి నడిచిండు.

  తూర్పు పాకిస్తాను బంగ్లాదేశ్‍గా విడిపోయినప్పుడు కాందీశీకులుగా వచ్చిన వారికి ఉపాధి కల్పించటంకోసం దేశంలోని వివిద ప్రాంతలకు పంపించిండ్లు. అట్లా కొంత మంది రామగుండుం వచ్చిండ్లు. ఎన్టిపిసి పనులు సాగినప్పుడు అందులో చాల మంది పని చేసిండ్లు. కాని నిర్మాణపు పనులు పూర్తయిన తరువాత పనులు లేక చాలమంది వేరే ప్రాంతాలకు వలసపోయిండ్లు. చాల కొద్ది మంది మాత్రం మిగిలిండ్లు.

  బెంగాలికార్మికులు ఉండే గుడిసెలు మిగితా కార్మికులు ఉండే గుడిసెల కంటే కాస్త బిన్నంగా ఉంటాయి. ఉన్నంతలో గుడిసేలను బందోబస్తుగా కట్టుకుంటరు. శుచి శుభ్రత పాటిస్తరు.

  సుబ్బారావు తన అనుచరులతో అక్కడికి చేరుకునే సరికి టి.కే సర్కార్‍ ఇంటి మీద కాంగ్రెసు జెండా ఎగురుతు కన్పించింది. సత్తయ్య కేసి ఇదెంటన్నట్టుగా చూసిండు.

  ‘‘వాడుత్త తలతిక్కవాడు. ఊరంత ఒక దారి అయితే ఉలిపికట్టది మరో దారి అన్నట్టుగా ఉంటాడు. వానితో అయ్యదిమి లేదు. మిగిత వాళ్ళంత మనతోనే’’ అన్నాడు సత్తయ్య...

  సుబ్బయ్య ప్రచారానికి వసున్న సంగతి సత్తయ్య ముందే బెంగాలి కుటుంబాలను కలిసి చెప్పి పెట్టి ఉంచిండు. కొంత మంద పనులు కూడా మానుకొని ఉండిపోయిండ్లు. వీళ్ళు అక్కడికి పోయే సరికి బినయ్‍ మండల్‍, డూకిరాం, విమల్‍పాండే ఎదురోచ్చి రెండు చేతులు జోడించిండు. సుబ్బారావు ప్రతిగా చిర్నవ్వులు చిందిస్తూ’’ ఏంటీ సంగతి ఎట్లా ఉంది’’ అని అడిగిండు.

  ‘‘అంత ఓకే సార్‍’’ అంటూ బినయ్‍ మండల్‍ బదులిచ్చిండు. సుబ్బారావు సర్కార్‍ ఇంటికేసి చూస్తూ’’ కాంగ్రెసు వాళ్ళు మనకంటే ముందే మేలుకున్నట్టుంది’’ అంటూ తనుమానంగా చూసిండు.

  ‘‘అది కాదు సార్‍ టికే సర్కార్‍ జానకిరాం మనిషి ఆయన్ని పట్టుకొనే క్యాజువల్‍ వర్కర్‍ అయ్యిండు’’ మిగితా వాళ్ళంతా మనం ఎంత చెప్పితే అంతా’’ అన్నాడు మిమల్‍పాండే...

  ‘‘ఎమో’’ అంటూ సుబ్బారావు దీర్ఘం తీసిండు.

  ‘‘అదేం లేదు సారు మా మాటలు నమ్మండి’’ అన్నాడు బినయ్‍మండల్‍...

  గుడిసెల మధ్య కాస్త కాళీస్థలంఉన్న చోట పెరిగిన వేపచెట్టు నీడన మూడు కుర్చిలు వేసి ఉన్నాయి. అందరు అటుకేసి నడిచిండ్లు. సబ్బారావు, సత్తయ్య మరోకరు కుర్చిలో కూచోగా మిగిత వాళ్ళంత వాళ్ళ చుట్టు నిలబడ్డారు.

  మీటింగ్‍ అనే సరికి అడోళ్ళు మొగోళ్ళు పిల్లలు వచ్చిండ్లు. అరువై ఎండ్ల పైబడిన సరస్వతి మండల్‍ కూడా వచ్చింది. ఆమెకు కండ్లు సరిగా కనిపిస్తలేవు. ఎవరో పెద్ద లీడర్లు వస్తరంటే అగం అగం వచ్చింది. ఆమె కొడుకు కోశన్‍ మండల్‍ను కంట్రాక్టరు పనిలో నుండి తీసేసిన తరువాత ఇంట్లో వెళ్లటం కష్టమైతంది. పెద్ద లీడర్లు వస్తాండ్లు అంటే వాళ్ళను బ్రతిమిలాడి ఎట్లనో అట్లనో కొడుకును తిర్గి పనిలో పెట్టించాలనే యావతో వచ్చింది.

  సుబ్బారావు కాసేపు అది ఇది మాట్లాడన తరువాత మెల్లగా అసలు విషయం ఎత్తిండు ‘‘మీకు అందరికి ఎన్నికలు జర్గుతున్న సంగతి తెలుసు. మన టి.ఆర్‍.యస్‍పార్టీ తరుపున వెంకటేశ్‍ అన్ననను పార్టీ నిలబెట్టింది. మనమంత కలిసి ఆయన్ని గెలిపించాలి మీకేమన్నా సమస్యలుంటే అవి పరిష్కరిస్తాం. ప్రభుత్వం మనది మనం ఎదీ అనుకుంటే ఆ పని చేసుకోవచ్చు’’ అంటూ క్షణమాగి అందరికేసి చూసి మళ్ళీ మాట్లాడ సాగిండు.

  ‘‘మీ సమస్య ఎందో నాకు తెలియందాకాదు. డ్యాంకట్టినప్పటి నుండి మీరు చేపలు పట్టుకొని బ్రతుకుతాండ్లు. మధ్యలో సొసైటీలు పుట్టుకొచ్చి మిముల్ని బయటికి నెట్టెసిండ్లు. దాంతో చాల మందికి బ్రతుకు తురువు పోయింది’’ అన్నాడు.

  ‘‘నిజమే’’ అన్నట్టు చాల మంది తలలు అడించిండ్లు.

  ‘‘అందుకేనేనేమంటానంటే సొసైటీ వాళ్ళు బ్రతకాలి, మీరు బ్రతకాలి అందరు బ్రతికే ఉపాయం అలోచించాలి. అందుకే ఎన్నికలు అయిన తరువాత వెంకటేశన్నా మీరు కూడా డ్యాంలో చేపలు పట్టుకునే ఎర్పాటుల చేయిస్తనన్నడు. వెంకటేశన్న గురించి మీకు తెలియదు అల్తు పాల్తు ముచ్చట్లు చెప్పెటోడు కాదు. ఎదాన్నా చేస్తనంటే అరునూరైనా చేస్తడు అటువంటి మనిషి’’ అంటూ చెప్పుకొచ్చిండు.

  ‘‘మీరా పనిచేస్తే మేమంత రుణపడి ఉంటాం’’ అంటూ బినయ్‍ మండల్‍ రెండు చెతులు జోడించిండు.

  ‘‘ఆ విషయం మాకు వదిలేసి మీరు నిర్రందిగా ఉండండ్లీ’’ అంటూ సుబ్బారావు వెంట వచ్చిన మరో లీడర్‍ కేశవులు బరోసా ఇచ్చిండు’’

  జనం సంతృప్తిగా చూసిండ్లు.

  సరస్వతి మండల్‍కు ఈ మాటలేమి తలకు ఎక్కటంలేదు. తన కొడుకు సంగతెందో తెలుసుకోవాలని వచ్చింది. మనసులో తొలుస్తున్న అవెదన మాటల రూపం సంతరించుకోగా....

  అయ్యా మా పొల్లగాన్ని కంట్రాక్టరు పనిల పెట్టుకుంటలేడు’’ మీరు చెప్పివాన్ని పనిలో పెట్టియ్యాలి అంది.

  ‘‘దానికి వీళ్ళెమి చేస్తరే’’ విమల్‍ పాండే ముసల్దాని మాటకు అడ్డుపోయిండు.

  ‘‘మరెందుకు వచ్చిండ్లు’’

  ‘‘ఓట్లు వెయ్యాలి ఓట్లు’’ఎవరో అన్నరు.

  ‘‘ఓట్టు వేస్తే ఏమొస్తది. ఎన్నిసార్లు వెయ్యాలట’’ అంటూ మసక బారిన కండ్లతోని పరిక్షగా చూసింది.

