కొత్త పోస్టులు

శీర్షికలు

కథలు

నర ‘సింహావలోకనం’
 

నరసింహానికి ఓపెద్ద షాక్. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అలా జరిగివుండకూడదు. కానీ జరిగింది. మెల్లగాఅడుగులో అడుగు వేసుకుంటూ, ఇంటికి వెళ్తూ ఆలోచిస్తున్నాడు. నిన్నటి దాకా ఉన్న తన మిత్రుడు ఈరోజు లేడు. తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. ఎంత మంచి వాడు. అక్కడికి వచ్చిన అందరూ అతనిని మెచ్చుకున్నారు. అతను చేసినా సహాయాలని గుర్తుచేసుకున్నారు. అదేదో మొక్కుబడిలా కాకుండా మనస్ఫూర్తిగా చెప్పిన మాటలే.

ఇంటికి వచ్చేసాడు. ఇంకా వసుంధర రాలేదు. తాళం తీసి లోపలికి వెళ్ళాడు. తన చేతిలోని బ్యాగు, ఆఫీస్ ఫైలు టీపాయ్ మీద పడేసాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అందరితో మంచిగా ఉంటే నెత్తినెక్కి కూర్చుంటారు. అందుకే అందరిని తాను తగు దూరం లోనే పెట్టాడు. తల భారంగా ఉండడంతో తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకున్నాడు.

మరి తన వాళ్ళు తాను ఛస్తే ఎం అనుకుంటారో? తాను ఛస్తే... అవును తాను ఛస్తే కానీ వాళ్లకు బుద్ధి రాదు. ఎంత చెప్పినా, ఎంత చేసినా వాళ్లకు తృప్తి లేదు. నా దోవకు రారు. వచ్చినట్లు ఉన్న మనస్ఫూర్తిగా ఉండదు. వాళ్ళతో విసిగి వేసారి ఉన్నా. అందుకే తను చావాలి.

*******

బయట ఏడుపులు వినబడుతుంటే మెలుకువ వచ్చింది. గది బయటికి వచ్చాడు. అదేంటి?

ఎవరిదో శవం ఉంది. తన భార్య వసుంధర, కొడుకు సతీష్, ఆఫీసులో తన సబార్డినేట్ గిరిధర్ ఏడుస్తూ ఉన్నారు.

వసూ! ఎవడో కోన్కిస్కాగాడి శవం దగ్గర కూర్చుని ఏడుస్తున్నావే?ఎవడు వాడు? వాడికీ నీకూ ఏమిటి సంబంధం? అరే వినబడటంలేదా?“ అని అరిచాడు. వసుంధర ఆ మాటలు విన్నట్లులేదు. అలాగే సతీష్, గిరిని కేకేలేసాడు. వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు.

ఏమైంది వీళ్లకు? చెవుడా? నేనంటే నిర్లక్ష్యమా? అనుకున్నాడు. పక్కన ఒక వ్యక్తి నరసింహం భుజం తట్టి,"టీవీ రిమోటులో బ్యాటరీ తీసేస్తే రిమోట్ పనిచేయదు. ఏం వినపడదు. ఏం కనపడదు. వాళ్లకు నీవు కనబడవు. నీ మాటలు వినబడవు. అందుకే సమాధానం చెప్పలేరు. నేను చెబుతాను. ఆ చచ్చింది వసుంధర మొగుడు, సతీష్కు తండ్రి, గిరిధరికి బాస్”అని అన్నాడు.

"అదంతా నేనే”అన్నాడు నరసింహం.

"అవును అన్నీ నువ్వే. అక్కడ చచ్చి పడున్నది కూడా నీవే.”

"నేనిక్కడే ఉన్నానుగా?"

"ఆ బాడీని వదిలేసి ఇక్కడ ఉన్నావు."

"బాడీనా?"

"నువ్వు అందులో ఉన్నంతవరకూ నరసింహానివి. ఇప్పుడు అది బాడీ మాత్రమే. ఇక అందరూ అలాగే అంటారు."

అప్పుడు అనుమానం వచ్చింది నరసింహానికి

"ఇంతకీ నువ్వు ఎవరివి?” అని అడిగాడు ఆ వ్యక్తిని.

"నీ అంతరాత్మని.”

"ఎక్కడినుంచి వచ్చావు?”

"నువ్వు ఆ శరీరంలోనుంచి వచ్చినట్లే, నీనుండి నేను వచ్చాను.”ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు నరసింహం. ఇంకో సందేహం వచ్చింది నరసింహానికి.

"నేనెలా చచ్చాను?"

"నువ్వు కోరుకున్నావు కాబట్టి."

నేనెందుకు చావును కోరుకుంటాను?"

"నీవాళ్ళందరితో సఖ్యతతో ఉండలేక,అసహనంతో వాళ్ళపై విరుచుకుపడి,వేదనపడి కోపంతో”నేను చస్తేగాని నాకు ప్రశాంతత ఉండదు”అని అనుకున్నావు. కరెక్టుగా ఆ టైంలోనే తథాస్తు దేవతలు అలా షికారు వెళుతూ నీ మాటలు విని తథాస్తు అని వాళ్ళ జేబులోనుంచి చావు వరాన్ని నీకు ప్రసాదించారు.”

"నాదో సందేహం."

"ఆ దేహం వదిలినా నిన్ను సందేహాలు వదలలేదు. అడుగు."

"ఇప్పుడు నా గురించి నావాళ్ళు ఏమనుకుంటున్నారు?”

"చూశావా?చింత చచ్చినా..... అన్నట్లు నువ్వు చచ్చినా వాళ్ళు నీగురించి ఏమనుకుంటున్నారో అన్న చింత చావలేదు. నువ్వు చచ్చావేగాని నీకు ప్రశాంతత లేదు. నువ్వు చచ్చింతర్వాత వాళ్ళేం అనుకుంటే నీకెందుకు? బతికున్నప్పుడు ఎవరేమనుకుంటారు అని ఆలోచిస్తే నీ ప్రవర్తనను బాగుచేసుకుని ఉండొచ్చు."

"అదేదో అయిపోయింది. ఇప్పుడు నాగురించి వాళ్ళేం అనుకుంటున్నారు?"

"ఏం నీకు తెలీదా?” అని ఎదురు ప్రశ్న వేసింది అంతరాత్మ.

"నీకు తెలుసా?”

"బాగా తెలుసు. సరే ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి విను.”

"మాకోసం ఎంతో కష్టపడ్డారు. నన్ను కంటికి రెప్పలా చూసుకునేవారు. నాకేమైనా ఒళ్ళు బాగాలేకపోతే అల్లాడిపోయేవారు. ఇప్పుడు ఆయన లేకుండా నేనెట్లా బతికేది?”అని వసుంధర అనింది.

"అసలు ఆయన మా నాన్న కాదు. ఫ్రెండ్,ఫిలాసఫర్,గైడ్. అన్నీ తానే అయి నన్ను పెంచారు. ఇంక నాకు దిక్కెవరు?”అని సతీష్ అన్నాడు.

"పేరుకు నాకు బాస్. ఆఫీస్ పని ఎంత పేరుకుపోయినా ఏం అనేవారు కాదు. చాలా ఓర్పుతో పని నేర్పించేవారు. ఇకమీదట అలాంటి వ్యక్తిని చూడలేను.”అని గిరి అన్నాడు.

"అమ్మయ్య. చూసావా నాగురించి ఎంత గొప్పగా చెప్పారో? ఆనందంతో గాలిలో ఎగరాలని ఉంది."

"నువ్విప్పుడు గాలిలోనే ఉన్నావు. గాలిమేడలు కట్టుకోవద్దు. వాళ్ళు నీగురించి మంచిగా మాట్లాడుతున్నారా? అరటితొక్కేమికాదూ?అవంతా గాలికబుర్లు. చచ్చినవాళ్ల గురించి చెడు చెప్పకూడదన్న సంప్రదాయం ఒకటి చచ్చి ఏడ్చింది కాబట్టి అలా మాట్లాడారు. నిజంగా వాళ్ళ మనసుల్లోని మాటలు వింటే ఉరేసుకుని ఛస్తావ్. సారి,అదే బతికున్నప్పుడు వినుంటే చచ్చి ఊరుకుంటావు.”

"వాళ్ళ మనసులో ఏముందో నాకేం తెలుసు."

"అయ్యోపాపం బుజ్జికన్నా! నీకేమీ తెలీదు. అరటిపండు నోట్లోపెడితే కొరకడం తెలీని పసివాడివి. సరే,వాళ్ళ మనసుల్లోని మర్మం విను.”అని అనింది అంతరాత్మ.

"ఆయన కష్టపడ్డాడా? ఏం కష్టపడ్డాడు? ఆఫీసులో పెద్దగా పనిచేసి అలసిపోయినట్లు ఫోజు. ఏసీ గదిలో కూర్చుని,కిందివాళ్ళపైన పెత్తనం చెలాయించడమేగా ఈయన చేసే నిర్వాకం. నాకు ఒళ్ళు బాగాలేకపోతే ఏనాడైనా తన చేత్తో మందులిచ్చాడా? నేనూ ఉద్యోగం చేస్తున్నా. అక్కడ ఆఫీసులో పనిచేసి,ఇక్కడ ఇంటిపనీ చెయ్యాలి. ఎందులోనూ ఆయన సాయం చేయడు. ఓ ముద్దూముచ్చటా లేదు. చేతిలో సెల్లూ,లేకపోతే పేపర్. అదీ కాకుంటే టీవీలో క్రికెట్టు. ఇప్పుడు పోయాడుగా సగం పని తగ్గింది. అమ్మయ్య!”అని తన బాధనంతా వెళ్లగక్కింది వసుంధర.

ఇపుడు సతీష్”అసలు ఆయన మానాన్న కాదు. ఒక్కసారి కూడా దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడలేదు. ఆయన ఇష్టాలనీ కోరికలనీ నేను తీర్చాలంటాడు. ఆయన మాటే నెగ్గాలంటాడు. నా సమస్యల్ని అర్థంచేసుకోడు. వేరేవాళ్ళ పిల్లలతో పోలుస్తాడు.”అని అన్నాడు.

"అమ్మయ్య. పీడ విరగడయింది. అధికారం చేతిలో ఉందిగదాని గదమాయించడం. పని తెలీక అవస్థపడితే తేలిగ్గా చూడడం. పని ఎలా చెయ్యాలో నేర్పించే ఓపిక లేదు. ఆయనకి కష్టం వస్తే ఒకటి. నాకు కష్టం వస్తే మరొకటి. ఇంట్లోకోపం,పైఅధికారిపై కోపం అన్నీ నాపైనే. ఇంకా ఏ ఆఫీసర్ వచ్చినా వీడిలా మాత్రం ఉండరు.”అని అక్కసును కక్కాడు గిరి.

ఇవ్వన్నీ విన్న నరసింహం ఆశ్చర్యంతో అంతరాత్మ వైపు చూసి”ఏమిటిది?”అని అడిగాడు.

"నిజరూపదర్శనం.”

"ఎవరిది?”

"నీది,వారిదికూడా.”

"అవును వాళ్ళ అసలు రూపం బయటపడింది.”

"వారితోబాటు నీ స్వభావమూ తెలిసింది.”

"నా భార్య నాతో కష్టాలు పడిందా? మొగుడిగా, మగాడిగా నా బాధ్యతలంతా చేశానుగదా?”తనదేమీ తప్పు లేనట్టు చెప్పాడు నరసింహం. ఆమాటలోనుంచి ఓ పాయింటు లాగింది అంతరాత్మ.

"నీ మాటల్లోనే సమాధానం ఉంది. ఆమెవద్ద నీ పురుషాధిక్యత ప్రదర్శించావు.”

మెల్లగా టాపిక్ మార్చాడు నరసింహం.

"నా కొడుకు నన్ను అంతలేసి మాటలనేశాడేమిటి?నేను వాడికోసమేకదా క్రమశిక్షణతో పెంచాలనుకున్నా.”

క్రమశిక్షణ పేరిట నీలోని కోపాన్ని,అసంతృప్తినీ,నిరాశనూ, నిస్పృహనూ వాడి నెత్తిన గుమ్మరించావు. నీ నెరవేరని కోరికల్ని వాడిద్వారా తీర్చుకోవాలని చూశావు.”

ఈ అంతరాత్మ ఏమిటి, తనదే తప్పనట్టు చెబుతోంది అని అనుకొని గిరి విషయం ఎత్తాడు నరసింహం.

"వాడు,నా సబార్డినేట్, ఆ గిరిగాడు కూడానా? ఆఫీసులో ఎంత అణిగిమణిగి ఉండేవాడు. వినయానికి కేరాఫ్ అడ్రసులా ఉండేవాడు. ఇప్పుడు ఇంత కేర్లెస్ గా మాట్లాడుతున్నాడు.”

"ఆ వినయవిధేతలు నీ అధికారానికి. అవి నీకే అనుకుని మునగ చెట్టెక్కావు. ఇప్పుడు బోల్తాపడ్డావు. నిజంగా నువ్వు వీళ్లందరితో బాగుంటే నీ గురించి మంచే చెబుతారా అన్న అనుమానం రాకూడదు. ఆ సందేహం వచ్చిందంటేనే నీ ప్రవర్తన నీకే నచ్చలేదన్నమాట.”

నేనేం చేశాను?”

"వాళ్ళూ అదే అనుకుంటున్నారు. వాళ్ళకు నువ్వు మంచి ఏం చేసావూ అని. నువ్వేం చేశావో నీకు తెలీదా? ఎందరో మేధావులూ,తత్త్వవేత్తలూ నిన్ను నీవు తెలుసుకో అన్నారు. నీ అహంకారపు తలుపులు తెఱచిచూడు. నీ హృదయపు గదిలో తరచిచూడు. నువ్వేంటో అర్థమవుతుంది. నీ ప్రవర్తన ఏమిటో తెలుస్తుంది. నీ వాళ్ళతో ఎలా ఉన్నావో చూడు. ఒకసారి జరిగిందంతా నాటకం చూస్తున్నట్లు చూడు.”అని గతాన్ని అతనికి గుర్తు చేసింది అంతరాత్మ.

*******

      నరసింహం ఆఫీస్ నుండి వచ్చాడు. షూష్ ఊడదీసి ఓ మూలకి విసిరేశాడు. ఫైల్స్ టేబుల్ పైన,మీల్స్ బ్యాగ్ టీపాయ్ మీద పడేశాడు. టైం చూసుకున్నాడు. వాకిటివైపు చూశాడు. అసహనంతో టీపాయ్ మీదున్న న్యూస్ పేపర్ తీసి చదివాడు. మళ్ళీ వాకిటివైపు చూసి న్యూస్ పేపర్ టీపాయ్ మీద పడేశాడు. టీవీ ఆన్ చేశాడు. కాస్సేపటికి వాకిటివైపు చూశాడు. సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు. తర్వాత అందులో మెసేజెస్ చూస్తున్నాడు.

      వసుంధర ఆఫీసునుండి వచ్చింది. హాలంతా ఒకసారి చూసింది. హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టింది. విడివిడిగాపడిఉన్న నరసింహం షూస్ తీసి ఓ పక్కన సర్దింది. తన క్యారియర్,నరసింహం క్యారియర్ లను తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. వాటిని సింకులో పడేసిన శబ్దం. నరసింహం ఉలిక్కిపడ్డాడు. మళ్ళీ సెల్ చూశాడు.టైం చూశాడు. వంటగదికేసి చూశాడు. వంటగది బయట నిలబడి”వసూ! కాఫీ అయిందా?”

"ఏం మీరు నాకన్నా ముందే వచ్చారుగా? తాగలేదా?

"ఆఫీసునుంచి నువ్వు వస్తావని ఎదురుచూస్తున్నా.”

"వచ్చాను. అయితే?”

"నువ్వు కాఫీ కలుపుకొని మనిద్దరికీ తెస్తావని చూస్తున్నా.”

"నేనొచ్చింది చూశారుగా?మీరే కాఫీ కలిపి తెచ్చి ఇవ్వచ్చుగా?”

నేను టైర్డ్ అయిపోయాను.”అని అన్నాడు నరసింహం.