  గా ముసల్దాని మాటలు పట్టించకోకండ్లీ సారు ఎడ్డ ముసల్ది భర్త చనిపోయిండు. కొడుకుకు పనిలేక తిరుగుతాండు’’ అన్నాడు గోపాల్‍.

  సుబ్బారావు తెలిగ్గా నవ్వి ‘‘ఎర్కె ఎర్కె’’అంటూ ముసల్దానిమాటలు పట్టించుకోకుండా బినయ్‍మండల్‍తో మాటల్లోకి దిగిండు.

  ‘‘అయ్యా ఏం చెప్పకపోతిరి’’ ముసల్ది మళ్ళి అడిగింది.

  ‘‘అరేయ్‍ ముసల్దాన్ని ఇక్కడి నుంచి తీస్కపొండ్లిరా’’ ఎవరో కసిరిండు.

  ఓ ఇద్దరు ముందుకు వచ్చి అవ్వ సార్‍ నీ కొడుకును పనిలో పెట్టిస్తరు... పదపద అంటూ రెండు రెక్కలు పట్టుకొని దాదాపు బలవంతంగా ప్రక్కకు తీస్క పోయిండ్లు.

  అ ముసల్ది గింజుకుంటూ ‘‘పనులు లేకుంటే మనష్యులు ఎట్లా బతుకతరు. తిండిలేక కడుపులు మాడ్చుకొని చస్తానం’’ అంటూ గింజుకుంటుంది.

  కాసేపు మాట్లాడిన తరువాత ‘‘మీకే మన్నా అవసరం ఉంటే సత్తన్న చూస్తడు... ఎవరు మోహమాట పడవద్దు...కాని ఒక్క ఓటు కూడా చీలి పోవద్దు’’ అన్నాడు సుబ్బారావు.

  సుబ్బారావు పోవటానికి లేచిండు. బినయ్‍ మండల్‍ చాయ్‍తాగి పోవాలని బలవంతంచేసిండు. కాని ఇంకా క్రషర్‍ నగర్‍ కాకాతియ నగర్‍ తిరుగాల్సి ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీ ఇంటి కాడ తీరుబడిగా చాయ్‍ తాగుతా’’ అంటూ సుబ్బారావు లేచిండు.

  రోడ్డుకు ఒక వైపు ఎన్టిపిసి దేదీప్యమానంగా ఉంటే రోడ్డుకు అవలవైపున దుకాణాలు, వర్క్షాపులున్నాయి. వాటిని అనుకొని గుట్ట బోరుమీద చిన్న చిన్న గుడిసెలున్నాయి. మనిషి నిలుచుంటే నడుము వరకు వచ్చే పులి పాకల్లోనే ఎంత లేదన్నా రెండు మూడు వందల ఓట్లు ఉన్నాయి.

  ఎన్నికలప్పుడు తప్ప నాయకులు వాళ్ళ గుడిసెలకు రావటం జరుగదు. ఎండ్లు గడుస్తున్న వాళ్ల బ్రతుకుల్లో మార్పెమి రాలేదు.

  వాళ్ళు అక్కడికి చేరుకునే సరికి ఒక  విదమైన కపం వాసన గప్పుమంది. అయినా అదేమి పట్టించుకోకుండా ముందుకు సాగిండ్లు. భగవాన్‍ మెస్త్రీకి వాళ్ళ కంట్రాక్టరు దివాకర్‍రావు అరోజు అక్కడ మీటింగ్‍ ఉండే సంగతి ముందే చెప్పి పెట్టడం వలన, ఆయన జనాలను కుప్పెసి నాయకులకోసం ఎదురుచూస్తుండి పోయిండు.

  సుబ్బారావు రావటం చూసి భగవాన్‍ మెస్త్రీ ఎదురొచ్చి ఆయన్ని తొడ్కొని పోయి ఒక్క రాల చెట్టు కాడికి తీసుక పోయిండు. అప్పటికే అక్కడ పోగేసిన జనం పులుకుపుకున చూస్తున్నారు.ఒంటిమీద సరిగా బట్టలు లేని పిల్లలు రంగురంగుల జెండాలను జనాలను చూసి హడావిడి చేస్తున్నారు.

  భగవన్‍ మేస్త్రీ సుబ్బారువు కేసి అబ్బురంగ చూసి ‘‘వీళ్ళంత మనోళ్ళె సారు...’’ అన్నాడు.

  సుబ్బారువు చిన్నగా చిర్నవు నవ్వ తలాడించిండు. ‘‘తీళ్ళంతా దివాకర్‍రావుదగ్గర పని చేసేవాళ్ళే కదా’’ అన్నాడు.

  ‘‘చాల మంది వాళ్ళే సార్‍ కొద్ది మంచి మాత్రం అక్కడిక్కడ కూలిపనులు చేసేవాళ్ళు ఉన్నారు. కానిమెజార్టీ మనవాళ్ళే’’అన్నాడు భగవాన్‍మేస్త్రీ...

  అప్పటికి మధ్యహ్నం దాటి పోయింది. కడుపులో అకలిగా ఉన్నా, మళ్ళి ఇక్కడి దాక రావటం ఎందుకని సుబ్బారావు ఒక్కడి దాక వచ్చిండు. దాంతో ఆయన వీలయినంత తొందరలో మీటింగ్‍ ముగించాలనే అలోచనలో ఉండిపోయి, ఎక్కువ అలస్యం చేకుండా, అక్కడ గుమి కూడిన జనాలను ఉద్దెశించి మాట్లాడటం మొదలు పెట్టిండు. తాము ఎన్నికల్లో గెలిస్తె ఇది చేస్తాం అది చేస్తాం అంటూ తియ్యతియ్యని మాటలు చెప్పసాగిండు.

  దస్త్రు భార్య శ్రావణబాయ్‍ అతని మాటలకు అడ్డుపోయి ‘‘పోయిన సారి ఎన్నికలప్పుడు వచ్చినోళ్ళు బోరింగ్‍లు వెయించిండ్లు. కాని అందులో చుక్క నీరు వస్తలేదు. మీరు వచ్చె తోవల ఎన్టిపిసి మురికి నీళ్ళ కాలువ ప్రక్కన మేము తవ్వుకున్న బాయి నీళ్ళె తాగుతనం. ఎండ కాలం వస్తై అయిత నీళ్ళు కూడా దొరకతలేవు. గదాని సంగతెందో చూడాలి’’ అంది పెద్ద గొంతుక చేసుకొనని...

  టీకురాం భార్య పుష్ప కల్పించుకొని ‘‘వర్షకాలంలో కూడా నీళ్లకు కరువువొస్తాంది. బాయిలకు మురికినీరు చేరి తాగవశం అయితలేదు’’ అంది. ‘‘రేషన్‍బియ్యం వస్తలేవు’’ అన్నారు మరోకరు.

  సుబ్బారావు ఒపిగ్గా విన్నడు. ‘‘మీకు ఏఏ సమస్యలు ఉన్యాయో అవన్ని మన భగవాలన్‍ మేస్త్రీకి చెప్పండి. ఈ సారి మీ సమస్యలన్ని పరిష్కరిస్తాం’’ అన్నాడు. భాగవన్‍ మేస్త్రీ కేసి తిరిగి ‘‘వీళ్ళ సమస్యలన్ని రాసుకొని వచ్చి అఫీసుకాడికి రా, ఎన్నికలు అయిన తరువాత చేసే మొదటి పని అదే’’ అన్నాడు.

  భగవాన్‍ చెమట కంపుతో నిండిన అపరిసారల్లో నాయకులు ఎక్కువసేపు నిలబడలేకు పోయిండ్లు. బలవంతుపు పేరంటం ఎదో ముగించుకున్నట్టుగా, ఎంత హడావిడిగా నైతే వచ్చిండ్లో అంతే హడావిడిగా ఎల్లిపోయిండ్లు.

  పోతు పోతు భగవాన్‍ మేస్త్రీని ప్రక్కకు పిలిచిన సుబ్బారావు ‘‘సాయంత్రం వీళ్ళ ఎర్పాట్లు ఎవో నువ్వె చూడాలి. ఒక్క ఓటు కూడా చీలి పోవద్దుఅన్నాడు గుమ్మనంగా...

  రాజీరు మాటలు అవమానం అన్పించి కోపంతో నాగయ్య ఇంటికైతే వచ్చిండు కాని మనసు లో మాత్రం తాగాలనే కొరిక అలాగే ఉండిపోయింది.

  కాలనీలో చినన్న ప్దె అనకుండా తాగి ఊగుతాండ్లు. కాలనీలో రెండు గ్రూపులుగా చీలి పోయిండ్లు. ఒకటి టి.ఆర్‍.యస్‍ పార్టీ అయితే మరోకటి కాంగ్రెసు వాళ్ళది. ఎవరు ఖర్చుకు వెనుకాడటంలేదు. గంగమ్మ కల్లు దుకాణం కాడ జాతర సాగుతుంది. ఇక మీటింగ్‍లప్పుడు, ఎదైనా జూల్సు తీసినప్పుడైతే పండుగైతాంది. బిర్యాని పొట్లాలు, చీప్‍ లిక్కర్‍ పవ్వలకు ఎక్కలేదు. అకలికి మొఖం వాచిపోయి ఉన్న వాళ్ళు తినేకాడికి తిని బిర్యాని పొట్లాలను చాటు మాటుగా ఇంటికి తీస్కపోతాండ్లు. ఇదంతా సుబ్బారావు కనిపెట్టక పోలేదు... లేకి ముండా కొడుకులు... ఎన్ని రోజులు తింటరో తననియ్‍.. అనుకొన్నాడు. పై నాయకులెమో పైసల గురించి లెక్క చేయకుండ్లి. ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఓట్లు మాత్రం మనకు పడాలి’’అంటున్నారు.

  టి.ఆర్‍.యస్‍ పార్టీ వాళ్ళ దాటికి కాంగ్రెసు వాళ్ళు తట్టుకోవటం కష్టమైతంది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి శెఖర్‍రావుకు టిక్కట్‍ అయితే ఇచ్చిందికాని పార్టీ పంపించిన డబ్బులు ఏమూలకు సరిపోతలేవు. తన చేతి చమురు కొంత ఖర్చు పెట్టిండు కాని అపోజిషన్‍ వారితో సరితూగటం లేదు.

టి.ఆర్‍.యస్‍ పార్టీ అధికారంలో ఉంది. దాని అధినాయకునికి ఎన్నికల్లో ఎట్ల గెలువాలో, •నాన్ని ఎట్లా బురిడి కొట్టించాలో తెలిసినంత విధ్య మరోకరకి తెలియదు. దానికి తోడు ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిండు. ఎట్లాగైనా చేసి ఎన్నికల్లో గెలువాలనే పట్టుదలతో ఉండిడబ్బుకు ఎనక ముందు చూడటం లేదు.

  నాగయ్య ఇంట్లా నుండి బయిటికి వచ్చె సరికి గులాబి రంగు జెండాలు పట్టుకొని చిన్న పిల్లలు జైతెలంగాణ అంటూ బిగ్గరగా అరుచుకుంటూ ఊరేగుతాండ్లు. తన ముందు నుండే పోతున్న పిల్లల్లో ఎనిమిదెండ్ల దస్త్రు కొడుకు వినయ్‍ను ఆపిన నాగయ్య ఉత్సుకత కొద్ది ‘‘జెండాలు ఎక్కడియిరా’’ అని అడిగిండు.

  ‘‘సత్తెన్న ఇచ్చిండు’’ పైసలు కూడా ఇచ్చిండు అన్నాడు పిల్లవాడు ఉత్సాహంగా...

  కొడుకు పేరు చెప్పె సరికి నాగయ్య మనసులో బాదేసింది. ఎన్నికల్లో వాడు కాలనీలో అన్ని తనై వ్యవహరిస్తున్నాడు. దాంతో ఆయన ‘‘ఊరంత పైసలు పంచుతాండు. పవ్వలుపంచుతాండు కాని అయ్య అని ఒక పవ్వ అయినా ఇయ్యక పాయే’’ అంటూ తనలో తనే గుణుక్కున్నడు.

  పిల్లలు అరుచుకుంటూ అతన్ని దాటేసి పోయిండ్లు. విసురుగా ఇంట్లోకి వచ్చిన నాగయ్యకు భార్య ఎదురు పడింది. దాంతో కొడుకు మీద కోపం భర్య మీద తీల్చిండు.

  ‘‘ఊరంత పవ్వలు పంచుతాండు... ఇంట్లా అయ్య ఉన్నడన్న జాషే లేకపాయే’’ అన్నాడు విసురుగా...

  శాంతమ్మ ఒకసారి భర్తకేసి తేరపారచూసి ‘‘ ఆ పాపపు సోమ్ము తాగకుంటెంది ఇయ్యల తాగిపిస్తరు తినిపిస్తరు.. తరువాత మొఖం చాయించరు, జనం ఇంట్ల పాడుగాను ఎర్రి లేసిన కుక్కల తీర్గ పుణ్యానికి వచ్చిదంటే పీకలదాక తాగుతండ్లు. అంటూ గయ్యిమంది.

  భార్య కోపం చూసి నాగయ్య వెనక్కి తగ్గి ‘‘అదికాదే... అంటూ ఎదో చెప్పబోయిండు.

  ‘‘వాడెమో పని బందు పెట్టి పిచ్చోని తీర్గ ఎన్నికలంటూ తిరగబట్టె, ఇంటికాడ కోడులు ఒక్కతే కూలిపనులు చేసుకుంటూ కుటుంబం ఎల్ల దీయబట్టె. ఎన్నికల్లో తిరుగతే ఎమోస్తదట.... ఇయ్యల అవసరం కొద్ది సత్తెన్నా అని బుదగరించే సరికి వీడు ఎక్కడ అగుతలేడు. నాకు వాడు ఎరుకే వీడు ఎరుకే అంటూ విర్ర వీగుతాండు. నాకు రేపు ఎన్నిలు అయిపోని ఎవ్వడన్నా లీడర్‍ వీని మొఖం చూస్తడా? అసంగతి వానికి అర్థం అయితలేదు... చేసుకుంటే బ్రతికటోళ్ళం.... ఎవని బుద్ది వాని కుండాలే’’ అంటూ కొడుకు మీద కోపం చేసిండు.

  నాగయ్య మారు మాట్లాడకుండా ఇంట్లోకి పోతుంటే రాంలాల్‍ కేకేసి నాగన్న ఎం చేస్తానవు. ఇందక పోదం రావే’’ అని పిలిచిండు.

  నిన్న జరిగిన అవమానం గుర్తుకు విచ్చి నాగయ్య ‘‘మళ్ళి ఎక్కడికి’’ అని అడిగిండు.

  ‘‘సత్తెన్న గోపాల్‍ ఇంటికాడ పవ్వలు పంచుతండట... పోదాం రావే’’ అన్నాడు నోరు తెరిచి....

  సత్తెన్న పేరు చెప్పెసరికి నాగయ్య కోపం కాస్త నీరుగారి పోయింది. చడి సప్పుడు చేయకుంటా రాంలాల్‍ వెంటనడిచిండు.

  ‘‘పోండ్లీ పోండడ్లీ మంది ఉచ్చ తాగటానికి... వీళ్ళకు ఎట్లా బుద్దివస్తదో’’ అంటూ వెనుక నుండి శాంతమ్మ అరుస్తున్న లెక్క చెయ్యకుండా నాగయ్య ముందుకు పోయిండు.

  ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ప్రచారవేడి మరింత పెరిగింది. సత్తయ్య ఒక వైపు జానికిరాం మరో వైపు పోటిపడి రామయ్య కాలనీలో ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం చెయ్యల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాండ్లు.

  గంగమ్మ కల్లు మొద్దు కాడ రెండు పార్టీలకు చెందిన వారి మధ్య మాటామాట పెరిగింది.

  ‘‘అరెయ్‍ తెలంగాణలో బ్రతికుతు తెలంగాణకే ద్రోహం చేస్తారారా’’ అటూ పుటగాతాగిన రాజం ఓరియా కార్మికుడు మాలిక్‍ బిహరీతో గర్షణ పడ్డడు.

  మాలిక్‍ బీహరీ ఏ మాత్రం తగ్గలేదు. లప్పటికే రెండు పవ్వలు లాగించిండు. మళ్ళీ మందిని తోలుకొని కల్లు బట్టకాడికి వచ్చిండు. అది ఇది పడే సరికి మనిషకి భూమీద కాలు అగుతలేదు.

  ‘‘తెంలంగాణ మీ అయ్య సొత్తారా.. మా సొనియమ్మ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా’’ అంటూ ఎదురు తిరిగిండు.

  మాటమాట పెరిగి చివరికి తన్నులాటకు దారి తీసింది. విషయం తెలిసి సత్తెయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యిండు.

  ‘‘ఎక్కడి నుంచి బ్రతక వచ్చిన వాల్లకే ఇంతుంటే మనకు ఎంతుండాలి’’ అంటూ ఇంతేత్తు లేచిండు.