అంతే రెచ్చిపోయింది వసుంధర.

"నేనూ మీలాగే ఆఫీసులో పనిచేసే వచ్చాను. అలసటకు ఆడామగా తేడాలేదు. ఆడవాళ్లకూ అలుపూసలుపులు వస్తాయి. ఉదయం కాఫీ నేనే ఇస్తున్నానా?టిఫినూ,మీల్స్ అన్నీ నేనే చేస్తున్నానా?ఒక్కసారి సాయంకాలం ఒకపూట కాఫీ కలిపి ఇవ్వటానికి మీకు నామోషీ. ఇంతకాలం మీరు ఇంటిపనులు చేయాలంటే మీ అమ్మగారు ఉండేవారు. ఆమె ఎక్కడ మిమ్మల్ని”ఆడంగి వెధవా ఇలా భార్యకు కాఫీ కలిపి ఇస్తావా? సిగ్గులేదూ?అని ఎద్దేవా చేస్తుందని భయం. అదే అల్లుడు ఆమె కూతురికి కాఫీ ఇస్తే”మా అల్లుడు మా అమ్మాయిని ఒక్క పనీ చేయనివ్వడు”అని గొప్పలు చెప్పేది.”

ఒక్కసారిగా తగ్గిపోయాడు నరసింహం. మెల్లగా”పోనీలే వసూ. పోయినవాళ్ల గురించి చెడు ఎందుకు చెప్పుకోవాలి?”అని అన్నాడు.

"సరే ఆ మహాతల్లి పోయిందిగా,ఇప్పుడు నాకు చేసిపెట్టేందుకు ఏం అడ్డం? చెప్పండి. మీ అహంకారం అడ్డం. అంతేనా?”

"అదికాదు వసూ! నాకు వంట అలవాటులేదు.”

అతను తగ్గడంతో ఇంకాస్త గొంతుపెంచింది వసుంధర.

"నాకు కూడా మాపుట్టింట్లో వంట అలవాటులేదు. అంతా అమ్మే చేసేది. మిమ్మల్ని కట్టుకున్నాక మీ అమ్మగారిని అడిగి మీకేది ఇష్టమో కనుక్కొని,అన్నీ నేర్చుకొని చేస్తున్నానుగా. నన్నూ మావాళ్ళను ఏమీ అనకుండా వంట నేర్పిందా ఆ మహాతల్లి? వంటావార్పూ చెప్పించకుండా ఎలా పెంచారో మీవాళ్లు”అని మాఅమ్మని ఆడిపోసుకునేది. ఏం ఆమెగారు మీకు నేర్పించవచ్చుగదా వంట.”

"ఇప్పుడు ఆమె పోయిందిగా,ఇంకెందుకుఆ సంగతి?”

"సరే మీరున్నారుగా? ఆఫీసునుంచి రాగానే షూస్ అలా విసిరేయకపోతే స్టాండులో పెట్టవచ్చుగా? మీ టిఫన్ బాక్స్ తీసి సింకులో పడేయవచ్చుగా? జీతంలేని పనిమనిషిని నేనున్నానుగా అవన్నీ చేసిపెట్టడానికి.”

ఇంక లాభం లేదు. ఎలాగైనా ఆమెను అనునయించడానికి”ఏంటి వసూ ఈ రోజు మరీ హాట్ హాటుగా ఉన్నావు?”అని చేయి పట్టుకున్నాడు”అరె నిజంగానే ఒళ్ళు వేడిగా ఉందే? జ్వరం వచ్చిందా? ఏదయినా మాత్ర వేసుకోకూడదూ?”

అంతే వసుంధర కోపం నసాళానికి ఎక్కింది.అతని చెయ్యి విదిలించింది.”ఏదయినా మాత్ర వేసుకోకూడదూ చెప్పడమేగాని,కాస్త రెస్ట్ తీసుకో,నేను సాయం చేస్తాను అనిగానీ,ఇంద ఈ మాత్ర వేసుకో అని ఇవ్వడం గానీ చెయ్యరన్నమాట. మీకు మాత్రం ఇంత తలనొప్పి వచ్చినా అమృతాంజనం నేనే రాయాలి. ఇంత జలుబు వచ్చినా విక్స్ నేనే రాయాలి.”

"నేను తలనొప్పనో,జలుబు వచ్చిందనో చెబుతానుగానీ నిన్ను అదీ ఇదీ రాయమని నేనెప్పుడయినా చెప్పానా?"

"అదే నేననేది. మీరు బాధతో ఉన్నప్పుడు నేనుగా తోచుకొని ఏదయినా చేస్తానే,నాకు జ్వరం వస్తే మీరుగా ఏమీ చెయ్యడం లేదే అనేదే నాబాధ. ఇదంతా మీకెప్పుడు తెలుస్తుందో, మీరు ఎప్పుడు మారుతారో నాకు తెలీడంలేదు.”

ఇంతసేపు డిఫెన్స్ ఆడుతున్న నరసింహం అఫెన్సు లోకి దిగాడు.

"అయినా లోకంలో ఎంతమంది ఆడవాళ్లు వుద్యోగం చేయడంలేదు? ఉద్యోగం చేస్తున్నామని ఇంటిపని మానేస్తున్నారా?నీవు ఒక్కదానివే పెద్ద చేసేటట్టు ఫోజు కొట్టేస్తున్నావే?అని దబాయించాడు.

"చేస్తానండీ చేస్తా. అన్ని పనులూ నేనే చేస్తా. కానీ కనీసం చిన్న చిన్న పనులయినా మీరు చేయకపోతే ఎలా? కూరలు తరగొచ్చు,గిన్నెలు తోమొచ్చు,నెలసరి సరుకులు డబ్బాల్లో పోయొచ్చు. కానీ చేయరు. ఎందుకంటే ఇగో అడ్డొస్తుంది.”

"అవన్నీ మొగవాళ్ళు చేసేపనులు కావు.”

"అని మీ అమ్మ చెప్పిందా? ఆ తరం అలా ఉండేది. కానీ ఇప్పుడు చాలామంది మగవాళ్ళు అన్ని పనులూ చేస్తున్నారు. సరే అది వదిలేయండి. మగవాళ్ళు చేసే పనులు మీరు చేస్తున్నారా?”

"ఏం చేయడంలేదో చెప్పు.”

"మా ఆఫీసరుగాడు అక్కడ పనిచేయించుకోవడమే కాక ఇంట్లో కూడా ఆఫీస్ పనులు చేసుకురమ్మంటాడు. అది మగ పనేగా?మీరు చేసిపెట్టారా?”

"ఇదేం గోల? మా ఆఫీసులో పని చేసి,ఇక్కడ నీ ఆఫీస్ పని చేయాలంటే బోర్.”

"అవును ఇంటిపని చేయడానికి నామోషీ. నా ఆఫీస్ పని చేయడానికి బోర్. మీకు బోర్ కొట్టనిది పేపర్ చదవడం,టీవీ చూడడం,వాట్సాప్ లో మెసేజీలు చూడటం,సెల్లో బాతాఖానీ కొట్టడం. అంతేగా?”

అపుడే నరసింహాన్ని వసుంధర బారి నుంచి కాపాడడానికేమో ఫోన్ మోగింది. హమ్మయ్య అనుకున్నాడు నరసింహం. ఫోన్ ఎవరు చేశారని చూసాడు.

"మా బాస్ ఫోన్ చేస్తున్నాడు. ఇంకా ఆపేయ్ నీ గోల.”అని గట్తిగా అరిచాడు నరసింహం.

"నేను చెప్పేదంతా మీకు గోల లాగానేఉంటుంది. నేను మీకు కాఫీ పెడతాను. మీ బాస్ గడ్డి పెడతాడు.”అని వసుంధర వంటగదిలోకి వెళ్ళింది.

అంతే అక్కడి దృశ్యం ఆగింది.

*******

"ఇందులో నా తప్పేం ఉంది? అందరు మగవాళ్లలాగే నేనూ ఉన్నాను.”అని అంతరాత్మకు విన్నవించుకున్నాడు నరసింహం.

"వాళ్ళందరూ ఇంట్లో ఎలా ఉన్నారో నీవు చూశావా?ఏ మగాడూ ఇంట్లో ఫలానా ఫలానా పనులు చేస్తున్నానని చెప్పుకోడు. మగవాడినన్న అహం అలా చెప్పనివ్వదు. చాలామంది మారారు,మారుతున్నారు. మా నాన్నలు ఇలాగే ఉన్నారు,మా తాతలు ఎలాగెలాగో ఉన్నారంటే ఇప్పుడు కుదరదు. కాలం,కాలంతో బాటు మనుషులూ మారాలి. భార్య అంటే శ్రద్ధ ఉండాలి.”

"శ్రద్ధ లేకుండా నేనేం చేశాను?”

"ఆమె ఇంటికి వచ్చినప్పుడు,గమనించనట్లు నీవు సెల్ చూసుకోవడాన్ని శ్రద్ధ అంటారా? రాగానే ఆమె హ్యాండ్ బ్యాగ్,టిఫిన్ బాక్స్ అందుకున్నావా?”

"ఇంతదూరం మోసుకొచ్చింది ఇంట్లోకి తీసుకురాలేదా?”

"అదే అదే కూడదన్నది. ముందుగానే వచ్చావు కదా? నీ మీల్స్ బాక్స్,ఉదయం మీరు తిన్న టిఫిన్ ప్లేట్లూ కడగొచ్చుగా. రాగానే కాఫీ ఇచ్చి ఆఫీసులో ఆమె పడిన శ్రమ తెలుసుకుంటే సేద తీరేదిగా?కనీసం నీ షూస్ విసిరేయకుండా స్టాండులో పెట్టవచ్చుగా?”

ఇదంతా...”

ఇదంతా ఎందుకు జరగదు అంటే,ఇంటిపనీ,బయటపనీ ఆమే చేయాలని ఎదురుచూడడం వల్ల.”

"నాకు వంట...”

"రాదు. రాదు అనుకుంటే ఏమీ రాదు. చేయాలనుకుంటే ఏదీ అసాధ్యం కాదు. నేర్చుకోవాలంటే యూట్యూబ్ లో బోలెడన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. చూసి నేర్చుకోవచ్చు. మీ పెళ్లయేనాటికి నీ భార్యకు వంట రాదు. మీ అమ్మనడిగి నేర్చుకోలేదూ?”

ఏమిటి అంతరాత్మ? నన్నే తప్పులు పడుతుంది అనుకొని టాపిక్ మార్చాడు నరసింహం.

"చనిపోయిన మా అమ్మని దెప్పిపొడుస్తుంది. అది కరెక్ట్ కాదు కదా.”

అత్తగారిని అనడం ఆమె తప్పే. ఆమె ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండింది. దాన్ని ఇప్పుడు నీపైన వెళ్లగక్కింది. అసలు నువ్వు ఇంట్లో సాయం చేస్తుంటే గతమంతా మరిచిపోయేది. మీ అమ్మ ప్రస్తావన తెచ్చేదికాదు. సరే ఇదంతా పక్కన పెట్టు. ఆమెకు ఒళ్ళు బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడమో,లేదూ నువ్వే మాత్ర తెచ్చి ఇవ్వడమో చేయొచ్చుగా. ఆ రోజు వంట చేయొద్దని,ఏ హోటెల్నుండో తెప్పిస్తానని చెప్పొచ్చుగా. ఇవన్నీ చేయకుండా”ఇందులో నా తప్పేం ఉంది? అందరూ మగవాళ్ళలాగే నేనున్నాను”అని సమర్ధించుకున్నావు. నీకు బుద్ధీ,జ్ఞానమూ,తెలివీ,అదీ,ఇదీ ఏమన్నా ఉన్నాయా?”

అంతరాత్మ అంత గట్తిగా చీవాట్లు పెట్టడంతో తల దించుకున్నాడు నరసింహం.

"సరే ఆ రోజు మీ బాస్ ఫోన్ చేసింతర్వాత ఏమైంది? అది కూడా చూడు”అని గతాన్ని చూపించింది అంతరాత్మ.

**********

నరసింహం తలపట్టుకుని సెల్ ఆన్ చేసాడు. మొహం నిండా నవ్వు పులుముకొని”సార్ గుడ్ మార్నింగ్ సార్.”అని విష్ చేసాడు.

దానికి ఆ ఆఫీసర్”ఆఁ గాడిద గుడ్డేమీ కాదూ?ఫోన్ తీయడానికి ఎందుకు లేట్ చేసావు?”

"అదీ... అదీ... ఫోన్ చార్జింగులో వేరేగదిలో పెట్టాను. అందుకనే...”

"సెల్ పనిచేయడానికి ఛార్జింగ్ చేయాలి. నువ్వు పనిచేయడానికి నేను నీకు ఛార్జింగ్ చేయాలన్నమాట.”

"అదేంటి సార్ అలా అంటారు? అన్ని పనులూ చేస్తూనే ఉన్నాను కదా సార్.”

మొన్న హెడ్డాఫిస్ వాళ్ళు పంపమన్న ఇన్ఫర్మేషన్ పంపేవా?

ఏంటి సార్ అదింకా చేరలేదా?”

అంటే ఇన్ఫర్మేషన్ చేరిందా లేదా అని నువ్వు కనుక్కోలేదా? అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావన్నమాట.”

"అది కాదు సార్. దానికి సంబంధించిన ఎంప్లాయీకి చెప్పాను సార్. వాడూ...”

"నువ్వు వాడికి చెప్పావు. వాడింకెవడికో చెబుతాడు. అలా సాకులు చెప్పుకుంటూ పొండి. పని మాత్రం చేయకండి.”

నేనేం చేసేది సార్? నా కింద ఇరవై మంది దద్దమ్మలు పని చేస్తున్నారు.”

"నాకింద ఇరవై ఒక మంది పనిచేస్తున్నారు. వాళ్ళంతా సక్రమంగా పనిచేస్తుంటే మధ్యలో నువ్వెందుకు? నీపైన నేనెందుకు? కుంటిసాకులు మాని ఆ స్టేట్మెంట్ పంపు.”

సార్ అదీ..”

నో మోర్ ఎక్సప్లనేషన్స్”అని ఫోన్ పెట్టేశాడు బాస్.

నరసింహం తనలో”నో మోర్ ఎక్సప్లనేషన్స్. ఏం చేస్తాడు. మెమో ఇస్తాడు. లేకుంటే సస్పెండ్ చేస్తాడు. వాడు చేసేదేమిటి? నేనే రిజైన్ చేసేస్తా. ఈ అవమానాన్ని భరించడం కంటే అడుక్కుతినడం మంచిది. దీనికంతా కారణం ఆ గిరిగాడే. వాణ్ణీ...”

*******

ప్రతివాడికీ పైవాడు ఉంటాడు. ఆ పైవాడు ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నాడో? అవమానం జరిగితే రాజీనామా చేస్తా,అడుక్కు తింటానని చెప్పడం కరెక్ట్ కాదు.”అని అంతరాత్మ సర్ది చెప్పింది.

"మరి ఆ పరిస్థితిలో నేనేం చేయాలి?”

"సమస్యకు పరిష్కారం చూడాలి. ఎక్కడ తప్పు జరిగిందో చూడాలి. ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవాలి. అవమానం జరిగిన చోటే సన్మానం అందుకునే పట్టుదల ఉండాలి. ఇక్కడకాదని ఇంకో చోటుకి పోయినా ఇదే పరిస్థితి. మనుషులు ఎక్కడన్నా ఒకేలా ఉంటారు. ఆ తర్వాత ఏం చేశావో చూద్దాం.”

మళ్ళీ గతం లోకి వెళ్ళాడు నరసింహం.

*******

ఆఫీసర్ మీద కోపంతో నరసింహం తన కింది ఉద్యోగికి ఫోన్ చేశాడు

"హలో గిరీ”

"గుడ్ మార్నింగ్ సార్.”

"ఏం గుడ్ మోర్నింగూ?ఈ రోజు బ్యాడ్ మార్నింగ్.”

ఏం సార్? ఏమైంది?”

"మొన్న హెడ్డాఫీసువాళ్ళు అడిగిన స్టేట్మెంట్ పంపలేదా?”