  ‘‘ఇదే అదును అనుకున్న సుబ్బారావు’’ వాళ్ళ కింత డిమండి రావాటానికి కారణం ఆ జానకి రాంగాడు. వాని అసర చూసుకొనే వీళ్ళు ఎగురుతాండ్లు... ముందు వాని సంగతి చూడాలి’’ అంటూ సన్నగా ఎగదోసిండు.

  ‘‘నిజమే ముందు వాని సంగతి చూడాలి’’ అన్నాడు సుబ్బారావు అనుచరు శివరాం...

  జానికిరాం మొదటి నుండి కాలనీలో ఉన్న వ్యక్తి. దాంతో పరిచయాలు ఎక్కువ. ఒక్క పికే రామయ్య కాలనీలోనే కాదు. క్రషర్‍ నగర్‍లోని ఓరియా కార్మికులను కూడా సెంటిమెంటు రేకేత్తించి ఒకటి చేసిండు. దానిక తోడు తనకున్న పాత పరిచయాలతో చాపక్రింద నీరులాగా ప్రచారం సాగించిండు. టి.ఆర్‍.యస్‍ పార్టీ వాళ్ళకు కాలనీలో అంత బలమైన నాయకత్వం లేదు. అ పార్టీ తరుపున సత్తయ్య ఉన్నడు కాని, అతను యువుకుడు జానకిరాం లాగా కూలీలతో మొదటి నుండి సంబందం ఉన్న వ్యక్తి కాదు.

  నిన్న మొన్నటి వరకు సత్తయ్య తన పనెందో తాను అన్నట్టుగా బ్రతుకుతు వచ్చిండు. అటు వంటి సత్యయ్యను సుబ్బారావు దగ్గరికి తీసి జుజాల మీద చేతులేసి నీ అంతటోడు లేడు అనే సరికి ఉబ్బి పోయిండు. పనికి ఎగనామం పెట్టి రాత్రింబావాళ్లు ఎన్నికల ప్రచారంలో మునిగి పోయిండు. అపోజిషన్‍ పార్టీని దెబ్బతీయాలంటే జానకిరాంను అడ్డు తొలగించాలని బావించిండు సుబ్బారావు. మనసులో ఆ అలోచన పెట్టుకొని మెల్లగా సత్తయ్యను ఎగదోసిండు.

  సత్తయ్య ఉబ్బిపోయి ‘‘వాని సంగతి నాకు వదిలెయ్యండి’’ అంటూ అవేశ పడ్డడు.

  ‘‘వాడెక్కడి నుంచో వచ్చి మనదగ్గర పెత్తనం చేస్తానంటే ఎట్లా కుదురుద్దీ... మనం ఎంత చెప్పితే అంత....వాని గంతి చూడాల్సిందే’’ అంటూ సుబ్బారావు మరింత రెచ్చగొట్టిండు.

  సత్తయ్య రెచ్చిపోయి, రాజయ్య, దశరథం చిట్టపల్లి చంద్రయ్య, మరికొంత మందిని వేంటేసుకొని జానికిరాం మీద దాడికి పోయిండు. అందరికందరు పుటగా తాగి ఉన్నారు. ఎవరు చక్కగా నిలబడే పరిస్థితి లేకుండా ఉంది.

  వీళ్ళు పోయే సరికి జానకిరాం ఓరియా వాళ్ళ గుడిసెల కాడ ఎదురైండు. ఆయన వెంట ఓరియా కార్మికులు కిషన్‍, చ్రకధర్‍ మరి కొంత మంది ఉన్నారు.

  జానకిరాం ను చూసే సరికి సత్తయ్యకు ఎక్కడ లేని కోపం కల్గింది. వెతక పోయిన తీగ కాలుకే తగిలిందని సంబర పడ్డడు. ‘‘నాకొడుకు ఈ సారి తప్పించుకోవద్దు’’ అంటూ అందరి కంటే ముందు ఉరికిండు.

  దూరం నుండే వీళ్ళ వాలకం చూసి జానకిరాం ప్రమాదం శంకించిండు. ఎందుకైనా మంచిది అని అతను కాస్త వెనక్కి తిరిగి ఓరియా వాళ్ళ గుడిసెల మధ్యకు వచ్చిండు. అక్క మరికొంత మంది ఓరియా కార్మికులు పోగయ్యిండ్లు.

  సత్తయ్య జట్టు వాళ్ళు బాగా తాగి ఉన్నారు. చేతిలో కర్రలు పట్టుకొని సర్రున వచ్చి రావటం తోనే జానకిరాం మీద

  దాడికి దిగిండ్లు.

  వాస్తవానికి జానకిరాం తనపై దాడి చేస్తారని ఊహించలేదు. కాని వచ్చెవాళ్ళ వాలకం చూసి కొంత అనుమానం కల్గి వెనక్కి వచ్చిండు. ఊహించని దాడికి అతను మొదట కొంత కంగారు పడ్డా అవెంటనే తేరుకొని ‘‘చూస్తారెందిరా నా కొడుకుల్ని తన్నండి’’ అంటూ తన అనుచురులను పురమాయించిండు.

అరుపులు కేకలు...

  ఓడ్డెరోళ్ళు బండలు కొట్టి కాయ కష్టం చేసి చేసి మొద్దు బారిన చేతులు. జానకిరాం ఒక్కడే ఎదురైతే పరిస్థితులు ఎలా ఉండేదో ఎమోకాని ఓడ్డరి కార్మికుల నుండి ప్రతిఘటన ఎదరయ్యే సరికి వాళ్ళ శక్తి ముందు వీళ్ళ శక్తి చాలకుంటైంది. అందులో తాగి ఉన్నారు. దాంతో ఎక్కువ సేపు నిలబడ కుండానే తోక ముడవాల్సి వచ్చింది.

  అప్పటికి జరుగ వలిసిన నష్టం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారి తలలు పగిలినవి. జానికి రాం ఎంత తప్పుకున్న లాబం లేకుండా పోయిందిఉ.

  అటు సత్తయ్యకు ఇటు జానకిరాంకు తలలు పగిలినవి. కారిన నెత్తురుతో తడిసి పోయిండ్లు.

  పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చిండ్లు.

  శాంతి బద్రతలకు ఎటువంటి బంగం కల్గకుండా ఎన్నికలు శాంతియుతంగా చట్టబద్దంగా సజావుగా జరిగినవి. ఎన్నికల సంఘం ప్రకటించింది.

  ఎన్నికల్లో టి.ఆర్‍.యస్‍కు చెందిన అభ్యర్థి లక్ష్మణ్‍ మెజార్టీతో అపూర్వ విజయం సాధించాడు.

  ‘‘తెలంగాణ ప్రజలు తమ పార్టీపై ఉన్న విశ్వాసానికి ప్రబల నిదర్శనం ఈ విజయం’’ అంటూ ఆ పార్టీ నాయకుడు ఉత్సాహంగా ప్రకటించిండు.

  తన ఓటమిని అంగీకరిస్తూ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రత్యేకంగా తయారు చేయించిన నిలువెత్తు పూల దండతో వచ్చి వెంకటేశ్‍ను సత్కరించిండు.

  ‘‘ఎన్నికల్లో గెలుపు ఓటమిలు చాల సహజం కాని స్నెహం మాత్రం చిరస్థాయిగానిలుస్తుంది’’ అంటూ ఓడిపోయిన కాంగ్రెసు అభ్యర్థి గెలిచిన అభ్యర్థిని కౌగిలించుకొని తన సహృదయత ప్రకటించిండు. ఇద్దరు చిర్నవ్వులు చిందించారు.

  అది చూసి జనం అనందంగా చప్పట్లు చరిచారు.

 

  గవర్నమెంటు హస్పటల్లో ఉన్న కొడుకును చూడటానికి నాగయ్య, శాంతమ్మ పోయిండ్లు...

  కొట్లాటలో దెబ్బలు తాకి హస్పటల్లో పడ్డ సత్తయ్యను చూడటానికి ఏ నాయకుడు రాలేదు. వాళ్ళంత ఎన్నికల్లో గెలిచిన సంబరాల్లో మునిగి పోయిండ్లు...

  హాస్పటల్‍ బెడ్స్ లేక నేల మీద పడుకొన్న సత్తయ్య, మరో ప్రక్కన జానకిరాం కన్పించిండు.

  తలకు పెద్ద కట్టుతో ఉన్న కొడుకును చూసి శాంతమ్మకు దు:ఖం అగలేదు. ‘‘వానింట్ల పీనుగులెల్ల... ఎన్నికలో ఎన్నికలని కొడుకు ప్రాణాలు తీసిరి... ఎందుకు వచ్చిన ఎన్నికలు, ఎవ్వని బాగు చెయ్యటానికి వచ్చిన ఎన్నికలు... పెద్ద పెద్దోలంత మంచి గున్నారు. వాళ్ళ మాయలో పడి తన్నక చస్తిరి’’ అంటూ శోకం తీసింది.

  నాగయ్య కండ్లలో నీళ్ళూరినయి....

  సత్తయ్య, జానకిరాం ఒకరి మొఖాలు ఒకరు చుసుకున్నారు.

 

(అయిపొయింది)

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -23 

1903 లో  హిందూసుందరి పత్రికలో ఒక రచన మాత్రమే ప్రకటించబడి తెలుస్తున్న  స్త్రీలు 16 మంది  ఉన్నారు. వీళ్ళ సమకాలపు సావిత్రి వంటి పత్రికలలో గానీ తరువాతి కాలంలో మరే పత్రికలో గానీ వాళ్ళ రచనలు కనబడవు. ఈ మొత్తం రచనలలో ఎక్కువభాగం ఉపన్యాసాలు, వ్యాసాలు. తరువాతి స్థానం కవిత్వానిది. కథ ఒకే ఒకటి.

ఆ కథ పేరు లోభివాని కథ. ( ఆగష్టు 1903) రచయిత్రి శ్రీధర సీతాదేవమ్మ. అప్పటికే భండారు అచ్చమాంబ ఆధునిక కథకు అంకురార్పణ చేసినా స్త్రీలు నీతికథల మూసలోనే కథలు వ్రాసారు. లోభివాని కథ ఆ కోవలోదే. ఒక వూళ్ళో ఒక లోభివాడు. కొబ్బరి పచ్చడి తినాలనిపించి కొబ్బరి కాయ కొనటానికి బయటకు వెళ్ళాడు. బజారు లో కొబ్బరి కాయ ధర  ఎక్కువ అనిపించి తక్కువకు దొరికే ప్రాంతాన్ని వెతుక్కొంటూ రాజమండ్రి , అమలాపురాలు మీదుగా హైదరాబాద్ వరకూ వెళ్లి అక్కడ కానీ ఖర్చు లేకుండా ఒక సరస్సు ఒడ్డున సరస్సు పైకి వంగిన కొబ్బరి చెట్టు కాయలు కోయటానికి ఎక్కి జారి పడిపోతున్న  తరుణంలో కూడా డబ్బు ఆశ వదలక చేతి పట్టు వదిలి తనను కాపాడటానికి ప్రయత్నించిన నవాబును, రాజును కూడా  తనతో పాటు నీళ్లలో మునిగి చనిపోయేట్లు చేసిన లోభివాడి కథ ఇది. ఉన్నవూళ్ళో కొబ్బరి కాయ కొనటానికి డబ్బు కోసం చూసుకొన్న వాడు, చౌకగానో , అసలు డబ్బే పెట్టకుండానో దానిని సంపాదించటానికి చేసిన ప్రయత్నంలోని ప్రయాసను, నష్టాన్ని పతాక స్థాయిలో చూపించిన ఈ కథ లోభత్వం వినాశకరం అని చెప్తుంది. ఇంత సాధారణమైన నీతి కథను ఆధునిక అవసరానికి ముడిపెట్టి వ్యాఖ్యానించటం  ఈ కథకు కొసమెరుపు. ఒక్క రూపాయి పెట్టి హిందూసుందరిని తెప్పించి తమ స్త్రీలకు విద్యనేర్పించని లోభుల ఇల్లాండ్రు మూఢురాండ్రై తుదకు ఇలాంటి కీడే తెచ్చిపెడతారన్న నీతి తో ఈ కథను ముగించటంలో ఉంది రచయిత్రి చమత్కారం.

1903 నాటికి స్త్రీలు సంప్రదాయ ఛందో రీతులలో  కవిత్వం వ్రాస్తూనే ఉన్నారు. వాటితో పాటు స్త్రీలకే ప్రత్యేకమైన మంగళహారతులు , కీర్తనలు వ్రాస్తున్నారు. అయినారపు వెంకట రమణమ్మ స్త్రీల విధేయత అనే శీర్షిక కింద ( నవంబర్ 1903) నాలుగు  పద్యాలు వ్రాసింది. మొదట చివర సీస పద్యాలు , మధ్య రెండూ ఉత్పలమాల ఒకటి, తేటగీతి మరొకటి. “ జనని గర్భమునందు జన్మించినది మొదల్ యత్తవారింటికి నరుగువరకు … “ అని మొదలయ్యే ఈ పద్యం తల్లిదండ్రుల ఆజ్ఞ కాదనక బుద్ధిని విద్యయందు హద్దు పరచి వినయం, నమ్రత, లజ్జ , శీలం, సత్యం , శాంతం, దయ, ఉపకారం , నిర్మలత్వం మొదలైన గుణాలను అభివృద్ధి పరచుకొని మెలిగితే తల్లిదండ్రులకు పేరు , ప్రజల మెప్పూ లభిస్తాయి కనుక బాలికలకు అలాంటి జ్ఞానం ఇచ్చే చదువు నేర్పాలని చెప్పింది వెంకట రమణమ్మ. పిల్లలను గారాబం చేసి పాడు చేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించింది ఒక పద్యంలో. మరొక పద్యంలో స్త్రీలు అత్తమామల మీద  భక్తి , భర్త మీద మనసు పెట్టి అతనే దైవమని పూజించే స్త్రీకి భగవంతుడు సర్వ సంపదలు ఇస్తాడని ఆశపెడుతుంది. చివరి సీసపద్యంలో ఏ తీర్ధ యాత్రలు, జపతాపాలు, ఉపవాసాలు, దేవతా పూజలు, పుణ్య తీర్ధ స్నానాలు పతి పాదపూజతో సరి రావని కనుకప్రాణేశు పాదసేవ మానవలదుఅని స్త్రీలకు హితవు చెప్తుంది. ఎంతో కాలంగా గతానుగతికంగా స్త్రీధర్మాలుగా ప్రబోధించబడుతున్న వాటినే మళ్ళీ చెప్పింది.

పద్యరచనా శక్తి పరీక్షలలో సమస్యా పూరణ ఒకటి. ఒక పద్య శకలం సమస్యగా ఇచ్చి మిగిలిన భాగాన్ని పూరిస్తూ అర్ధవంతమైన పద్యం వ్రాయమనటం ఒకటి. ఆధునిక యుగపు తొలినాళ్ళ స్త్రీల పత్రికలలో సమస్యా పూరణ పద్యాలు వ్రాసిన మహిళలు చాలామంది కనబడతారు. శ్రీ రాజా బొడ్డు రాజ్యలక్ష్మమ్మ ( రాజ్య లక్ష్మీ దేవమ్మ ) ఒకరు. ఇచ్చిన సమస్యశునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్” ( డిసెంబర్ 1903)దానిని కలుపుకొని ఆమె రామాయణార్ధంలో పద్యం వ్రాసింది. “కనకాంగి వినుము రామునినని మార్కొని రావణుడు శరావళి గురియన్ \ ఘన శూరుడైన సీతే శునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్అన్నది ఆమె వ్రాసిన పద్యం. సీతేశునకు +అమ్ములు అని విడదీసి రావణుడు వేసిన బాణాలు సీతకు ఈశుడు , భర్త అయిన రాముడి మీద నాటుకొని పువ్వులై శోభించాయని చమత్కరించింది. ఆ సంచికలోనే పాలేపు మాణిక్యాంబ అదే సమస్యను తపస్సులో ఉన్న శివుడి మనసు పార్వతిపై లగ్నం కావాలని మన్మధుడు వేసిన బాణాలు శివుడి పై పూలై శోభావహించాయని పూరించింది.