లేదు సార్. అదీ...”

ముందు అర్జెంటుగా దాన్ని కంప్లీట్ చేసి వెంటనే నా దగ్గరకు... ఇంటికే తెచ్చేయ్. లేకుంటే నువ్వు ఖాళీ”అని ఫోన్ పెట్టేసాడు.

**********

 నరసింహం,అంతరాత్మవైపు తిరిగి”నా భార్య నేను ఆఫీసులో పెద్దగా ఏం కష్టపడుతున్నాను అనింది. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అన్నట్లు ఇంటికి వచ్చినా తిప్పలు తప్పలేదు. ముప్ఫయ్ ఏళ్ళు సర్వీస్ చేసినా ఆపైవాడిదగ్గర నానాటికి నానాతిట్లూతినాల్సివస్తోంది.”

"ఆపైవాడు ఇంకా పైవాడిదగ్గర ఏమేమి మాటలు పడుతున్నాడో ఆలోచించు. నువ్విప్పుడు నీ కోపాన్ని నీ సబార్డినేట్ పైన చూపించావు. ఇదంతా బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటారు.”

"కిందివాళ్ళ తో పనిచేయించడం కంటే నేనే చేసేయవచ్చు.”

అప్పుడు వాళ్ళ జీతమే నీకు ఇచ్చేవాళ్ళు. నీ కింద ఉన్నవాళ్ళతో పనిచేయించడానికే నీకు ప్రమోషన్,జీతంలో పెరుగుదల. వారి ద్వారా మీ కార్యాలయ లక్ష్యాలను నీ నాయకత్వ లక్షణాలతో,సత్సంబంధాలతో సాధించడమే నీ ఉద్యోగం. మనుషులతో సత్ సంబంధాలు కొనసాగించాలంటే అంతస్థుల అడ్డుల్ని తొలగించుకొని దిగివచ్చి ఎదుటివాడ్ని మనలో కలుపుకొంటే మనం మానసికంగా ఎదిగిన వాళ్ళమవుతాం. దాన్నిబట్టే నీ పనితీరును పైవాళ్ళు మదింపు చేస్తారు. కిందివాడి సహకారం లేకుంటే నీ ఉద్యోగం ఖాళీ.”

అంతరాత్మ”అదిగో ఖాళీ లేదుఖాళీ లేదు అంటూ నీ కొడుకు వస్తున్నాడు. ఆ వ్యవహారం చూద్దాం"

 సతీష్ వస్తూ ఫోన్లో"ఖాళీ లేదు,ఖాళీ లేదు,ఖాళీ లేదు. ఎక్కడపోయినా ఖాళీ లేదన్నమాటే.”నరసింహాన్ని చూసి,ఫోన్లో”తర్వాత మాట్లాడుతాను.”తన నాన్నతో”గుడ్ మార్నింగ్ డాడ్.”అన్నాడు.

"ఎక్కడినుంచి రాక?”

షేవింగుకు వెళ్ళొచ్చాను డాడ్.”

"నేను సేవింగ్. నువ్వు షేవింగ్. బాగుందిరా. నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?"

"ఎక్కడా ఉద్యోగాలు లేవు.”

"అదేమిట్రా? సాఫ్ట్ వేర్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటే ఉద్యోగాలు లేకపోవడం ఏంటి? నీ లాంటి యువకులను ఎవరిని కదిలించినా సాఫ్ట్ వేర్ అంటున్నాడు. లక్షల్లో సంపాదిస్తున్నారు. మొన్ననే పేపర్లో చదివాను,పద్నాలుగేళ్ల కుర్రవాడు కొన్ని కోట్ల ప్యాకేజీతో ఐటీ లో సెలెక్ట్ అయ్యాట్ట.”

"నాకు ఆ ఉద్యోగం ఇష్టంలేదు డాడ్.”

"చేరకనే ఇష్టం లేదంటే ఎలా? అందులో చేరితేనేకదా దాన్లోని కష్టసుఖాలు తెలిసేది.”

"నేనే చేరక్కరలేదు. అందులో ఉన్న నా ఫ్రెండ్స్ కథలు వింటే తెలుస్తోంది.”

ఏంటీ తెలిసింది?”

"మీలాగా టెన్ టు ఫైవ్ జాబ్ కావవి. అదొక పద్మవ్యూహం. లోపలికి వెళ్లడమేగాని బయటకు అనుకున్న సమయానికి రావడం మన చేతిలో లేదు. అధవా వచ్చినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి.”

"మాకూ అలాంటివి తప్పడంలేదు. ఇప్పుడే మా బాస్ నా తల అంటేశాడు.”

మీకు అప్పుడప్పుడు. కానీ ఐటీలో ఎప్పుడూ. ఒక సరదాలేదు,ఒక షికారు లేదు. జీవితాన్ని ఆస్వాదించడం ఉండదు. ఆనందం ఉండదు.”

"లక్షల్లో సంపాదిస్తారు కదా? ఇంకేం బాగా సంపాదించి ఏ 45 ఏళ్లకో, 50 ఏళ్లకో రిటైర్ అయిపోవచ్చు. ఆ తర్వాత ఎంజాయ్ చేయొచ్చు.”

ఆ వయసులో ఎంజాయ్ చేసేదేముంది? మా ఫ్రెండ్ పనిచేసే కంపెనీలో ప్రతి సంవత్సరం మెడికల్ టెస్టులు జరుపుతారు.”

అది ఫ్రీగానే కదా? వాళ్ళ ఆరోగ్యంపైన ఆ కంపెనీలకు ఎంత శ్రద్ధ?”

"నేను చెప్పేది పూర్తిగా విను డాడ్. పోయిన సంవత్సరం ఓ ఇద్దరికి తప్ప మిగతా అందరికీ బీపీ,డయాబెటీస్,డిప్రెషన్లు. ఆ ఇద్దరినీ కంపెనీ ఇంటికి పంపించేసింది.”

ఆరోగ్యంగా ఉన్నవాళ్లను ఇంటికి పంపడమేమిట్రా?"

"వాళ్లకు ఆ రోగాలు రాలేదంటే ఉద్యోగం సక్రమంగా చేయడం లేదనే నిర్ణయానికి వచ్చారట.”

మా ఆఫీసులో మా బాస్ పిల్లల నుండి చివరకు అటెండర్ పిల్లల వరకూ ఐటీ చేసి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ మధ్యే ఆ అటెండర్ కూడా తన భార్యతో అమెరికా వెళ్ళాడు.”

"వాళ్ళ అబ్బాయికి పెళ్ళయిందా?

అయింది.”

కోడలు ప్రెగ్నెంటా?"

"అవును.”

అదీ సంగతి. తన భార్యకు సేవ చేయడానికే వీళ్ళను పిలిపించుకున్నాడు.”

ఎలాగో విదేశాలు వెళ్ళారు. నీవల్ల నేను అమెరికా చూద్దామన్న కోరిక తీరేట్లు లేదు.”

"మీ కోరికలు తీర్చుకోవడంకోసం ఆ టెన్షన్ ఉద్యోగం నేను చేసి రోగాలు కొని తెచ్చుకోలేను. డాడ్! నేను చెబుతున్నావిను. మీలాంటి వాళ్ళు అమెరికాలో ఎక్కువ రోజులు ఉండలేరు. కావాలంటే మీ అటెండర్ వచ్చింతర్వాత అడుగు. చెబుతాడు.”

"ఎందుకనో?”

"వాళ్ళబ్బాయి ఉదయం ఆఫీస్ వెళితే రాత్రి ఇంటికి వచ్చేంతవరకు టీవీకి అతుక్కుపోవాల్సిందే. విడిగా బయట తిరగలేరు. ఏదయినా రోగాలొస్తే అంత సులభంగా ట్రీట్మెంట్ ఇవ్వరు. బోలెడంత డబ్బు ఖర్చు. అదంతా ఎందుకుగానీ నీవు అంతగా ఆశపడుతున్నావు కాబట్టి నేను వేరే ఏ ఉద్యోగంలో చేరినా నిన్ను విదేశాలకు తీసుకెళతాను. ఇట్ ఈస్ ఏ ప్రామిస్. నన్ను మాత్రం ఈ బురదలో దిగమని చెప్పొద్దు. ఐ యామ్ సారీ డాడ్.”

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

సతీష్”ఎవరో నీకోసం వచ్చినట్లున్నారు. నేను లోపలికి వెళ్తా డాడ్.”అని లోపలి జారుకున్నాడు.

******

 

నరసింహం అంతరాత్మవైపు చూసాడు.

"చూశావుగా. ఇందులో నేను చేసిన తప్పేమిటి? వాడు మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకోవడం తప్పా?”

"కాదు. కానీ వాడేం చిన్న పిల్లగాడు కాదు. పిల్లలు చిన్న వాళ్ళు. మనం చెప్పినట్లు వినాలి. మనం నిర్ణయించిన లక్ష్యంతో మనం చెప్పినట్లు నడవాలి అనే నియంతృత్వం కూడదు. పిల్లలకూ వ్యక్తిత్వం ఉంది. మనసూ ఉంది అని గ్రహించాలి. నీకన్నా వాడికి పెద్ద సర్కిల్ ఉంది. దాన్తో ఏది మంచో,ఏది చెడో గ్రహించగల విచక్షణ ఉంది. వాడికీ సొంత ఇష్టాలు,అయిష్టాలు ఉంటాయి. నువ్వేంచేశావు?నీ ఇష్టాన్ని వాడి నెత్తిన రుద్దే ప్రయత్నం చేసావు. జీవితంలో డబ్బూ, దానితో వచ్చే విలాసాలే ముఖ్యమని నూరిపోసావు. వాడు నీ కొడుకయినందుకు సంతోషించు.”

నేను చెప్పినమాట విననందుకు సంతోషించాలా?ఎందుకు?”

"చాలామంది ఈ కాలం పిల్లల్లాగా ఇక్కడ అమ్మానాన్నలను వదిలేసి విదేశాలకు వెళ్ళి జల్సా చేద్దామని అనుకోవడం లేదు. వాడికి సంపాదనకంటే మీతో కలిసి ఉండటమే ఇష్టం. ఇదంతా తెలీని నువ్వు,నీ నెరవేరని కోరికల్ని వాడి ద్వారా తీర్చుకోవాలని చూశావు. అది జరగదు అని తెలిసిన నీలో అసహనం మొదలయింది. సరే తరువాతి సంఘటన కూడా చూడు.”

******

కాలింగ్ బెల్ మోగింది.

"ఎస్ కమిన్.”అన్నాడు నరసింహం

గిరిధర్ వచ్చాడు.”గుడ్ మార్నింగ్ సార్.”అన్నాడు గిరి.

పొద్దున ఒకసారి అయిందిగా. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ పోలేదా?”

"చేస్తూనే ఉన్నాను సార్.”

"చేస్తూనే ఉండు. ఆ సీనియర్ మేనేజర్ నాకు క్లాస్ పీకాడు. అసలు నీకు బుద్ధి ఉందా?”

"లేదు సార్.”

అదేమిటీ పుసుక్కున ఒప్పేసుకున్నావు?”

ఏం చేయమంటారు సార్. నాకు బుద్ధి ఉందంటే గతంలో నేను చేసిన పొరపాట్లను ఎత్తిచూపుతారు. అసలు ఆఫీసులో పనిచేసే మనమంతా ఎప్పుడో ఒకప్పుడు ఏదో తప్పు చేసేఉంటాము సార్. అది నేనైనా,మీరైనా,ఇంకెవరైనా సరే. అసలు తప్పు చేయకుండా ఉండాలంటే ఒకటే మార్గం.”

"ఏమిటో అది?”

ఏపనీ చేయకుండా ఎగ్గొడితే సరి.”

"మనం ఎగ్గొడితే పైవాళ్ళు దిగ్గొడతారు. ఇంతకీ ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎందుకు లేట్ అయింది అది చెప్పు.”

మొన్న కొన్ని డౌట్స్ వచ్చాయి సార్.”

వస్తే నన్నడగాలి. నేనొకడ్ని ఇక్కడ తగలడ్డానుగా?”

అదే క్లారిఫై చేసుకుందామని మీరూముకి వచ్చాను సార్. మీ అబ్బాయికి జ్వరంగా ఉందని వెళ్లిపోయారు.”

అది మొన్నటి సంగతి. మరి నిన్నేం చేశావు?

"నిన్న నా వైఫ్ బాత్రూములో జారిపడింది. అందుకే లీవ్ పెట్టాను.”

"నువ్వెళ్ళి ఏం చేస్తావు? నువ్వేమయినా డాక్టరివా?అసలు మీకు పనిలో డౌట్స్ ఎందుకొస్తాయి? పని సక్రమంగా నేర్చుకుంటే కదా? ప్రతిదీ నేనే స్పూన్ ఫీడింగ్ చేయాలి. మీరు సొంతంగా అలోచించి చేయలేరా? కష్టపడి పని చేయాలయ్యా. మేమెంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. మా బాసులు అంత సులభంగా నేర్పేవాళ్ళు కాదు. వాళ్ళ వెంటపడి,నానా తిట్లు తిని నేర్చుకున్నాం. మీకేం? ఏం నేర్చుకోవాలన్నా గూగుల్లో సెర్చ్ చేస్తే బోలెడంత ఇన్ఫర్మేషన్. అవేమీ మిమ్మల్ని తిట్టవూ,విసుక్కోవు. దాన్ని ఎలా అడగాలో తెలుసుకుంటే చాలు. మీకది కూడా చేతకాదు. దాన్ని వెదకడానికి ఓపికా లేదు. కష్టం లేకుండా మాపై పడిపోతారు.”

"మేమేం చేస్తాం సార్. ఒక పని ఇస్తారు. అది చేస్తుండగానే ఇంకో పని చెబుతారు. ఆ తర్వాత మరో పని అర్జెంట్ అంటారు. విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం సగం గుండు గొరిగేలా ఉంది మా పని.”

ఆ మిగతా గొరగడానికి మేం ఉన్నాంగా,రవితేజాలా. పనిదొంగలు తయారయ్యారు.”

మీరు మా బాస్ సార్.”

"అంటే?”

మీరు మా బాస్ కాబట్టి మాకు పని నేర్పాలి కదా సార్.”

"మీకు చెప్పేబదులు నేనే చేసి చావొచ్చు. వేలకు వేలు జీతాలు తీసుకుంటారు. మేం మాత్రం రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్లు లేదన్నట్లు ఇంటికి వచ్చినా ఆఫీస్ పనితో చావాల్సిందే. ఇక నువ్వు తగలడు. ఈ పనులన్నీ నేనే చేసి ఛస్తాలే. నేను చస్తేనే ప్రశాంతత.”అని విసుక్కున్నాడు నరసింహం.

గిరిధర్ వెళ్ళిపోయాడు.

********

అంతరాత్మనరసింహం తో”తథాస్తు అని దేవతలన్నారు. నీవు చచ్చావు. ప్రశాంతత దక్కింది నీకు కాదు, వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ మనసుల్లోని మాటలు తెలుసుకున్న నీకు ప్రశాంతత ఎక్కడిది? అందుకే కోపం కూడదు అనేది.”

"మరి ఆ గిరి పని చేయనిదానికి పైవాళ్ళదగ్గర నేను తిట్లు తినాలా?”

"అతను చేయలేకపోవడానికి కారణం,నీవు పని నేర్పకపోవడం. అతన్ని చూస్తేనే కోపగించుకుంటే నిన్నెలా అడగగలడు. కిందివాళ్ళతో సఖ్యతతో ఉండి,ఓపికతో పని ఎలా చెయ్యాలో నేర్పితే నీకీ సమస్య వచ్చిఉండేది కాదు.”

"అయితే నేను కోప్పడటం తప్పా?

"కోప్పడటం తప్పు కాదు. కానీ సరైన కారణంతో,సరైన వ్యక్తితో,సరైన రీతితో,సరైన సమయంలో,సరైన స్థాయిలో కోపం ప్రదర్శించడం నేర్చుకోవాలి. లేకుంటే ఇలాగే నీకు శాంతి లేకుండాపోతుంది.”

"అవును. నాకు శాంతి లేదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.”