వేప గుప్తాపు మహాలక్ష్మమ్మ ( జులై 1903 ) యే. కనకమ్మ ( సెప్టెంబర్&అక్టోబర్ 1903) కీర్తనలు వ్రాసారు. మహాలక్ష్మమ్మ కీర్తన సరస్వతీ స్తుతి. స్త్రీల కీర్తనలు  సాధారణంగా లక్ష్మీ పార్వతుల స్తుతి రూపకంగా ఉంటాయి. ఎందుకంటే నోములకు, వ్రతాలకు అధిదేవతలు వాళ్ళే కనుక. ఈ నేపథ్యంలో సరస్వతీ స్తుతి అరుదైనదే. “వందనంబులందు () వారిజాసను రాణి వందనంబు లంది  నా వంత దీర్పవమ్మఅన్న పల్లవితో ప్రారంభమైన ఈ కీర్తనలో అయిదు చరణాలు ఉన్నాయి. కవుల చెంత చేరి ఉంటుందని, విదుషులను బ్రోచు విద్యా కల్పవల్లి అని సరస్వతి స్థానాన్ని , దయను గురించి చెప్తుంది. “విద్యలేని స్త్రీ వెతల బాపవమ్మాఅని కోరటం లోవిద్యాశ్రీ నొసగి వేగ బ్రోవరమ్మాఅని ప్రార్ధించటంలో స్త్రీవిద్య పట్ల రచయిత్రి ఆర్తి కనబడుతుంది. యే. కనకమ్మ కీర్తన లో   “ సత్యముగాను  పణతూ లందరికీ పతిభక్తి భూషణమూ బాగుగానుండవలెన్అన్న పల్లవే చెబుతుంది దాని స్వభావాన్ని. సావిత్రి మొదలైన సతులు పతిభక్తి వల్లనే గణనకు ఎక్కారని ఆడవాళ్లు అబద్ధాలు ఆడరాదని నీతులు చెప్తుంది ఈ కీర్తన.

టి. రామలక్ష్మమ్మ (ఆగష్టు 1903), పేరు లేకుండా ఒక స్త్రీ అనే సర్వనామంతో మరొక స్త్రీ వ్రాసిన మంగళ హారతులు రెండు ఉన్నాయి. రామలక్ష్మమ్మ వ్రాసినది భగవంతుడి గురించిన కీర్తన కాదు. అప్పుడు భారతదేశపు బ్రిటన్ ప్రభువుగా ఉన్న  7 వ ఎడ్వర్డ్ గురించి. అతని పూర్తి పేరు ఆల్బర్ట్ ఎడ్వర్డ్. క్వీన్ విక్టోరియా పెద్దకొడుకు. 1901జనవరి 22 న అతను అధికారంలోకి వచ్చాడు. “ మంగళమని, మంగళమని మంగళమనరే మంగళమని పాడరే ఎడ్వర్డ్ గారికిఅనే పల్లవితో మొదలయ్యే ఈ పాటలో అయిదు చరణాలు ఉన్నాయి. భారతీయుల కోర్కెలు తీరేట్లుగా అతను ఇండియాకు ప్రభువు అయ్యాడని  మహిళలందరిని అతనికి మంగళ హారతులిమ్మని పిలుపు ఇచ్చింది ఈ పాటలో . సమకాలీన రాజకీయాల పట్ల స్త్రీలలో ఆసక్తి ని , ప్రతిస్పందనను నమోదు చేసిన పాట ఇది . ‘ఒక స్త్రీవ్రాసిన మంగళహారతి( సెప్టెంబర్ 1903)  “మంగళమూ నీకంబా మాతల్లీ జగదాంబా …”  అనే పల్లవి తో అయిదు చరణాలలో పార్వతికి ఎత్తిన హారతి. ఈ మంగళ హారతి కర్తగా ఆమె తనపేరు చెప్పుకొనటానికి ఇష్టపడలేదు కానీ ఆమె పేరు వెంకటరత్నము అని ఆ మంగళహారతే చెప్తున్నది. వరము లిచ్చి బ్రోవమని , దీన జనులను బ్రోవమని వేడుకొంటూదాసాను దాసురాలగునట్టి వెంకటరత్నము నే బ్రోవు మరి మరీ వేడేదా’  అని తనగురించి చెప్పుకొన్నది. మంగళహారతి, కీర్తన రచనలలో చివరి చరణాన్ని రచయిత నామాంకితంగా వ్రాసే సంప్రదాయాన్ని పాటించటం వల్ల ఇలా ఆమె పేరు వెంకట రత్నము అని తెలుస్తున్నది. కానీఅదే సంచికలో ‘“రామ రామ నన్ను నీ రచ్చశాయనేలరా , తామసంబు మానుమా కామితార్ద దాయకఅనే పల్లవితో ప్రారంభించి ఒక సుందరి’  వ్రాసిన నాలుగు చరణాల పాట రచనలో ఈ సంప్రదాయం పాటించబడలేదు కనుక ఆమె అసలు పేరు ఏమిటో మనకు తెలియకుండానే పోయింది.  

కథ, కవిత్వం, కీర్తనలు , మంగళ హారతులు వ్రాసిన ఈ ఎనిమిది మంది రచయితల తరువాత మిగిలిన వాళ్ళు తొమ్మిది మంది. వీళ్ళు వ్రాసినవి వచన రచనలు. వాటిలో వ్యాసాలు ఉన్నాయి. ఉపన్యాసాలు ఉన్నాయి. స్త్రీలకు సంబంధించిన సమస్యలపై స్త్రీల అవగాహనకు ఇవి అద్దం  పడతాయి. ప్రధానంగా ఇవి విద్యకు సంబంధించినవి. అందుకు మినహాయింపు రెండు వ్యాసాలు.

ఒకటి వైధవ్య సమస్యను చర్చించింది.ఆ వ్యాసంనిజమైన జననీ జనకులు.’ (జూన్, 1903).  రచయిత్రి  పార్నంది వెంకట రమణమ్మ. ఈ వ్యాసంలో ఆమె ఆడపిల్లలకు , మరీ ముఖ్యంగా వైధవ్యం పొందిన స్త్రీలకు  నిజమైన జననీ జనకులు   కందుకూరి వీరేశలింగం , ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ అని అంటుందికూతుళ్లు  భర్త మరణించి వైధవ్యం పాలైతే తల్లిదండ్రులు అల్లుడి సొమ్మును అపహరించి పిల్లకు జుట్టు తీయించి ముసుగేసి వంట పొయ్యిదగ్గర ఉంచి ఒంటిపూట తిండి పెట్టి ఏకాదశి ఉపవాసాలు చేయించిఆమె అత్తవారింటి రొక్కంతో వడ్డీవ్యాపారం చేస్తూ బాలవితంతువు ఘోష పుచ్చుకొని వాళ్ళు తల్లి                                                                                                                               దండ్రు లు ఎలా అవుతారన్నది ఆమె తర్కం. తల్లిదండ్రులు, బంధువులు ఎవరు వెనుకంజ వేసినా వితంతువులను చేరదీసి , ఆదరించి, జీతాలు కట్టి చదువులు చెప్పిస్తూ వాళ్ళ మంచి చెడ్డలు చూస్తున్న, వాళ్ళ జీవితానికి ఒక మార్గం చూపుతున్న వీరేశలింగం దంపతులే నిజమైన జననీ జనకులు అవుతారని ఆమె తేల్చి చెప్పింది

మరొకటి దేవగుప్తాపు మహాలక్ష్మమ్మ ది కాకినాడ శ్రీ విద్యార్థినీ సమాజం లో చేసిన చిన్న ప్రసంగం. (డిసెంబర్ )పోచిరాజు మహాలక్ష్మమ్మ అనే మహిళ ఉన్నతోద్యోగి అయిన భర్త తో ఆ వూరు వదిలివెళ్తున్న సందర్భంలో ఏర్పరచిన వీడుకోలు సభలో ఆమె ఈ మాటలు మాట్లాడింది. రక్త సంబంధాలకన్నా , బంధుత్వాల కన్నా ఆధునిక యుగంలో స్నేహ బంధాలు బలవత్తరం అవుతున్న విషయాన్ని, ఆ స్నేహాలు సాధారణ ఆసక్తులు, పాల్గొనే కార్యక్రమాలను బట్టి ఏర్పడుతాయన్న విషయాన్ని ఈ ప్రసంగం సూచిస్తుంది. శ్రీ విద్యార్థినీ సమాజంలో స్త్రీల ప్రయోజనాలకోసం పనిచేయటమే వాళ్ళ స్నేహ సూత్రం. తమతో కలిసి పనిచేసిన స్త్రీ , స్త్రీల విద్యకోసం ఇంకెంతో పని చేసి సమాజానికి మేలు చేకూరుస్తుంది అను కొన్న నెచ్చలి వియోగానికి విచారం ఇందులో వ్యక్తం అయింది

1903 ఫిబ్రవరి సంచికలో రుద్రవరపు కామేశ్వరమ్మ , వేమరుసు మహాలక్ష్మి స్త్రీవిద్యను ప్రస్తావిస్తూ వ్రాయటం మొదలుపెట్టారు. ఒక సుందరి అనే సర్వనామంతోనీతిని గూర్చిఅనే వ్యాసం ( ఏప్రిల్) ప్రచురించబడింది.సమాజ ప్రార్ధనకు స్త్రీలను ఇంటికి ఆహ్వానించిన ఒక స్త్రీ చేసిన ఉపన్యాసం ఇది. . సమాజ ప్రార్ధన అంటే  బ్రహ్మసామాజికులు సామూహికంగా చేసే ఏకేశ్వరోపాసన. అందుకోసం స్త్రీలు తోటి స్త్రీలను తమ ఇళ్లకు ఆహ్వానించటం, స్త్రీలకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుకొనటం, ప్రార్ధనలు చేసి కీర్తనలు పాడుకొనటం అదొక అలవాటుగా మారిన కాలం అది. అలా ఈ సుందరి కూడా తన ఇంట్లో సమాజ ప్రార్థనకు స్త్రీలను పిలిచింది. వాళ్ళను ఆహ్వానిస్తూ ఆమె చేసిన చిన్న ప్రసంగమే ఈ వ్యాసం

అబలా సచ్చరిత్ర రత్నమాల వ్రాసిన భండారు అచ్చమాంబ సకుటుంబంగా తమ నగరానికి వచ్చిన విషయం ప్రస్తావించింది. అచ్చమాంబ నాగపూర్ లో ఉంటున్నా రచయిత్రి గా స్త్రీ జనాభ్యుదయ ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా తెలుగు దేశపు స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకొన్నది. 1902 డిసెంబర్ నుండి కుటుంబంతో ఆంధ్రదేశంలోని వివిధ నగరాలను సందర్శిస్తూ కాశీకి వెళ్ళింది. బందరు లో మొదలుపెట్టి 1903 జనవరి ,ఫిబ్రవరి నెలలలో ఏలూరు, రాజమండ్రి కాకినాడ మొదలైన నగరాలలో పర్యటించి స్త్రీల సమావేశాలలో ప్రసంగాలు చేసింది. ఆమె తమ నగరానికి వచ్చి ఆనందం కలిగించిందని ఈ సుందరి చెప్తున్నదంటే ఈమె నివాసం ఏలూరు , రాజమండ్రి , కాకినాడ లలో ఎదో ఒకటి అయి ఉంటుంది. అచ్చమాంబ సద్గ్రంధాలు చదివితే ఆమె ఉన్నతమైన ఉద్దేశాలు అర్ధం అవుతాయని, విద్యామహత్యం వల్లనే ఆమె అందరి హృదయాలను ఆకర్షించగలిగిందని అంటుంది ఈ సుందరి.

చోరులు తస్కరించరానిది, పరులకు ఇచ్చినా తరగనిది విద్య అని , అలాంటి విద్య పురుషులకు మాత్రమే అందుబాటులో ఉందని, క్రైస్తవ స్త్రీలు కూడా ఉన్నత విద్యలో కనిపిస్తారని చెప్పి , ఇరుగుపొరుగు వారి అభ్యంతరాలకు, ఇంట్లో ముసలమ్మల సణుగుడుకు భయపడి ఆడపిల్లల చదువు మూడు నాలుగు తరగతుల లోనే మాన్పిస్తున్నారని ఒక వాస్తవాన్ని చెబుతూ స్త్రీలే చదువు చెప్తున్న బడులకు ఆడపిల్లలను పంపక పోవ టాన్ని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలు చదివిన ఆ కాస్త చదువు కూడా పెళ్లిళ్లు అయి సంసారాలు మీదపడిన తరువాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నదని బాధపడుతుంది. ఇంటి పనులు అయినా తరువాతనైనా సరే కాస్త సమయం కేటాయించి సద్గ్రంధాలు చదువరాదా అని వేడుకొన్నది. చదువు జనాభివృద్ధి సాధకం అని పేర్కొన్నది. విద్య కన్నా విలువైనది నీతి అని దానివలన విద్యకు వన్నె చేకూరుతుందని సీతను ప్రస్తావిస్తూ నీతి శ్రేష్ఠతను వక్కాణించింది.

దేశాభిమానము గల స్త్రీలకొక ప్రార్ధనఅనే వ్యాసంలో (జూన్ ) గొడవర్తి బంగారమ్మ దేశంలో అనేకరకాలైన పేదరికాలు ఉన్నాయని , విద్యలో ప్రత్యేకించి స్త్రీ విద్యలో దేశం కడు పేదరికంలో ఉందని కనుకనే ఈ దేశంలో స్త్రీలు బానిసలవలె ఏలబడుచున్నారని చెప్పింది. న్యాయంగా స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన స్నేహం కొరవడటానికి విద్య లేకపోవటమే కారణం అంటుంది. నాగరికతకు మూలభూతమైన విద్యను స్త్రీలలో వృద్ధిచేయటానికి మహా జనసభలు పూనుకోవాలని , గడచిన సంవత్సరం కలకత్తా సభ స్త్రీవిద్య గురించి ప్రస్తావించటం సంతోషం కలిగించింది అని చెప్పింది.

స్త్రీవిద్యకు తగిన వసతులు లేవని, క్రిస్టియన్ మిషనరీలు అందుకు కొంత పనిచేశాయని స్త్రీలకు బడులు పెట్టి స్త్రీలను ఉపాధ్యాయులుగా నియమించి నిర్వహిస్తున్నారని వాళ్ళ ప్రేరణతో విజయనగరం మహారాజా  ఆనందగజపతి రాజు వంటి వారు అలాంటి పనికి పూనుకున్నారని ఆయన బాలికల విద్య కొరకు చెన్నపురిలో నాలుగు , విజయనగరంలో ఒకటి పాఠశాలలు ఏర్పరచాడని పేర్కొన్నది. విజయనగరంలోని బాలికా పాఠశాలలో నాలుగేళ్ల క్రితం 150 మంది బాలికలు చదువుకోగా ఇప్పుడా సంఖ్య బాగా పడిపోయిందని సమాచారం ఇయ్యటమే కాదు అందుకు కారణాలను కూడా ఆమె వాస్తవ భూమిక మీద ఊహించింది. పదేళ్లు దాటినా ఆడపిల్లను బడికి పంపటానికి అవసరమైన సంస్కారం సమాజంలో లేకపోవటం దానికి తోడు  ఆ పాఠశాలలో అధ్యాపకులు అందరూ  పురుషులే కావటం అందుకు కారణం అంటుంది.

గొడవర్తి బంగారమ్మ కు స్త్రీవిద్య గురించి ఉన్న ఈ ఆరాటం ఆమెను ఆచరణలోకి  నడిపింది. ఈ వ్యాసాన్ని బట్టి ఆమె 1897 లోనే  ఒక బాలికా పాఠశాల ఏర్పరచినట్లు తెలుస్తున్నది. పదిమంది తో ప్రారంభమై ఇప్పుడు అందులో చదువుతున్న బాలికల సంఖ్య యాభైకి చేరిందని దానిని తాను ఒక్కతే నిర్వహించటం  కష్టంగా ఉందని తెలుగు, ఇంగ్లీష్ చెప్పటానికి ఇద్దరు, కుట్లూ అల్లికలు నేర్పటానికి ఒకరు సహాయకులు కావాలని అందుకు విజయనగరం మాహారాణి అయిదువందల రూపాయల చందా , నెలకు 20 రూపాయలు ఇయ్యటానికి అంగీకరించిందని ఈ వ్యాసంలో  ఆమె పేర్కొన్నది. స్త్రీలందరినీ తమతమ ప్రాంతాలలో స్త్రీ విద్యకు తోడ్పడాలని కోరుతూ ఈ వ్యాసాన్ని ముగించింది.

విద్య సమానత్వ సాధనమని , స్త్రీ పురుషులమధ్య స్నేహం అనే విలువను అభివృద్ధి చేస్తుందని భావించిన గొడవర్తి బంగారమ్మ అభివృద్ధికి తనదయిన నిర్వచనాన్ని ఇయ్యటం ఈ వ్యాసంలో గమనించవచ్చు. ఏది అభివృద్ధి కాదో చెప్పటం ద్వారా ఆమె ఈ పని చేసింది. ఆమె దృష్టిలో అభివృద్ధి అంటే

  • ఎట్టి వయసు ఉన్నా విధవలకు మారు మనువు చేయటం కాదు.
  • సముద్రపు ఇసుక కు పోయి పురుషులతో స్వేచ్ఛగా విహరించటం కాదు.
  • మతనాడీ భేదం లేకుండా ఎట్టి జనులతోనైనా కలిసి తిరగటం కాదు .