"నిజంగా నీ జీవితంలో ఎప్పుడూ శాంతి సౌఖ్యాలు లేవా?ఎన్నో ఉన్నాయి. మచ్చుకు ఒకటి చూడు.”

మళ్ళీ గతంలోకి వెళ్ళాడు నరసింహం..

******

      నరసింహం ఆఫీస్ నుండి నిస్సత్తువగా,నిదానంగా వచ్చి సోఫాలో కూలబడి కణతలు నొక్కు కుంటున్నాడు. టీపాయ్ మీదున్న వాటర్ బాటిల్ని తీసుకొంటూండగా జారి కింద పడింది. దాన్ని అందుకోబోతుండగా వసుంధర హడావిడిగా వచ్చింది.

ఏమైందండీ?”

తలనొప్పి.”

వసుంధర నరసింహాన్ని తాకి చూసి”అరె జ్వరం కూడా ఉందే?”

నేను వచ్చిన సంగతి నీకెలా తెలిసింది?”

గిరి ఫోన్ చేసి చెప్పారు. మీరు ఈ రోజు డల్ గా ఉన్నారనీ,త్వరగా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లిపోయారని చెప్పారు. అంతే వెంటనే చేస్తున్న పని పక్కన పడేసి పర్మిషన్ పెట్టి వచ్చేసాను.”

"ఇలా మధ్యలో పని మానేసి వచ్చేస్తే మీ బాస్ ఏమనడా?"

రేపు లేట్ అవర్స్ కూర్చుని వర్క్ కంప్లీట్ చేస్తానుగా. మీకన్నా నాకు అది ముఖ్యం కాదు. సరే ఉండండి. జ్వరానికి మాత్ర ఇస్తాను.”అని లోపలికి వెళ్ళింది.

సతీష్ ఆదుర్ధాగా వచ్చి”నాన్నా ! ఎలా ఉన్నారు? అసలేమైంది?”

వసుంధర లోపలి నుంచి వస్తూ”తలనొప్పీ జ్వరం. అవునూ నువ్వు కాలేజీ నుండి త్వరగా వచ్చేసావేం?"

"గిరి అంకుల్ కాలేజీకి వచ్చి నాన్నకు బాగాలేదని చెప్పారు.”

ఆయనేరి?"

గిరి ఫ్లాస్కుతో వచ్చాడు.”ఇదిగో వచ్చేసాను మేడం. మీరు రావడం లేట్ అవుతుందేమోనని కాఫీ తెచ్చాను.”

వసుంధర మాత్ర ఇచ్చింది. సతీష్ నీళ్ళు ఇచ్చాడు. నరసింహం నీళ్ళతో మాత్ర వేసుకున్నాడు. గిరి కాఫీ ఇచ్చాడు.

"సతీష్! నువ్వు బామ్ రాస్తూ ఉండు."అని బామ్ ఇచ్చింది.”జ్వరం తీవ్రంగా ఉంది. నేను చన్నీళ్లతో ఒళ్ళు తుడుస్తాను.”అని లోపలికి వెళ్ళింది. సతీష్ బామ్ రాస్తున్నాడు. నరసింహం కాఫీ తాగాడు. గిరి కప్ అందుకున్నాడు. వసుంధర కర్చీఫ్ తడిపి తెచ్చింది. తల,చేతులు తుడిచింది. నరసింహం వాళ్ళవంక చూస్తున్నాడు.

అన్నట్టు సార్ మీరు వెళ్ళంగానే డాక్లో ఈ లెటర్ వచ్చింది.”అని గిరి చెప్పాడు.

నరసింహం ఆతురతతో లెటర్ అందుకొని చదివాడు.”మై గుడ్నెస్ !"

ఏమైందండీ?”అని అడిగింది వసుంధర.

నరసింహం చాలా ఉత్సాహంతో”ఎంతోకాలంగా ఎదురుచూసిన ప్రమోషన్ నాకు వచ్చింది. అదికూడా ఇదే ఆఫీసులో. నన్ను రెకమెండ్ చేసింది ఎవరో తెలుసా? మా బాసే. నిజంగా ఇది నా అదృష్టమే.”

"కంగ్రాట్స్ అండీ.”

"కంగ్రాట్యులేషన్ నాన్నా.”

"అభినందనలు సార్.”

ముందు ఈ వార్త తెచ్చిన నీ నోరు తీపి చెయ్యాలి. సతీష్! లోపల స్వీట్ ఉంటుంది. తీసుకురా.”

"వద్దులే మేడం. మీ మాటలే తీయగా ఉంది. అది చాలు.”అన్నాడు గిరి.

"ఈ రోజు... ఈ రోజు... నాకు ఎంతో సంతోషంగా ఉంది.”అని సంతోషం తో పొంగిపోయాడు నరసింహం.

మీరు కూర్చోండి. ఎక్సయిట్ కాకండి. అసలే ఆరోగ్యం బాగాలేదు.”

నో... నో... ఐ ఆమ్ ఆల్రైట్ నౌ. ఫరవాలేదు.”

మీరు అనురాగం,ఆప్యాయతలతో చేసిన సపర్యలకు సార్ కుదుటపడ్డారు.”అన్నాడు గిరి.

అదేం కాదు గిరీ మీరు తెచ్చిన ప్రమోషన్ ఆర్డర్ వల్లే ఆయన కోలుకున్నారు.”

"గిరీ! నా జాయినింగ్ రిపోర్ట్ రెడీ చేసి పెట్టు. రేపే జాయిన్ అవుతున్నా.”

"అలాగే సార్.”అని వెళ్ళిపోయాడు గిరి.

******

అంతరాత్మ నరసింహాన్ని చూసి”బాగుంది. చాలా బాగుంది. జరిగితే జ్వరమంత వైభవం మరొకటి లేదనుకుంటా. కానీ నాకర్థం కానిదేమిటంటే వాళ్ళంతా అంతటి సేవలందిస్తుంటే నీనుంచి ఒక్క కృతజ్ఞత మాట కూడా రాలేదేమిటో?”

నా అనారోగ్యంతో కాలు ఆడలేదు,చెయ్యి ఆడలేదు.”

నోరు కూడా ఆడలేదా? దాన్ని కట్టి పడేశావా?మరి ప్రమోషన్ వార్త తెలుసుకోగానే నీ రోగం పటాపంచలయిందే? ఆ సంతోషం నిన్ను నిలబెట్టిందిగా? వాళ్ళు నిన్ను అభినందించినప్పుడయినా కృతజ్ఞతలు చెప్పవచ్చుగా? చెప్పవు. ఎందుకంటే అలా చెబితే నువ్వు వాళ్ళ దృష్టిలో చులకనైపోతావేమోనని ఆలోచించావు.”

నరసింహం తల దించుకున్నాడు.

దాంతో అంతరాత్మ”నీతో సమస్య ఏమిటంటే ఎదుటివారు పది మంచి పనులు చేస్తే వాటన్నిటినీ మరిచిపోతావు. ఒక పొరపాటు చేస్తే దాన్నే భూతద్దంలో వందల సార్లు చూస్తావు.”

మరి నేను ఆనందంగా ఉండాలంటే ఏం చేసిఉండాల్సింది?”

మనసు ఒకసారి ఆనందంతోఅంతెత్తున ఎగిరిపడుతుంది. మరోసారి బాధతో చతికిలపడుతుంది. కష్టం వచ్చినప్పుడు మనం సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటే దిగులు మనసు వదిలి పారిపోతుంది. మనసు విచిత్రమైనది. దానికున్న మంచి లక్షణం ఒకేసారి రెండు అనుభూతులను పొందలేకపోవడం. ఇందాకటి సంఘటనలోనే చూడు. నువ్వు ఒళ్ళు బాగులేకుండా ఉన్నావు. ఓ పక్క నీ భార్య,నీ కొడుకు నీకు శుశ్రూష చేసినా ప్రమోషన్ వార్త నిన్ను తక్షణమే కోలుకునేలా చేసింది.నీ జీవితంలో సుఖం లేదని నువ్వు అనుకుంటే సుఖం ఉండదు. ఆశావాదంతో ఉంటే ఆనందమే.”

"అయితే ఇప్పుడేమంటారు?”

సంబంధాలనేవి పూలతోటలాంటిది. ప్రతిరోజూ వాటికీ నీళ్లు పోసి పోషించాల్సిందే. అలాగే మనతో ఉన్నవాళ్ళతో ప్రేమతో,కరుణతో,మర్యాదతో ఉండాల్సిందే. ఎప్పుడో ఒకసారి మనం చూపించిన ఆప్యాయతకే జీవితమంతా మనకు ఋణపడిపోతారని,మనం చెప్పినట్లు,మనం అనుకున్నట్లు ఉంటారనుకోవడం ఒట్టి భ్రమ. వాళ్ళ కష్టసుఖాల్లో నిత్యమూ పాలుపంచుకుంటూనే ఉండాల్సిందే. నిన్ను అర్థం చేసుకోవడంలేదే అని బాధపడకూడదు. వాళ్ళను నువ్వే అర్థం చేసుకోవాలి. నీ చుట్టూ ఉన్నవారితో సంబంధాలు ఒక భావోద్వేగ బ్యాంకు అకౌంట్ లాంటిది. వారికీ నువ్వు అందించే ప్రేమ,గౌరవం,కృతజ్ఞత,నిజాయితీ,సహాయం,కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం నువ్వు డిపాజిట్ చేసే డబ్బులాంటిది. కానీ వాటికి విరుద్ధంగా వారిపై ద్వేషం,అగౌరవం,అమర్యాద,కృతఘ్నత వగైరాలు చూపించడం విత్ డ్రా చేసే డబ్బు లాంటిది. నువ్వు డిపాజిట్ చేసినదానికంటే ఎక్కువ డ్రా చేస్తే నీ జీవితంలో ప్రశాంతత ఉండదు.”

ఇప్పుడు ఇవ్వన్నీ లేటుగా తెలుసుకుంటున్నా. ఇంకో జన్మలోగాని ఈ తప్పులను సరిదిద్దుకోలేను. నాకు ముందే తెలిసుంటే బాగుండేది.”

కాదు. ఇవన్నీ నీకు ముందే తెలుసు. నువ్వు ఎన్నో పుస్తకాలు చదివావు. ఎందరో మేధావులద్వారా విన్నావు. ఆచరణలో పెట్టడానికి నీ పురుషాధిక్యత అడ్డం వచ్చింది. నీ పెద్దరికం అడ్డొచ్చింది. నీ అధికారం అడ్డొచ్చింది.”

"సరే గతం గతః. నా గతించిన జీవితాన్ని ఏమీ చెయ్యలేను గదా. అది మారదు గదా?

నువ్వనుకుంటే మారుతుంది.”

ఎలా?”

"నువ్వు లేట్ కాదు కాబట్టి. అంటే నువ్వు లేట్ నరసింహం కాదు కాబట్టి. నువ్వు చావలేదు. నిన్న నీ స్నేహితుడు చనిపోతే చుట్టూ ఉన్నవారు అతని గురించి మంచిగా చెప్పిన మాటలు విని,నీ తర్వాత నీ గురించి అందరూ ఏమనుకుంటారో అనే ఆలోచనతో నిద్రపోయావు. ఆ నిద్రలో నీ జీవితాన్ని సింహావలోకనం చేసుకున్నావు. అంతే ఇప్పుడు మేలుకో. ఈ రోజు నుండి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. వెళ్ళు.”

నరసింహం ఆనందంగా అంతరాత్మతో”థాంక్యూ వెరి మచ్ న కళ్ళు తెరిపించావు. ఇక నాలో కొత్త నరసింహాన్ని కాదు కాదు నరుడ్ని చూస్తావు.”అన్నాడు.

దానికిఅంతరాత్మ”హమ్మయ్య! ఇన్నాళ్ళకు థాంక్యూ అన్నమాట నీ నోటా వచ్చింది. ఇపుడు నిజగానే నీలో మార్పు వచ్చింది. ప్రొసీడ్”అంది అంతరాత్మ.

గతంలోకి.. కాదు కాదు.. వర్తమానం లోకి నరసింహం వెళ్ళాడు. అంటే ఎంతసేపు గాఢ నిద్రలో ఉన్న నరసింహం మెలకువలోకి వచ్చాడు.

కవితలు

కొడుకా...

కొడుకా...

ఎట్లున్నవో.

మీ అమ్మ

కంటికి పుట్టెడు దారలు కారుతున్నాయి

నీ జాడ కోసం.

 

కొడుకా.. ఓ కొడుకా

కండ్లల్ల నీరూపే మెదులుతుంది

కాళ్ళల్ల చేతుల్లో తిరిగినట్లున్నది

చాత కానీ ముసలి దాన్ని

కండ్లు లేవు

కాళ్ళు లేవు

నువ్వు యాడ ఉన్నవో చూద్దామన్నా.

 

ఏ యమ కింకర్ల చెరలో చేరితో

ఏ చిత్ర హింసల కొలిమిలో

కాగుతున్న వాడివో కొడుకా.!

 

కొడుకా

అవ్వకు చిన్నొడివి

బుద్దులు నేర్చినొడివు

అందరిలో కలుపుగోలుపుతనము ఉన్నోడి

నీ మీదనే పంచ ప్రాణాలు పెట్టుకున్న అమ్మకు

కన్నీళ్ళ బాటను తెస్తివా కొడుకా

 

ఏ గ్రహణం వెంటాడింది నిన్ను

అమ్మకు కొడుకు యెడ బాటు

చెరసాలనే నీన్ను బందీని చేసేనా

కొడుకా...!!

 

కొడుకా

నీ ప్రేమగల్ల మాటను

నీ రూపును

నేను కన్ను మూసే లోపు చూస్తానా..!?

అవ్వ అన్న పిలుపు

అమ్మమ్మ అనే నీ ఆప్యాయతను

నా గుండెలకు హత్తుకొని

నా కండ్ల నిండా నీ రూపాన్ని

మీ అమ్మతోడు చూసుకొని

మా అమ్మ చెంతకు పోతాను కొడుకా..

 

కొడుకా

రాళ్ళ మీద పూలు పూసే రోజులు రావాలి

మీరు చల్లగ బతుకుండ్రి కొడుకా..

 

(అమ్మమ్మ గంగవ్వ బాధను చూడలేక, అక్రమంగా అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైళ్లలో ఉన్నప్పుడు అమ్మ ములాఖాతుకు వచ్చిన సందర్భంతో (feb 8,2019)పాటు,చివరగా (Feb 17,2022) అమ్మమ్మను చూసి అప్పటి జ్ఞాపకాన్ని ఇప్పటి తల పోతాను కలుపుకొని అమ్మమ్మ మాటనే ఇలా రాసుకున్నది......)

 

 

నవలలు

కూలి బతుకులు – పదవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                         10

బిజెపి పార్టీ రామజన్మభూమి వివాదం రెకెత్తించింది. అద్వాని నాయకత్వలో జరిగిన రథయాత్ర మత ప్రాతిపదికన దేశాన్ని రెండుగా చీల్చింది. ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఎదో విదంగా అధికారంలోకి రావటానికి పన్నిన కుట్రలో బాగంగానే రామజన్మభూమి వివాదం ముందుకు తెచ్చారు. దానికి తోడు మోడిముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన గుజరాత్‍ అల్లర్లు ముస్లీంలూచకోత హిందు మతోన్మాదాన్ని తీవ్ర స్తాయికి తీసుకపోయింది. కాంగ్రెసు పదెండ్ల పాలన ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. సరికదా అనేక కుంభకోణాతో భ్రష్టు పట్టపోయింది. ఈ నేపథ్యంలోనే జరిగిన ఎన్నికల్లో నరెంద్రమోడి నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చింది.

  పదిహెడవ లోకసభ ఎన్నికలను ప్రకటించింది. ఏప్రిల్‍ రెండవ వారం నుండి నాల్గవ వరకు ఏడు పేజుల్లో జరుగనున్నాయి.

  రామయ్య కాలనీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అసలే ఎండలు మండి పోతున్నాయి. అంత కంటే ఎక్కువగా ఎన్నికల వేడి మొదలైంది. రామగుండం పెద్దపల్లి పార్లమెంటు యస్సి నియోజక వర్గంలోకి వస్తుంది. కాని ఎన్నికల్లో పోటీ పడుతున్నాది మాత్రం ఇద్దరు హేమాహేమీలు. పేరుకు వాళ్ళు యస్సిలేకాని అర్థికంగా బాగా బలం కలిగినోళ్ళు.

  తెలంగాణలో అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి తరుపున వెంకటేశ్‍నేతను పోటికి నిలిపారు. రాజకాయాల్లో ఏదీ శాశ్వతం కాదు గత డిసెంబర్‍ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిదిలోని చెన్నూరు నియోజక వర్గం నుండి వెంకటేశ్‍ కాగ్రెసు తరుపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిండు. అంతా అర్నెల్ల కాలేదు. అంతలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చినవి. పార్లమెంటు ఎన్నికల ప్రకటన వెలువడిన తరవుఆత ఆయన టి.ఆర్‍.యస్‍ పార్టీలోకి మారి సీటు దక్కించుకున్నాడు.

  రాజకీయ పార్టీలు ఏవి ఏవిలువలు పాటించటం లేదు. ఎన్నికల్లో గెలువగలిగే సత్త ఉండి, డబ్బు దస్కం బాగా ఖర్చుపేట్టె వారిని ఏరి కోరి, పిలిచి మరి టికట్‍ ఇస్తానయి. అంటే గెలుపు గుర్రాల మీద పార్టీలు పందెం కాస్తున్నాయి. అ విదంగా చూసినప్పుడు వెంకటేశ్‍ నేతఅందుకు సమర్థుడని పార్టీ బావించింది. పెద్దపెద్ద కంట్రాక్టులు చేసి ఆయన వందల కొట్లు సంపాధించిండు.

  ఎన్నికలంటే మాటలు కాదు కొట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. పుట్టపిత్తులా పైసలు ఎగజల్లి ఓట్లు రాబట్టుకోవాలి. ఎన్నికల్లో నెగ్గిన తరువాత అంతకు పదింతలు రాబట్టుకోవచ్చు. రాజకీయాలు పక్తు వ్యాపారం అయిన చోట అంతకంటే ఎక్కువ ఏమి అశించలేము.

  ఇటువంటి రాజకీయాల్లో అరితేరిన వాడు తెలంగాన రాష్ట్ర సమితి నాయకులు చంద్రశేఖర్‍ రావు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తిగా పేరుంది అవిదంగా ఆయన 2014లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకిజరిగిన ఎన్నికల్లో నెగ్గి మొదటి ముఖ్యమంత్రి అయిండు.

 

  అధికారంలోకి వచ్చిన తరువాత అయన అసలు రంగు బయట పడసాగింది.

  ఏ ఆశల కోసమైతే తెలంగాణ ప్రజలు పోరాడిండ్లో ఆ ఆశలను నీరుగరుస్తు పోయిండు. తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి, తనకు ఎవరు రాజకీయాల్లో పోటీ రాకుండా ఉండటం కోసం ఉధ్యమంలో తనతో కలిసి పనిచేసిన వారిని ఒక పద్దతి ప్రకారం పక్కకు పెట్టి అవకాశ వాదులు, జంపు జాలానిలను, తన చెప్పు చేతుల్లో మెదిలే వాళ్ళను పార్టీలో చేర్చుకొని వారికే సీట్లు ఇచ్చి రెండో సారి కూడా అధికారంలోకి వచ్చిండు. తన అధికారాన్ని పటిష్ట పరుచుకొని తన తదనంతరం తన వారసుడే అధికారంలో వచ్చే లక్ష్యంతో మొత్తం యాంత్రంగం సిద్దం చేసిండు.

  ఇప్పుడిక రాష్ట్రంలో ఆయన మాటకు ఎదురు లేదు. ఆయన నంది అంటే నంది పంది అంటే పంది అని తలలు ఊపపటం తప్ప ప్రనజాప్రతినిధులు ఎవరు ఎదురు చెప్పె పరిస్థితి లేదు.

  వాస్తవానికి టి.ఆర్‍.యస్‍. పార్టీ పెద్దపల్లి పార్లమెంటు పార్టీ సీటు వివేక్‍ కు ఇవ్వాల్సి ఉండే. వివేక్‍ రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రమిక వెత్తె కాకుండా అటు కేంద్రం లోను ఇటు రాష్ట్రంలోను పలుమార్లు మంత్రి పదివి చేసిన సుదీర్ఘ రాజకాయ చరిత్ర కల్గిన వెంకటస్వామి కొడుకు.

  తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్‍.యస్‍ పార్టీకి మధ్య సయోధ్య కుదర్చటంలో కీలక పాత్ర వహించిండు. సోనియా గాంధీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు సాసు చేయించటంలో వెంకటస్వామి పాత్ర ఉంది. ఎమైతే నేమి తెలంగాణ వచ్చింది. అయితే అవసరానికి  బొంత పురుగు నైనా ముద్దుపెట్టుకొనే టి.ఆర్‍.యస్‍ నాయకునికి అవసరం లేదనుకుంటే నిర్దక్షక్ష్మీ్యంగా కాలతో తన్నె స్వబావం కూడా ఉంద. అవిదంగా చంద్రశెఖర్‍రావుకు వివేక్‍ మధ్య విబేదాలు పొడుసూపినవి. అందుకు మరో కారణం కూడా ఉంది. కేసిఆర్‍ మొదటి సారి ఎన్నికలకు పోయినప్పుడు తల ఎన్నికల ప్రణాళికలో  తెలంగాణ రాష్ట్రానికి మొదటి  ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిండు. తాను తెలంగాణ రాష్ట్రనికి కావాలి కుక్కలా ఉంటాగాని ఏ పదవులు అశించనని పలు సందర్భాల్లో ప్రకటించిండు. అవిదంగా తెలంగాణలో టి.ఆర్‍.యస్‍ అధికారంలోకి వస్తె మొదటి ముఖ్యమంత్రివి నువ్వె నంటూ వివేక్‍కు ఆశ చూపి డబ్బు దస్కం కాజెసిండు. చివరికి ఎన్నికల ముందు సీట్లు పంచేకాడ వివిక్‍ను ముఖ్యమంత్రి పోటీదారుడుగా రాకుండా చేయ్యటానికి వివేక్‍కు పార్లమెంటు సీటు ఇచ్చిండు. అంతే తనను ముఖ్యమంత్రి కాకుండా చేయటానికి కపట నాటకం అడుతున్నాడని గ్రహించిన వివేక్‍ టి.ఆర్‍.యస్‍ పార్టీని వీడి మళ్ళి కాంగ్రెసు పార్టీలో చెరి అ పార్టీ తరుపున పెద్దపల్లి పార్లమెంటుకు పోటి చేసిండు. కాని అప్పటికి టి.ఆర్‍.యస్‍ గాలి ఉండటం వలన అపార్టీ అభ్యర్థి చెతలో ఓడిపోయిండు.

  సామన్యులకైతే ఎవడు అధికారంలో ఉన్నా ఓరిగేది ఏముండదు కాని వ్యాపార వెత్తలకు పారిశ్రామిక వెత్తలకు అధికారం అండలేకుండా మనుగడ సాధించటం కష్టం అప్పటికి కెంద్రంలో రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెసు పార్టీ, ఒడిపోయి కెంద్రంలో జిజెపి ప్రభుత్వం రావటంతో రెంటికి చెడ్డ రేవడిలా అయింది వివేక్‍ రాజకీయ పరిస్థితి. దాంతో ఆయన చివరికి రాజీపడి పోయి అనివార్యంగా మళ్ళీ టి.ఆర్‍.యస్‍ పార్టీలోకి వచ్చిండు. అట్లా వచ్చిన వారికి ఎదో నామినేటడ్‍ పదవి అయితే కెసిఆర్‍ ఇచ్చిండు కాని వీడు ఎప్పటికైనా తనకు ప్రమాదమేనని బావించిన కెసిఆర్‍అదను చూసి వివేక్‍ను చావు దెబ్బతీసిండు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే గడువు చివరినిముషం ముగిసే వరకు నాన్చి చివరినిమిషంలో వెంకటేశ్‍కు సీటు ఇచ్చిండు. వివేక్‍ ఇంకో పార్టీ తరుపున ముఖ్యంగా కాంగ్రెసు తరుపున పోటీ చెయటానికి వీలు లేకుండా చేసిండు. దాంతో వివేక్‍కు అటు టి.ఆర్‍.యస్‍ తరుపున కాని కాంగ్రెసు తరుపున కాని పోటికి నిలబడే పరిస్థితిలేకుండా పోయింది.

  కాంగ్రెసు పార్టీ చివరి నిముషం వరకు వివేక్‍ను సీటు ఇవ్వటానికే ఎదురు చూసింది. కాని చంద్రశెఖర్‍రావు వారికి అటు వంటి అవకాశం ఇవ్వలేదు.

  కాని చాల విచిత్రం ఏమిటంటే కాంగ్రెసు తరుపున ప్రస్థుతం పోటీ చేస్తున్న చంద్రశెఖర్‍రావు కూడా ఒకప్పుడు టి.ఆర్‍.యస్‍ పార్టీకి చెందినవాడు. అ పార్టీ తరుపున ఎమ్మెల్యెగా నెగ్గి రాజశెఖర్‍ రెడ్డి ప్రభుత్వంలో టి.ఆర్‍.యస్‍ పార్టీ తరుపున మంత్రిగా చేసినవాడు. ఇప్పుడు కాంగ్రెసు అభ్యర్థి తన భవితవ్యాన్ని తెల్చుకోవటానికి బరిలోకి దిగిండు.

  జిజెపి పార్టీకి తెలంగాణలో బలం అంతంత మాత్రమే. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంనుండి నిన్న మొన్నటి నక్సలైట్‍ మూమెంటు వరకు అనేక పోరాటలు జరుగటం వలన ప్రజల్లో కమూనిస్టు బావజాలం ఎక్కువ. పలితంగా జిజెపి మతోన్మోద రాజకీయాలు తెలంగాణలో అంతగా ప్రబావం చూపలేక పోయింది. హైద్రాబాద్‍ పట్టణంలో మాత్రం ఎం.ఐ.ఎం. ప్రాబల్యం ఎక్కువ ముస్లీంమతో న్మోదాన్ని రెచ్చగోట్టి అక్కడ అ పార్టీకి ఒక పార్లమెంటు సీటు, అరేడు అసెంబ్లీ సీట్లు ఎప్పుడు గెలుస్తుంటాయి. దానికి ప్రతిగా అ ప్రాంతంలో బిజెపి హిందు సమాజాన్ని రెచ్చ గొట్టె కొంత బలంసంపాదించి అక్కడి నుండే ఒక రెండు అసెంబ్లీ సీట్లు గెలుస్తుంది తప్ప తెలంగాణ వ్యాపితంగా దాని ప్రాబల్యం తక్కువ కాని ఈ సారి కెంద్రంలో బిజెపి అధికారంలో ఉండటం వలన దాని అండ దండలతో బిజెపిపార్టీ తెలంగాణలో పాగా వేయాటానికి సిద్దమై చాలచోట్ల తను అభ్యుర్థులను నిలిపింది. అవిదంగా బిజెపి కూడా పెద్దపల్లి అసెంబ్లికితన అభ్యర్థిని నిలిపింది.

  ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్నవి. ఇది వరలో అయితే రెపు ఎన్నికలనగా అంతో ఇంతో తాగబోయించి, పదో పర్కొ చేతుల్లో పెట్టి ఓట్లు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాలేదు. ఓటర్లను ప్రలోభ పెట్టి ఖర్చుబాగా పెరిగిపోయింది. చివరికి మీటింగ్‍లు పెట్టాలన్నా ర్యాలీలు తీయలన్నా జనాలకు బిర్యాని పొట్లాలు ఇచ్చి మందు పోసి మీదికేలి రోజు మూడు నాలుగు వందల చేతిలో పెడ్తెకాని జనం రావటంలేదు. ఇవ్వాళ ఈ మీటింగ్‍లకు పోయిన వాళ్ళె మరో రోజు మరో పార్టీ పిలిచే మీటింగ్‍ లకు పోతాండ్లు. ఇకతాగు బోతులకైతే ఎన్నికలు వచ్చిన వంటే పండుగే మరి.

  కాంగ్రెసు నాయకుడు ఒక పర్యయం వచ్చి కాలనీలో ఇల్లిల్లు తిరిగి పోయిండు. టి.ఆర్‍.యస్‍ నాయకుడు వెంకటేశం మాత్రం కాలనీకైతే రాలేదు. కాని ఆయన అనుచరుడు సత్యనారయణను పంపించి గోదవరిఖనిలో తమనాయకులతో జరిగే బారి బహిరంగ సభకు మనిషికి ఐదువందలు ఇచ్చి మరి తీసుకపోయిండ్లు.

  రామయ్య కాలనీలో కూలీలు రెండు గ్రూపులుగా చీలిండ్లు. ఒకటితెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ల దైతే రెండోది కాంగ్రెసు వాళ్ళది. ఈ రెండు పార్టీలు కాకుండా బిజెపికి చెదిన అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నడుకాని  అతనికి అంతగా అర్థిక స్థోమత లేదు. ఎదో ఒకటి రెండు సార్లు జీపుల్లో వచ్చి ఒక రౌండు కాలనీలో తిరిగి పోయిండ్లు. అది కూడా కంట్రాక్టరు రంగయ్య బలవంతం మీద.

  కాలనీలో కాంగ్రెసు పార్టీకి చిన్న చితుక కంట్రాక్టులు చేసే జానకిరాం నాయకత్వం వహిస్తే టి.ఆర్‍.యస్‍ పార్టీకి సుబ్బారావు నాయకత్వం వహిస్తున్నారు.

  గంగమ్మకల్లు బట్టీ కాడ సాయంత్రమే కాదు. పొద్దంత కూలీలు ముగుతున్నారు.

  ‘‘మీరేమి రంది పడకుండ్లే కడుపు నిండా తాగుండ్లే బిల్లు సంగతి నేను చూసుకుంటా’’ అంటూ జానికిరాం బరోసా ఇచ్చిపోయిండు.

  సాయంత్రం అయితే కనుకమల్లు ఇంటికాడ చీప్‍ లిక్కర్‍ పంచుతాండ్లు. అవిషయం తెలిసి రాంలాల్‍ వచ్చి నాగయ్యను కనకమల్లు ఇంటికి తీసుక పోయిండ్లు. అక్కడ రాజీరు కనిపించి ‘‘కొడుకు టి.ఆర్‍.యస్‍ తండ్రి కాంగ్రెసు’’ అన్నాడు వ్యంగంగా....

  అమాటకు నాగయ్యకు మనసుకు బాదేసింది సత్తెన్న గులాబి జెండా పట్టుకొని తిరుగుతాండు. నియోజక వర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సత్యనారాయణ సత్తెయ్యను వెంటేసుకొని తిరుగుతండు. రామయ్య కాలనీ బాధ్యతంత నువ్వె చూడాలిఅంటూ సత్యనారాయణ సత్తెయ్య మీద బారం పెట్టిండు.

  అప్పటి నుండి సత్తెయ్య క్షణం రికామి లేకుండా తిరుగుతాండు. అవసరం కొద్ది ఎమ్మెల్యే రాసుక పుసుక తిర్గెసరికి సత్తయ్య ఉబ్బితబ్బిబ్బు అయి ఎన్నికలు తప్ప వేరే లోకం లేకుండా పోయింది.

  రాజీరు మాటలకు చిన్నబోయిన నాగయ్యను చూసి రాంలాల్‍ ‘‘వాడుత్తతాగుబోతు... వాని ఇంట్లకేలి ఎమన్నా ఇస్తాడా.. మంచి మంచోళ్లె ఇయ్యల ఈ పార్టీలో ఉంటే రేపు మరో పార్టీలో ఉంటాండ్లు. రాజీరు మాటలేమి పట్టించుకోకు అన్నాడు.

  అయిన నాగయ్య మనసు ఓప్పక కనకమల్లు ఇంట్ల అడుగుపెట్టక అటునుంచి అటే తిరిగి వచ్చిండు. అది చూసి కనకమల్లు ఎన్నికల సమయంలో ఇటువంటివ ఏం పట్టించుకోవద్దు అంటూ రాజీరు మీద కోపం చేసిండు.

  తెంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ కాలంలో మొదటి నుండి పని చేసిన కవారిని కాదని నిన్నగాక మొన్న పార్టీ మారిన వాన్ని పిలిచి టికట్‍ ఇచ్చుడేందీ అంటూ మొదటి నుండి జెండా మోసిన వాళ్ళు కొందరు అలిగి పార్టీ విడిచిపోయిండ్లు. మరికొందరిని బురదగించి నామినేట్‍డ్‍ పదువులు వస్తయని ఆశ చూపి కొందరిని డబ్బులిచ్చి కొందరిని అధికార పార్టీ కాపాడుకొన్నాది.

  ఓట్ల కోసం నాయకులు కులాల పేరు మీద ప్రాంతాల పేరుమీద జనాలను చీల్చిండ్లు. జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి ‘‘ఇదిగోమనమంత ఒక్కటిగా ఉండాలి. లోకలోల్ల మాటలు విని మనం బొర్లా పడవద్దు. కాంగ్రెసుపార్టీ అంటే ఎనకటి నుంచి ఉన్న పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీ స్థాపించిన పార్టీ కుక్కమూతి పిందెల్లా పుట్టుకొచ్చె ప్రాంతీయ పార్టీలు ఇవ్వాల ఉంటాయి రేపు మట్టికలుస్తయి వాటిని నమ్ముకుంటే లాభం లేదు. నేను చంద్రశేఖర్‍ సారుతోని మాట్లాడిన ఎన్నికల్లో నెగ్గిన తరువాత ఆయన చేసే మొదటి పని ఏటంటే మన అందరికి రేషన్‍ కార్డులు ఇప్పిసతనన్నడు. మన ఓరియా వాళ్ళకు తాగేందుకు మంచి నీళ్ల పంపులు వేయిస్తనన్నడు.

  ‘‘అంటూ చెప్పుకొచ్చిండు.

  జనాలకు ఆ మాటలు సమజ్‍ కాలే ఇయ్యాల ఎన్నికలు వచ్చినయిని ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవటానికి ఇటు ఓరియా వాళ్ళమని అటు ఆంద్రోళ్లని ఎదో ఎదో చెప్పుతున్నరు కాని వాళ్ల జీవితంలోవాళ్ళె ప్పుడు అ తెడాలు పాటించనే లేదు. కూలి చేసేకాడ అందరు సమానమే. ప్రాంతలు వేరైనా వారందరి బాధలు ఒక్క తీరుగానే ఉన్నాయి. ఒకరి కష్ట సుఖల్లో మరోకురు పాలుపంచుకున్నారు. అక్క తమ్ముడు అంటూ వరసలు పెట్టి పిలుచుకున్నారు. అంతెందుకు నెల రోజుల క్రింద లారీమీది క్లినర్‍ పనలు చేసే చన్నులాల్‍ చనిపోతే వీళ్ళు వాళ్ళు అనకుండా అందరు కలిసి మనిషింత చందాలు వేసుకొని చావు చెసిండ్లు.

  చన్నులాల్‍కు ఎనక ముందు ఎవరు లేరు. కుటుంబం ఎక్కడో ఓరిస్సాలోని మారు మూల గ్రామం ఒక్కడే పని వెతుక్కుంటు వచ్చిండు. అందరితో కలవిడిగా ఉండేవాడు. ఒక్కడే ఉండేవాడు. ఎమైందో ఎమో వానికి టి.బి. వచ్చింది. చీకేసిన బొక్కలా బొక్కలు తేరి, తిండికి లేక ఎండి పోయి ఎండిపోయి సచ్చిండు.

  జానకిరాం కూడా ఒకప్పుడు అందరిలాగే పొట్ట చేతపట్టుకొని బ్రతక వచ్చిండు. కాని కాస్త హుషారు తనం ఎక్కువ. అట్ల ఇట్ల చేసి కంట్రాక్టర్ల దగ్గర మేస్త్రీ పనిచేస్తూ క్రమంగా సబ్‍ కంట్రాక్టులు పట్టి నాల్గు పైసలు సంపాదించిండు. ఎవరిని లెక్క చేసేటోడుకాదు. అటువంటి వాడు ఎన్నికల వచ్చే సరికి మెత్తమెత్తగా మాట్లాడుతాండు. లేని ప్రేమ వొలక పోస్తాండు.

  ‘‘ముందుగాల పంపులు వేయించుండ్లీ, నీళ్ళు దొరకక హరిగోస పడ్తానం’’ అంటూ బసంత్‍ నాగ్‍ భార్య సుభనా అడ్డుతగిలింది.

  జానకిరాం సుభన కేసి చూసి ‘‘ఎన్నికల్లోగెలిచినంక చేయించే మొదటి పని అదే’’ అన్నాడు మరోసారి.

  ‘‘ఆఎన్నికలైనంకమా మొఖం ఎవలు చూస్తరు’’ అంటూ హరిరాం అడ్డుపడ్డడు.

  ‘‘ఎన్ని ఏన్నికలు చూడలేదు ఎన్నికలప్పుడు గిట్లనే చెప్తరు పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్లు. రెషన్‍ కార్డులు ఇప్పిస్తమన్నారు. పంపులు వేయిస్తమన్నారు. ఓట్లు వేయించుకొని గెలిచి ఇటు మొఖంరాలే’’ అంటూ మరోకరుగుణిగిండు.

  జానకిరాంకు మనసులోకోపం కల్గింది కాని బయట పడలేదు. మొఖం మీద శాంతాన్ని తెచ్చుకొని’’ టి.ఆర్‍.యస్‍ వాళ్ళ పనే అంత. ఎన్నికలప్పుడు మాట చెప్తరు. గెలిచినంక ఇటుదిక్కు అయినా రారు. కాని మన సారు అట్లా కాదు. మాటిస్తె చేసేదాక నిదురపోడు’’ అన్నాడు బరోసాగా...

  ‘‘ఆ అందరుగంతే’’ అన్నాడు మరోకరు.

  పరిస్థితి చెయ్యిదాటెట్టుందని జానకి రాంకు అర్థమైంది. ఇంకా ఎక్కువసేపు మీటింగ్‍ పొడిగిస్తె ప్రమాదమని బావించిండు.

  ‘‘ఇదిగో నామాట నమ్ముండ్లీ. మనమంతా ఒక్కకటే ఈ సారి మాట తప్పెదుంటే మళ్ళీ మీకు నా మొఖం చూయించ’’ అన్నాడు.

  మీటింగ్‍ ముగించి జానకిరాం సోన్‍లాల్‍, ప్రసాత్‍, రాంజీని, గోపాల్‍, బాసంతనాగ్‍ను వెంట బెట్టుకొని వెళ్ళిపోతుంటే సుభాన పెద్ద గా గొంతు చేసుకొని ‘‘ఇంట్ల తిండికేం లేదు. తాగితందానలాడి వస్తే ఊరుకునేదిలేదు. అ ఇచ్చేది ఎదన్నా ఉంటే మాకే ఇచ్చిపోండ్లి’’అంది.

  జానకిరాం చిన్నగానవి ‘‘ఇప్పుడదేంలేదు’’ అంటూ వాళ్ళను తోలుకొని పోయిండు.

  రామయ్య కాలనీలో జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి మాట్లాడిన సంగతి తెలిసి సుబ్బారావు అగమెఘాల మీద తెలుగోళ్ళ గుడిసెలను చుట్టెసి బెంగాలివాళ్ళ గుడిసెల కేసి నడిచిండు.

  ‘‘బెంగాలి వాళ్ళయి ఎన్ని ఓట్లుంయి’’ అని సత్తయ్యను అడిగిండు.

  ‘‘ఎంతలేదన్నా యాబై అరువై ఉంటయి’’ అన్నాడు సత్తయ్య వినయంగా...

  ఒక్క ఓటు కూడా జారిపోవద్దు.. అందర్ని కలువాలి ఎట్లయితే వింటరో అట్లా విన్పించాలి. డబ్బుల గురించి అలోచించవద్దు... ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఓట్లు మనకు పడాలి’’అన్నాడు సుబ్బరావు.

  సమస్యేలేదు సార్‍... ఒక్క ఓటు కూడా అపోజిషన్‍కు పోదు... అందరు మనోళ్ళె’’అన్నాడు సత్తయ్య...

  ‘‘అట్లాఅనుకోవద్దు...వోవర్‍ కాన్పిడేన్స్కు పోతే అసలుకే మోసం వస్తది’’ అన్నాడు సుబ్బారావు బొమ్మలు ఎగరేసి.

  సుబ్బారావు తన అనుచరులతో కలిసి బెంగాలి వాళ్ళ గుడిసెలకేసి నడిచిండు.

  తూర్పు పాకిస్తాను బంగ్లాదేశ్‍గా విడిపోయినప్పుడు కాందీశీకులుగా వచ్చిన వారికి ఉపాధి కల్పించటంకోసం దేశంలోని వివిద ప్రాంతలకు పంపించిండ్లు. అట్లా కొంత మంది రామగుండుం వచ్చిండ్లు. ఎన్టిపిసి పనులు సాగినప్పుడు అందులో చాల మంది పని చేసిండ్లు. కాని నిర్మాణపు పనులు పూర్తయిన తరువాత పనులు లేక చాలమంది వేరే ప్రాంతాలకు వలసపోయిండ్లు. చాల కొద్ది మంది మాత్రం మిగిలిండ్లు.

  బెంగాలికార్మికులు ఉండే గుడిసెలు మిగితా కార్మికులు ఉండే గుడిసెల కంటే కాస్త బిన్నంగా ఉంటాయి. ఉన్నంతలో గుడిసేలను బందోబస్తుగా కట్టుకుంటరు. శుచి శుభ్రత పాటిస్తరు.

  సుబ్బారావు తన అనుచరులతో అక్కడికి చేరుకునే సరికి టి.కే సర్కార్‍ ఇంటి మీద కాంగ్రెసు జెండా ఎగురుతు కన్పించింది. సత్తయ్య కేసి ఇదెంటన్నట్టుగా చూసిండు.

  ‘‘వాడుత్త తలతిక్కవాడు. ఊరంత ఒక దారి అయితే ఉలిపికట్టది మరో దారి అన్నట్టుగా ఉంటాడు. వానితో అయ్యదిమి లేదు. మిగిత వాళ్ళంత మనతోనే’’ అన్నాడు సత్తయ్య...

  సుబ్బయ్య ప్రచారానికి వసున్న సంగతి సత్తయ్య ముందే బెంగాలి కుటుంబాలను కలిసి చెప్పి పెట్టి ఉంచిండు. కొంత మంద పనులు కూడా మానుకొని ఉండిపోయిండ్లు. వీళ్ళు అక్కడికి పోయే సరికి బినయ్‍ మండల్‍, డూకిరాం, విమల్‍పాండే ఎదురోచ్చి రెండు చేతులు జోడించిండు. సుబ్బారావు ప్రతిగా చిర్నవ్వులు చిందిస్తూ’’ ఏంటీ సంగతి ఎట్లా ఉంది’’ అని అడిగిండు.

  ‘‘అంత ఓకే సార్‍’’ అంటూ బినయ్‍ మండల్‍ బదులిచ్చిండు. సుబ్బారావు సర్కార్‍ ఇంటికేసి చూస్తూ’’ కాంగ్రెసు వాళ్ళు మనకంటే ముందే మేలుకున్నట్టుంది’’ అంటూ తనుమానంగా చూసిండు.

  ‘‘అది కాదు సార్‍ టికే సర్కార్‍ జానకిరాం మనిషి ఆయన్ని పట్టుకొనే క్యాజువల్‍ వర్కర్‍ అయ్యిండు’’ మిగితా వాళ్ళంతా మనం ఎంత చెప్పితే అంతా’’ అన్నాడు మిమల్‍పాండే...

  ‘‘ఎమో’’ అంటూ సుబ్బారావు దీర్ఘం తీసిండు.

  ‘‘అదేం లేదు సారు మా మాటలు నమ్మండి’’ అన్నాడు బినయ్‍మండల్‍...

  గుడిసెల మధ్య కాస్త కాళీస్థలంఉన్న చోట పెరిగిన వేపచెట్టు నీడన మూడు కుర్చిలు వేసి ఉన్నాయి. అందరు అటుకేసి నడిచిండ్లు. సబ్బారావు, సత్తయ్య మరోకరు కుర్చిలో కూచోగా మిగిత వాళ్ళంత వాళ్ళ చుట్టు నిలబడ్డారు.

  మీటింగ్‍ అనే సరికి అడోళ్ళు మొగోళ్ళు పిల్లలు వచ్చిండ్లు. అరువై ఎండ్ల పైబడిన సరస్వతి మండల్‍ కూడా వచ్చింది. ఆమెకు కండ్లు సరిగా కనిపిస్తలేవు. ఎవరో పెద్ద లీడర్లు వస్తరంటే అగం అగం వచ్చింది. ఆమె కొడుకు కోశన్‍ మండల్‍ను కంట్రాక్టరు పనిలో నుండి తీసేసిన తరువాత ఇంట్లో వెళ్లటం కష్టమైతంది. పెద్ద లీడర్లు వస్తాండ్లు అంటే వాళ్ళను బ్రతిమిలాడి ఎట్లనో అట్లనో కొడుకును తిర్గి పనిలో పెట్టించాలనే యావతో వచ్చింది.

  సుబ్బారావు కాసేపు అది ఇది మాట్లాడన తరువాత మెల్లగా అసలు విషయం ఎత్తిండు ‘‘మీకు అందరికి ఎన్నికలు జర్గుతున్న సంగతి తెలుసు. మన టి.ఆర్‍.యస్‍పార్టీ తరుపున వెంకటేశ్‍ అన్ననను పార్టీ నిలబెట్టింది. మనమంత కలిసి ఆయన్ని గెలిపించాలి మీకేమన్నా సమస్యలుంటే అవి పరిష్కరిస్తాం. ప్రభుత్వం మనది మనం ఎదీ అనుకుంటే ఆ పని చేసుకోవచ్చు’’ అంటూ క్షణమాగి అందరికేసి చూసి మళ్ళీ మాట్లాడ సాగిండు.

  ‘‘మీ సమస్య ఎందో నాకు తెలియందాకాదు. డ్యాంకట్టినప్పటి నుండి మీరు చేపలు పట్టుకొని బ్రతుకుతాండ్లు. మధ్యలో సొసైటీలు పుట్టుకొచ్చి మిముల్ని బయటికి నెట్టెసిండ్లు. దాంతో చాల మందికి బ్రతుకు తురువు పోయింది’’ అన్నాడు.

  ‘‘నిజమే’’ అన్నట్టు చాల మంది తలలు అడించిండ్లు.

  ‘‘అందుకేనేనేమంటానంటే సొసైటీ వాళ్ళు బ్రతకాలి, మీరు బ్రతకాలి అందరు బ్రతికే ఉపాయం అలోచించాలి. అందుకే ఎన్నికలు అయిన తరువాత వెంకటేశన్నా మీరు కూడా డ్యాంలో చేపలు పట్టుకునే ఎర్పాటుల చేయిస్తనన్నడు. వెంకటేశన్న గురించి మీకు తెలియదు అల్తు పాల్తు ముచ్చట్లు చెప్పెటోడు కాదు. ఎదాన్నా చేస్తనంటే అరునూరైనా చేస్తడు అటువంటి మనిషి’’ అంటూ చెప్పుకొచ్చిండు.

  ‘‘మీరా పనిచేస్తే మేమంత రుణపడి ఉంటాం’’ అంటూ బినయ్‍ మండల్‍ రెండు చెతులు జోడించిండు.

  ‘‘ఆ విషయం మాకు వదిలేసి మీరు నిర్రందిగా ఉండండ్లీ’’ అంటూ సుబ్బారావు వెంట వచ్చిన మరో లీడర్‍ కేశవులు బరోసా ఇచ్చిండు’’

  జనం సంతృప్తిగా చూసిండ్లు.

  సరస్వతి మండల్‍కు ఈ మాటలేమి తలకు ఎక్కటంలేదు. తన కొడుకు సంగతెందో తెలుసుకోవాలని వచ్చింది. మనసులో తొలుస్తున్న అవెదన మాటల రూపం సంతరించుకోగా....

  అయ్యా మా పొల్లగాన్ని కంట్రాక్టరు పనిల పెట్టుకుంటలేడు’’ మీరు చెప్పివాన్ని పనిలో పెట్టియ్యాలి అంది.

  ‘‘దానికి వీళ్ళెమి చేస్తరే’’ విమల్‍ పాండే ముసల్దాని మాటకు అడ్డుపోయిండు.

  ‘‘మరెందుకు వచ్చిండ్లు’’

  ‘‘ఓట్లు వెయ్యాలి ఓట్లు’’ఎవరో అన్నరు.

  ‘‘ఓట్టు వేస్తే ఏమొస్తది. ఎన్నిసార్లు వెయ్యాలట’’ అంటూ మసక బారిన కండ్లతోని పరిక్షగా చూసింది.

  గా ముసల్దాని మాటలు పట్టించకోకండ్లీ సారు ఎడ్డ ముసల్ది భర్త చనిపోయిండు. కొడుకుకు పనిలేక తిరుగుతాండు’’ అన్నాడు గోపాల్‍.

  సుబ్బారావు తెలిగ్గా నవ్వి ‘‘ఎర్కె ఎర్కె’’అంటూ ముసల్దానిమాటలు పట్టించుకోకుండా బినయ్‍మండల్‍తో మాటల్లోకి దిగిండు.

  ‘‘అయ్యా ఏం చెప్పకపోతిరి’’ ముసల్ది మళ్ళి అడిగింది.

  ‘‘అరేయ్‍ ముసల్దాన్ని ఇక్కడి నుంచి తీస్కపొండ్లిరా’’ ఎవరో కసిరిండు.

  ఓ ఇద్దరు ముందుకు వచ్చి అవ్వ సార్‍ నీ కొడుకును పనిలో పెట్టిస్తరు... పదపద అంటూ రెండు రెక్కలు పట్టుకొని దాదాపు బలవంతంగా ప్రక్కకు తీస్క పోయిండ్లు.

  అ ముసల్ది గింజుకుంటూ ‘‘పనులు లేకుంటే మనష్యులు ఎట్లా బతుకతరు. తిండిలేక కడుపులు మాడ్చుకొని చస్తానం’’ అంటూ గింజుకుంటుంది.

  కాసేపు మాట్లాడిన తరువాత ‘‘మీకే మన్నా అవసరం ఉంటే సత్తన్న చూస్తడు... ఎవరు మోహమాట పడవద్దు...కాని ఒక్క ఓటు కూడా చీలి పోవద్దు’’ అన్నాడు సుబ్బారావు.

  సుబ్బారావు పోవటానికి లేచిండు. బినయ్‍ మండల్‍ చాయ్‍తాగి పోవాలని బలవంతంచేసిండు. కాని ఇంకా క్రషర్‍ నగర్‍ కాకాతియ నగర్‍ తిరుగాల్సి ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీ ఇంటి కాడ తీరుబడిగా చాయ్‍ తాగుతా’’ అంటూ సుబ్బారావు లేచిండు.

  రోడ్డుకు ఒక వైపు ఎన్టిపిసి దేదీప్యమానంగా ఉంటే రోడ్డుకు అవలవైపున దుకాణాలు, వర్క్షాపులున్నాయి. వాటిని అనుకొని గుట్ట బోరుమీద చిన్న చిన్న గుడిసెలున్నాయి. మనిషి నిలుచుంటే నడుము వరకు వచ్చే పులి పాకల్లోనే ఎంత లేదన్నా రెండు మూడు వందల ఓట్లు ఉన్నాయి.

  ఎన్నికలప్పుడు తప్ప నాయకులు వాళ్ళ గుడిసెలకు రావటం జరుగదు. ఎండ్లు గడుస్తున్న వాళ్ల బ్రతుకుల్లో మార్పెమి రాలేదు.

  వాళ్ళు అక్కడికి చేరుకునే సరికి ఒక  విదమైన కపం వాసన గప్పుమంది. అయినా అదేమి పట్టించుకోకుండా ముందుకు సాగిండ్లు. భగవాన్‍ మెస్త్రీకి వాళ్ళ కంట్రాక్టరు దివాకర్‍రావు అరోజు అక్కడ మీటింగ్‍ ఉండే సంగతి ముందే చెప్పి పెట్టడం వలన, ఆయన జనాలను కుప్పెసి నాయకులకోసం ఎదురుచూస్తుండి పోయిండు.

  సుబ్బారావు రావటం చూసి భగవాన్‍ మెస్త్రీ ఎదురొచ్చి ఆయన్ని తొడ్కొని పోయి ఒక్క రాల చెట్టు కాడికి తీసుక పోయిండు. అప్పటికే అక్కడ పోగేసిన జనం పులుకుపుకున చూస్తున్నారు.ఒంటిమీద సరిగా బట్టలు లేని పిల్లలు రంగురంగుల జెండాలను జనాలను చూసి హడావిడి చేస్తున్నారు.

  భగవన్‍ మేస్త్రీ సుబ్బారువు కేసి అబ్బురంగ చూసి ‘‘వీళ్ళంత మనోళ్ళె సారు...’’ అన్నాడు.

  సుబ్బారువు చిన్నగా చిర్నవు నవ్వ తలాడించిండు. ‘‘తీళ్ళంతా దివాకర్‍రావుదగ్గర పని చేసేవాళ్ళే కదా’’ అన్నాడు.

  ‘‘చాల మంది వాళ్ళే సార్‍ కొద్ది మంచి మాత్రం అక్కడిక్కడ కూలిపనులు చేసేవాళ్ళు ఉన్నారు. కానిమెజార్టీ మనవాళ్ళే’’అన్నాడు భగవాన్‍మేస్త్రీ...

  అప్పటికి మధ్యహ్నం దాటి పోయింది. కడుపులో అకలిగా ఉన్నా, మళ్ళి ఇక్కడి దాక రావటం ఎందుకని సుబ్బారావు ఒక్కడి దాక వచ్చిండు. దాంతో ఆయన వీలయినంత తొందరలో మీటింగ్‍ ముగించాలనే అలోచనలో ఉండిపోయి, ఎక్కువ అలస్యం చేకుండా, అక్కడ గుమి కూడిన జనాలను ఉద్దెశించి మాట్లాడటం మొదలు పెట్టిండు. తాము ఎన్నికల్లో గెలిస్తె ఇది చేస్తాం అది చేస్తాం అంటూ తియ్యతియ్యని మాటలు చెప్పసాగిండు.

  దస్త్రు భార్య శ్రావణబాయ్‍ అతని మాటలకు అడ్డుపోయి ‘‘పోయిన సారి ఎన్నికలప్పుడు వచ్చినోళ్ళు బోరింగ్‍లు వెయించిండ్లు. కాని అందులో చుక్క నీరు వస్తలేదు. మీరు వచ్చె తోవల ఎన్టిపిసి మురికి నీళ్ళ కాలువ ప్రక్కన మేము తవ్వుకున్న బాయి నీళ్ళె తాగుతనం. ఎండ కాలం వస్తై అయిత నీళ్ళు కూడా దొరకతలేవు. గదాని సంగతెందో చూడాలి’’ అంది పెద్ద గొంతుక చేసుకొనని...

  టీకురాం భార్య పుష్ప కల్పించుకొని ‘‘వర్షకాలంలో కూడా నీళ్లకు కరువువొస్తాంది. బాయిలకు మురికినీరు చేరి తాగవశం అయితలేదు’’ అంది. ‘‘రేషన్‍బియ్యం వస్తలేవు’’ అన్నారు మరోకరు.

  సుబ్బారావు ఒపిగ్గా విన్నడు. ‘‘మీకు ఏఏ సమస్యలు ఉన్యాయో అవన్ని మన భగవాలన్‍ మేస్త్రీకి చెప్పండి. ఈ సారి మీ సమస్యలన్ని పరిష్కరిస్తాం’’ అన్నాడు. భాగవన్‍ మేస్త్రీ కేసి తిరిగి ‘‘వీళ్ళ సమస్యలన్ని రాసుకొని వచ్చి అఫీసుకాడికి రా, ఎన్నికలు అయిన తరువాత చేసే మొదటి పని అదే’’ అన్నాడు.

  భగవాన్‍ చెమట కంపుతో నిండిన అపరిసారల్లో నాయకులు ఎక్కువసేపు నిలబడలేకు పోయిండ్లు. బలవంతుపు పేరంటం ఎదో ముగించుకున్నట్టుగా, ఎంత హడావిడిగా నైతే వచ్చిండ్లో అంతే హడావిడిగా ఎల్లిపోయిండ్లు.

  పోతు పోతు భగవాన్‍ మేస్త్రీని ప్రక్కకు పిలిచిన సుబ్బారావు ‘‘సాయంత్రం వీళ్ళ ఎర్పాట్లు ఎవో నువ్వె చూడాలి. ఒక్క ఓటు కూడా చీలి పోవద్దుఅన్నాడు గుమ్మనంగా...

  రాజీరు మాటలు అవమానం అన్పించి కోపంతో నాగయ్య ఇంటికైతే వచ్చిండు కాని మనసు లో మాత్రం తాగాలనే కొరిక అలాగే ఉండిపోయింది.

  కాలనీలో చినన్న ప్దె అనకుండా తాగి ఊగుతాండ్లు. కాలనీలో రెండు గ్రూపులుగా చీలి పోయిండ్లు. ఒకటి టి.ఆర్‍.యస్‍ పార్టీ అయితే మరోకటి కాంగ్రెసు వాళ్ళది. ఎవరు ఖర్చుకు వెనుకాడటంలేదు. గంగమ్మ కల్లు దుకాణం కాడ జాతర సాగుతుంది. ఇక మీటింగ్‍లప్పుడు, ఎదైనా జూల్సు తీసినప్పుడైతే పండుగైతాంది. బిర్యాని పొట్లాలు, చీప్‍ లిక్కర్‍ పవ్వలకు ఎక్కలేదు. అకలికి మొఖం వాచిపోయి ఉన్న వాళ్ళు తినేకాడికి తిని బిర్యాని పొట్లాలను చాటు మాటుగా ఇంటికి తీస్కపోతాండ్లు. ఇదంతా సుబ్బారావు కనిపెట్టక పోలేదు... లేకి ముండా కొడుకులు... ఎన్ని రోజులు తింటరో తననియ్‍.. అనుకొన్నాడు. పై నాయకులెమో పైసల గురించి లెక్క చేయకుండ్లి. ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఓట్లు మాత్రం మనకు పడాలి’’అంటున్నారు.

  టి.ఆర్‍.యస్‍ పార్టీ వాళ్ళ దాటికి కాంగ్రెసు వాళ్ళు తట్టుకోవటం కష్టమైతంది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి శెఖర్‍రావుకు టిక్కట్‍ అయితే ఇచ్చిందికాని పార్టీ పంపించిన డబ్బులు ఏమూలకు సరిపోతలేవు. తన చేతి చమురు కొంత ఖర్చు పెట్టిండు కాని అపోజిషన్‍ వారితో సరితూగటం లేదు.

టి.ఆర్‍.యస్‍ పార్టీ అధికారంలో ఉంది. దాని అధినాయకునికి ఎన్నికల్లో ఎట్ల గెలువాలో, •నాన్ని ఎట్లా బురిడి కొట్టించాలో తెలిసినంత విధ్య మరోకరకి తెలియదు. దానికి తోడు ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిండు. ఎట్లాగైనా చేసి ఎన్నికల్లో గెలువాలనే పట్టుదలతో ఉండిడబ్బుకు ఎనక ముందు చూడటం లేదు.

  నాగయ్య ఇంట్లా నుండి బయిటికి వచ్చె సరికి గులాబి రంగు జెండాలు పట్టుకొని చిన్న పిల్లలు జైతెలంగాణ అంటూ బిగ్గరగా అరుచుకుంటూ ఊరేగుతాండ్లు. తన ముందు నుండే పోతున్న పిల్లల్లో ఎనిమిదెండ్ల దస్త్రు కొడుకు వినయ్‍ను ఆపిన నాగయ్య ఉత్సుకత కొద్ది ‘‘జెండాలు ఎక్కడియిరా’’ అని అడిగిండు.

  ‘‘సత్తెన్న ఇచ్చిండు’’ పైసలు కూడా ఇచ్చిండు అన్నాడు పిల్లవాడు ఉత్సాహంగా...

  కొడుకు పేరు చెప్పె సరికి నాగయ్య మనసులో బాదేసింది. ఎన్నికల్లో వాడు కాలనీలో అన్ని తనై వ్యవహరిస్తున్నాడు. దాంతో ఆయన ‘‘ఊరంత పైసలు పంచుతాండు. పవ్వలుపంచుతాండు కాని అయ్య అని ఒక పవ్వ అయినా ఇయ్యక పాయే’’ అంటూ తనలో తనే గుణుక్కున్నడు.

  పిల్లలు అరుచుకుంటూ అతన్ని దాటేసి పోయిండ్లు. విసురుగా ఇంట్లోకి వచ్చిన నాగయ్యకు భార్య ఎదురు పడింది. దాంతో కొడుకు మీద కోపం భర్య మీద తీల్చిండు.

  ‘‘ఊరంత పవ్వలు పంచుతాండు... ఇంట్లా అయ్య ఉన్నడన్న జాషే లేకపాయే’’ అన్నాడు విసురుగా...

  శాంతమ్మ ఒకసారి భర్తకేసి తేరపారచూసి ‘‘ ఆ పాపపు సోమ్ము తాగకుంటెంది ఇయ్యల తాగిపిస్తరు తినిపిస్తరు.. తరువాత మొఖం చాయించరు, జనం ఇంట్ల పాడుగాను ఎర్రి లేసిన కుక్కల తీర్గ పుణ్యానికి వచ్చిదంటే పీకలదాక తాగుతండ్లు. అంటూ గయ్యిమంది.

  భార్య కోపం చూసి నాగయ్య వెనక్కి తగ్గి ‘‘అదికాదే... అంటూ ఎదో చెప్పబోయిండు.

  ‘‘వాడెమో పని బందు పెట్టి పిచ్చోని తీర్గ ఎన్నికలంటూ తిరగబట్టె, ఇంటికాడ కోడులు ఒక్కతే కూలిపనులు చేసుకుంటూ కుటుంబం ఎల్ల దీయబట్టె. ఎన్నికల్లో తిరుగతే ఎమోస్తదట.... ఇయ్యల అవసరం కొద్ది సత్తెన్నా అని బుదగరించే సరికి వీడు ఎక్కడ అగుతలేడు. నాకు వాడు ఎరుకే వీడు ఎరుకే అంటూ విర్ర వీగుతాండు. నాకు రేపు ఎన్నిలు అయిపోని ఎవ్వడన్నా లీడర్‍ వీని మొఖం చూస్తడా? అసంగతి వానికి అర్థం అయితలేదు... చేసుకుంటే బ్రతికటోళ్ళం.... ఎవని బుద్ది వాని కుండాలే’’ అంటూ కొడుకు మీద కోపం చేసిండు.

  నాగయ్య మారు మాట్లాడకుండా ఇంట్లోకి పోతుంటే రాంలాల్‍ కేకేసి నాగన్న ఎం చేస్తానవు. ఇందక పోదం రావే’’ అని పిలిచిండు.

  నిన్న జరిగిన అవమానం గుర్తుకు విచ్చి నాగయ్య ‘‘మళ్ళి ఎక్కడికి’’ అని అడిగిండు.

  ‘‘సత్తెన్న గోపాల్‍ ఇంటికాడ పవ్వలు పంచుతండట... పోదాం రావే’’ అన్నాడు నోరు తెరిచి....

  సత్తెన్న పేరు చెప్పెసరికి నాగయ్య కోపం కాస్త నీరుగారి పోయింది. చడి సప్పుడు చేయకుంటా రాంలాల్‍ వెంటనడిచిండు.

  ‘‘పోండ్లీ పోండడ్లీ మంది ఉచ్చ తాగటానికి... వీళ్ళకు ఎట్లా బుద్దివస్తదో’’ అంటూ వెనుక నుండి శాంతమ్మ అరుస్తున్న లెక్క చెయ్యకుండా నాగయ్య ముందుకు పోయిండు.

  ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ప్రచారవేడి మరింత పెరిగింది. సత్తయ్య ఒక వైపు జానికిరాం మరో వైపు పోటిపడి రామయ్య కాలనీలో ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం చెయ్యల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాండ్లు.

  గంగమ్మ కల్లు మొద్దు కాడ రెండు పార్టీలకు చెందిన వారి మధ్య మాటామాట పెరిగింది.

  ‘‘అరెయ్‍ తెలంగాణలో బ్రతికుతు తెలంగాణకే ద్రోహం చేస్తారారా’’ అటూ పుటగాతాగిన రాజం ఓరియా కార్మికుడు మాలిక్‍ బిహరీతో గర్షణ పడ్డడు.

  మాలిక్‍ బీహరీ ఏ మాత్రం తగ్గలేదు. లప్పటికే రెండు పవ్వలు లాగించిండు. మళ్ళీ మందిని తోలుకొని కల్లు బట్టకాడికి వచ్చిండు. అది ఇది పడే సరికి మనిషకి భూమీద కాలు అగుతలేదు.

  ‘‘తెంలంగాణ మీ అయ్య సొత్తారా.. మా సొనియమ్మ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా’’ అంటూ ఎదురు తిరిగిండు.

  మాటమాట పెరిగి చివరికి తన్నులాటకు దారి తీసింది. విషయం తెలిసి సత్తెయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యిండు.

  ‘‘ఎక్కడి నుంచి బ్రతక వచ్చిన వాల్లకే ఇంతుంటే మనకు ఎంతుండాలి’’ అంటూ ఇంతేత్తు లేచిండు.

  ‘‘ఇదే అదును అనుకున్న సుబ్బారావు’’ వాళ్ళ కింత డిమండి రావాటానికి కారణం ఆ జానకి రాంగాడు. వాని అసర చూసుకొనే వీళ్ళు ఎగురుతాండ్లు... ముందు వాని సంగతి చూడాలి’’ అంటూ సన్నగా ఎగదోసిండు.

  ‘‘నిజమే ముందు వాని సంగతి చూడాలి’’ అన్నాడు సుబ్బారావు అనుచరు శివరాం...

  జానికిరాం మొదటి నుండి కాలనీలో ఉన్న వ్యక్తి. దాంతో పరిచయాలు ఎక్కువ. ఒక్క పికే రామయ్య కాలనీలోనే కాదు. క్రషర్‍ నగర్‍లోని ఓరియా కార్మికులను కూడా సెంటిమెంటు రేకేత్తించి ఒకటి చేసిండు. దానిక తోడు తనకున్న పాత పరిచయాలతో చాపక్రింద నీరులాగా ప్రచారం సాగించిండు. టి.ఆర్‍.యస్‍ పార్టీ వాళ్ళకు కాలనీలో అంత బలమైన నాయకత్వం లేదు. అ పార్టీ తరుపున సత్తయ్య ఉన్నడు కాని, అతను యువుకుడు జానకిరాం లాగా కూలీలతో మొదటి నుండి సంబందం ఉన్న వ్యక్తి కాదు.

  నిన్న మొన్నటి వరకు సత్తయ్య తన పనెందో తాను అన్నట్టుగా బ్రతుకుతు వచ్చిండు. అటు వంటి సత్యయ్యను సుబ్బారావు దగ్గరికి తీసి జుజాల మీద చేతులేసి నీ అంతటోడు లేడు అనే సరికి ఉబ్బి పోయిండు. పనికి ఎగనామం పెట్టి రాత్రింబావాళ్లు ఎన్నికల ప్రచారంలో మునిగి పోయిండు. అపోజిషన్‍ పార్టీని దెబ్బతీయాలంటే జానకిరాంను అడ్డు తొలగించాలని బావించిండు సుబ్బారావు. మనసులో ఆ అలోచన పెట్టుకొని మెల్లగా సత్తయ్యను ఎగదోసిండు.

  సత్తయ్య ఉబ్బిపోయి ‘‘వాని సంగతి నాకు వదిలెయ్యండి’’ అంటూ అవేశ పడ్డడు.

  ‘‘వాడెక్కడి నుంచో వచ్చి మనదగ్గర పెత్తనం చేస్తానంటే ఎట్లా కుదురుద్దీ... మనం ఎంత చెప్పితే అంత....వాని గంతి చూడాల్సిందే’’ అంటూ సుబ్బారావు మరింత రెచ్చగొట్టిండు.

  సత్తయ్య రెచ్చిపోయి, రాజయ్య, దశరథం చిట్టపల్లి చంద్రయ్య, మరికొంత మందిని వేంటేసుకొని జానికిరాం మీద దాడికి పోయిండు. అందరికందరు పుటగా తాగి ఉన్నారు. ఎవరు చక్కగా నిలబడే పరిస్థితి లేకుండా ఉంది.

  వీళ్ళు పోయే సరికి జానకిరాం ఓరియా వాళ్ళ గుడిసెల కాడ ఎదురైండు. ఆయన వెంట ఓరియా కార్మికులు కిషన్‍, చ్రకధర్‍ మరి కొంత మంది ఉన్నారు.

  జానకిరాం ను చూసే సరికి సత్తయ్యకు ఎక్కడ లేని కోపం కల్గింది. వెతక పోయిన తీగ కాలుకే తగిలిందని సంబర పడ్డడు. ‘‘నాకొడుకు ఈ సారి తప్పించుకోవద్దు’’ అంటూ అందరి కంటే ముందు ఉరికిండు.

  దూరం నుండే వీళ్ళ వాలకం చూసి జానకిరాం ప్రమాదం శంకించిండు. ఎందుకైనా మంచిది అని అతను కాస్త వెనక్కి తిరిగి ఓరియా వాళ్ళ గుడిసెల మధ్యకు వచ్చిండు. అక్క మరికొంత మంది ఓరియా కార్మికులు పోగయ్యిండ్లు.

  సత్తయ్య జట్టు వాళ్ళు బాగా తాగి ఉన్నారు. చేతిలో కర్రలు పట్టుకొని సర్రున వచ్చి రావటం తోనే జానకిరాం మీద

  దాడికి దిగిండ్లు.

  వాస్తవానికి జానకిరాం తనపై దాడి చేస్తారని ఊహించలేదు. కాని వచ్చెవాళ్ళ వాలకం చూసి కొంత అనుమానం కల్గి వెనక్కి వచ్చిండు. ఊహించని దాడికి అతను మొదట కొంత కంగారు పడ్డా అవెంటనే తేరుకొని ‘‘చూస్తారెందిరా నా కొడుకుల్ని తన్నండి’’ అంటూ తన అనుచురులను పురమాయించిండు.

అరుపులు కేకలు...

  ఓడ్డెరోళ్ళు బండలు కొట్టి కాయ కష్టం చేసి చేసి మొద్దు బారిన చేతులు. జానకిరాం ఒక్కడే ఎదురైతే పరిస్థితులు ఎలా ఉండేదో ఎమోకాని ఓడ్డరి కార్మికుల నుండి ప్రతిఘటన ఎదరయ్యే సరికి వాళ్ళ శక్తి ముందు వీళ్ళ శక్తి చాలకుంటైంది. అందులో తాగి ఉన్నారు. దాంతో ఎక్కువ సేపు నిలబడ కుండానే తోక ముడవాల్సి వచ్చింది.

  అప్పటికి జరుగ వలిసిన నష్టం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారి తలలు పగిలినవి. జానికి రాం ఎంత తప్పుకున్న లాబం లేకుండా పోయిందిఉ.

  అటు సత్తయ్యకు ఇటు జానకిరాంకు తలలు పగిలినవి. కారిన నెత్తురుతో తడిసి పోయిండ్లు.

  పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చిండ్లు.

  శాంతి బద్రతలకు ఎటువంటి బంగం కల్గకుండా ఎన్నికలు శాంతియుతంగా చట్టబద్దంగా సజావుగా జరిగినవి. ఎన్నికల సంఘం ప్రకటించింది.

  ఎన్నికల్లో టి.ఆర్‍.యస్‍కు చెందిన అభ్యర్థి లక్ష్మణ్‍ మెజార్టీతో అపూర్వ విజయం సాధించాడు.

  ‘‘తెలంగాణ ప్రజలు తమ పార్టీపై ఉన్న విశ్వాసానికి ప్రబల నిదర్శనం ఈ విజయం’’ అంటూ ఆ పార్టీ నాయకుడు ఉత్సాహంగా ప్రకటించిండు.

  తన ఓటమిని అంగీకరిస్తూ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రత్యేకంగా తయారు చేయించిన నిలువెత్తు పూల దండతో వచ్చి వెంకటేశ్‍ను సత్కరించిండు.

  ‘‘ఎన్నికల్లో గెలుపు ఓటమిలు చాల సహజం కాని స్నెహం మాత్రం చిరస్థాయిగానిలుస్తుంది’’ అంటూ ఓడిపోయిన కాంగ్రెసు అభ్యర్థి గెలిచిన అభ్యర్థిని కౌగిలించుకొని తన సహృదయత ప్రకటించిండు. ఇద్దరు చిర్నవ్వులు చిందించారు.

  అది చూసి జనం అనందంగా చప్పట్లు చరిచారు.

 

  గవర్నమెంటు హస్పటల్లో ఉన్న కొడుకును చూడటానికి నాగయ్య, శాంతమ్మ పోయిండ్లు...

  కొట్లాటలో దెబ్బలు తాకి హస్పటల్లో పడ్డ సత్తయ్యను చూడటానికి ఏ నాయకుడు రాలేదు. వాళ్ళంత ఎన్నికల్లో గెలిచిన సంబరాల్లో మునిగి పోయిండ్లు...

  హాస్పటల్‍ బెడ్స్ లేక నేల మీద పడుకొన్న సత్తయ్య, మరో ప్రక్కన జానకిరాం కన్పించిండు.

  తలకు పెద్ద కట్టుతో ఉన్న కొడుకును చూసి శాంతమ్మకు దు:ఖం అగలేదు. ‘‘వానింట్ల పీనుగులెల్ల... ఎన్నికలో ఎన్నికలని కొడుకు ప్రాణాలు తీసిరి... ఎందుకు వచ్చిన ఎన్నికలు, ఎవ్వని బాగు చెయ్యటానికి వచ్చిన ఎన్నికలు... పెద్ద పెద్దోలంత మంచి గున్నారు. వాళ్ళ మాయలో పడి తన్నక చస్తిరి’’ అంటూ శోకం తీసింది.

  నాగయ్య కండ్లలో నీళ్ళూరినయి....

  సత్తయ్య, జానకిరాం ఒకరి మొఖాలు ఒకరు చుసుకున్నారు.

 

(అయిపొయింది)

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -23 

1903 లో  హిందూసుందరి పత్రికలో ఒక రచన మాత్రమే ప్రకటించబడి తెలుస్తున్న  స్త్రీలు 16 మంది  ఉన్నారు. వీళ్ళ సమకాలపు సావిత్రి వంటి పత్రికలలో గానీ తరువాతి కాలంలో మరే పత్రికలో గానీ వాళ్ళ రచనలు కనబడవు. ఈ మొత్తం రచనలలో ఎక్కువభాగం ఉపన్యాసాలు, వ్యాసాలు. తరువాతి స్థానం కవిత్వానిది. కథ ఒకే ఒకటి.

ఆ కథ పేరు లోభివాని కథ. ( ఆగష్టు 1903) రచయిత్రి శ్రీధర సీతాదేవమ్మ. అప్పటికే భండారు అచ్చమాంబ ఆధునిక కథకు అంకురార్పణ చేసినా స్త్రీలు నీతికథల మూసలోనే కథలు వ్రాసారు. లోభివాని కథ ఆ కోవలోదే. ఒక వూళ్ళో ఒక లోభివాడు. కొబ్బరి పచ్చడి తినాలనిపించి కొబ్బరి కాయ కొనటానికి బయటకు వెళ్ళాడు. బజారు లో కొబ్బరి కాయ ధర  ఎక్కువ అనిపించి తక్కువకు దొరికే ప్రాంతాన్ని వెతుక్కొంటూ రాజమండ్రి , అమలాపురాలు మీదుగా హైదరాబాద్ వరకూ వెళ్లి అక్కడ కానీ ఖర్చు లేకుండా ఒక సరస్సు ఒడ్డున సరస్సు పైకి వంగిన కొబ్బరి చెట్టు కాయలు కోయటానికి ఎక్కి జారి పడిపోతున్న  తరుణంలో కూడా డబ్బు ఆశ వదలక చేతి పట్టు వదిలి తనను కాపాడటానికి ప్రయత్నించిన నవాబును, రాజును కూడా  తనతో పాటు నీళ్లలో మునిగి చనిపోయేట్లు చేసిన లోభివాడి కథ ఇది. ఉన్నవూళ్ళో కొబ్బరి కాయ కొనటానికి డబ్బు కోసం చూసుకొన్న వాడు, చౌకగానో , అసలు డబ్బే పెట్టకుండానో దానిని సంపాదించటానికి చేసిన ప్రయత్నంలోని ప్రయాసను, నష్టాన్ని పతాక స్థాయిలో చూపించిన ఈ కథ లోభత్వం వినాశకరం అని చెప్తుంది. ఇంత సాధారణమైన నీతి కథను ఆధునిక అవసరానికి ముడిపెట్టి వ్యాఖ్యానించటం  ఈ కథకు కొసమెరుపు. ఒక్క రూపాయి పెట్టి హిందూసుందరిని తెప్పించి తమ స్త్రీలకు విద్యనేర్పించని లోభుల ఇల్లాండ్రు మూఢురాండ్రై తుదకు ఇలాంటి కీడే తెచ్చిపెడతారన్న నీతి తో ఈ కథను ముగించటంలో ఉంది రచయిత్రి చమత్కారం.

1903 నాటికి స్త్రీలు సంప్రదాయ ఛందో రీతులలో  కవిత్వం వ్రాస్తూనే ఉన్నారు. వాటితో పాటు స్త్రీలకే ప్రత్యేకమైన మంగళహారతులు , కీర్తనలు వ్రాస్తున్నారు. అయినారపు వెంకట రమణమ్మ స్త్రీల విధేయత అనే శీర్షిక కింద ( నవంబర్ 1903) నాలుగు  పద్యాలు వ్రాసింది. మొదట చివర సీస పద్యాలు , మధ్య రెండూ ఉత్పలమాల ఒకటి, తేటగీతి మరొకటి. “ జనని గర్భమునందు జన్మించినది మొదల్ యత్తవారింటికి నరుగువరకు … “ అని మొదలయ్యే ఈ పద్యం తల్లిదండ్రుల ఆజ్ఞ కాదనక బుద్ధిని విద్యయందు హద్దు పరచి వినయం, నమ్రత, లజ్జ , శీలం, సత్యం , శాంతం, దయ, ఉపకారం , నిర్మలత్వం మొదలైన గుణాలను అభివృద్ధి పరచుకొని మెలిగితే తల్లిదండ్రులకు పేరు , ప్రజల మెప్పూ లభిస్తాయి కనుక బాలికలకు అలాంటి జ్ఞానం ఇచ్చే చదువు నేర్పాలని చెప్పింది వెంకట రమణమ్మ. పిల్లలను గారాబం చేసి పాడు చేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించింది ఒక పద్యంలో. మరొక పద్యంలో స్త్రీలు అత్తమామల మీద  భక్తి , భర్త మీద మనసు పెట్టి అతనే దైవమని పూజించే స్త్రీకి భగవంతుడు సర్వ సంపదలు ఇస్తాడని ఆశపెడుతుంది. చివరి సీసపద్యంలో ఏ తీర్ధ యాత్రలు, జపతాపాలు, ఉపవాసాలు, దేవతా పూజలు, పుణ్య తీర్ధ స్