కేవలం విద్య మాత్రమే. అంటే ఆమె అభివృద్ధి నిర్వచనం పరిధి లోకి  స్త్రీ పునర్వివాహాలు, పురుషులతో సామాజిక సంబంధాలు, మత సమానత రావన్న మాట. అది గొడవర్తి బంగారమ్మ సంస్కరణ  పరిమితి. అయినప్పటికీ స్త్రీ విద్య వరకు ఆమె ఒక ఆచరణ వాది అన్నది స్పష్టం.

          వలివేటి బాలాత్రిపుర సుందరమ్మ రాజము నందలి జనానా సభలో చేసిన ప్రసంగం ( జులైకూడా స్త్రీ  విద్య కేంద్రంగానే సాగింది. స్త్రీలు సభలకు రావటం వల్ల ఇంటిపనులు కాస్త ఆలస్యం అయితే కావచ్చు కానీ అందరూ చేరి మాట్లాడుకొనటం వలన కలిగే లాభం అంతకంటే గొప్పది అని చెప్తూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించింది. మానవ జాతిలో పురుషుడు మొదటివాడుగా  శరీరదారుఢ్యం , విద్య కలిగి ఉండగా  స్త్రీ రెండవది గా అబల గా విద్య లేనిదానిగా ఉండిపోవటం గురించిన ప్రశ్నతో దానిని కొనసాగించింది. విద్య లేకపోతే జీవనం లేదా? లేకుండా ఆడవాళ్లు ఇప్పుడు జీవించటంలేదా? చదువుకొని ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలాలా అంటూ స్త్రీలకూ చదువు చెప్పించకుండా నిరుపయోగులుగా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేసింది.

విద్య అంటే తెలుసుకొనటం అని తెలుసుకొనటానికి విస్తృతమైన జ్ఞాన ప్రపంచం ఉందని బాలా త్రిపుర సుందరమ్మ అంటుంది. జీవ పదార్ధాలు , నిర్జీవ పదార్ధాలు అని  పదార్ధాలు రెండురకాలు అని మొదటి దానిలో మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు మొదలైనవి ఉంటే రెండవదానిలో భూమి, ఆకాశం, నీరు, గాలి , అగ్ని మొదలైనవి ఉంటాయని ఇవన్నీ తెలుసుకోవలసినవే అంటుంది. చదువు ఉంటే అన్నీ తెలుస్తాయని చెప్పింది. ప్రపంచంలో స్త్రీపురుషులకు ఏర్పాటైన పనులు సక్రమంగా నిర్వహించటానికి విద్య అవసరమని చెప్తూ చివరకు ఇల్లు చక్కదిద్దటం, పిల్లలను పెంచటం వంటివి చక్కగా చేయటానికి స్త్రీలకు విద్య అవసరమని చెప్పటంలో మళ్ళీ స్త్రీ విద్యను ఇంటి పనులకే పరిమితం చేయటం కనబడుతుంది. ఏమైనా స్త్రీలు తరచు కలుసు కొనటం కలిసి చదువుకొనటం ప్రయోజనకరమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించింది.

మొసలికంటి రమణాబాయమ్మ ( వెంకట రామణాబాయి ) కూడా రాజమునందలి జనానా సభలో చేసిన ప్రసంగం  స్త్రీవిద్య గురించే( సెప్టెంబర్ &అక్టోబర్). అందరికీ తెలిసిన విషయమే అయినా తన మాటలు బాలభాషితాలవలె  ఆనందపరచగలవని  అంటూ ఉపన్యాసం ప్రారంభించింది. తల్లిదండ్రులు చదువు చెప్పించకపోవటం వల్ల ఆడపిల్లలు కాపురంలోని కష్ట సుఖాలను అన్నదమ్ములకు ఉత్తరం వ్రాసి తెలుపుకొనటానికి వీల్లేక పోతుందని , ఎవరికైనా చెప్పి వ్రాయిద్దామంటే ఆ విషయం అత్తమామలకు తెలిసి పోతుందన్న భయంలో నిర్బంధంలో జీవితాలు గడిపేస్తున్నారని తనకెదురైనా ఒక స్త్రీ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పింది. ఇది అర్ధమైతే దానిని దాటటానికి ఇప్పుడు ప్రయత్నించి అయినా విద్య నేర్చుకోవచ్చని చెప్పింది. విద్యా  స్పర్శ వల్ల స్త్రీల చిత్తం పరిశుద్ధం అవుతుందని స్త్రీలకు అత్యంత ఆవశ్యకమైన పతిభక్తి , దైవ భక్తి, సత్యశీలత మొదలైన సద్గుణాలు సాధించటానికి సాధనం అవుతుందని , గృహకృత్య నిర్వహణ సమర్ధవంతంగా చేసుకొంటారని బాలా త్రిపుర సుందరమ్మ వలెనే అభిప్రాయపడింది.

కసవరాజు రంగమ్మ స్త్రీవిద్య గురించి వ్రాసినది ఈ వరుసలో చివరిది ( డిసెంబర్ ) చిన్న విన్నపం పత్రికాముఖంగా ప్రచురించండి అని కోరుతూ ఆమె వ్రాసిన అభిప్రాయాలు ఇందులో ఉన్నాయి. ఆమె భర్త పేరుమీద దేశోపకారి అనే పత్రికను తెప్పించుకొని కొన్ని నెలలుగా చదువుతున్నానని అందులో హిందూ సుందరి పత్రిక గురించి వ్రాసినది చూసి తెప్పించుకొని చదివానని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్  సంచికలు చదివాకా తనకు కూడా వ్రాయాలనిపించి వ్రాస్తున్నానని పేర్కొన్నది.

తనకు విశేష విద్య పరిశ్రమ లేదని , ఉన్న స్వల్ప విద్యనయినా అభివృద్ధి చేసుకొనటానికి ఎక్కువకాలం సంసార విషయాలలో వ్యయం అయిపోతున్నదని తప్పులెంచక తన వ్యాసం చదవమని కోరింది. వ్రాయటం, వ్రాసిన దాన్ని చదవటం మాత్రమే విద్య కాదని సత్యం , వినయం , వివేకం, భక్తి , పరోపకారం,  పత్ని వ్రతం ,పాతివ్రత్యం మొదలైన సద్గుణ సముదాయాలను పెంచుకొనటమని అభిప్రాయపడింది. ఇప్పటి వరకు స్త్రీలకు పాతివ్రత్యం గురించి చెప్పిన వాళ్ళే కానీ స్త్రీలకూ  పత్ని వ్రతం గురించి చెప్పిన వాళ్ళు, ప్రత్యేకించి స్త్రీలు ఎవరూ కనబడరు. దానిని చేర్చటం ద్వారా రంగమ్మ గుణాలను స్త్రీపురుషులిద్దరికి సమానమైనవిగానే భావించినట్లు. అందువల్లనే  ఇటువంటి విద్య స్త్రీపురుషులిద్దరూ పొందవలసినదే అని, అది పురుషులకు మాత్రమే హక్కు కాదని  చెప్పగలిగింది. విద్యాస్వాతంత్య్రం అందరికీ హక్కు అయిఉండగా మగపిల్లల చదువులో శ్రద్ధపెట్టి ఆడపిల్లలను నిర్లక్ష్యం చేయటం ఏమని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలను చదువు చెప్పించక పోవటం వల్ల వాళ్ళు కూపస్థ మండూకాలైవిద్యాగంధం లేని జ్ఞాన హీనులై  అందరికీ సంతాపకారకులు అవుతున్నారని అందువలన స్త్రీల చదువుకు సౌకర్యాలు కల్పించాలని అంటుంది. ఉత్తర సర్కారు జిల్లాలలో చదువుకొన్న స్త్రీలు ఎక్కువ కనబడతారని పరిశీలన మీద చెప్పింది. స్త్రీలకు చదువు పట్ల ఆసక్తిని పెంచే స్నేహం, సహవాసం, ప్రొత్సాహం ఇయ్యాలని పేర్కొన్నది. భండారు అచ్చమాంబను స్త్రీలు అనుసరించవలసిన నమూనా గా పేర్కొన్నది. భర్త కేశవరాజు నరసింగరావు తనకు రచనా స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పుకొన్నది.

రంగమ్మ అభిప్రాయాలను ఆమె చదివానని చెప్పుకొన్న హిందూసుందరి (1903, ఆగస్టు , సెప్టెంబర్, అక్టోబర్) సంచికలలో స్త్రీ విద్య గురించి వచ్చిన రచనలపై ప్రతిస్పందనగా పేర్కొనవచ్చు. వాటి మీద కొంత మెరుగైన అవగాహన , స్త్రీపురుష సమానత్వ భావన, హక్కుల స్పృహ ఈ వ్యాసంలో కనబడతాయి.

----------------------------------------------------------------------------------

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు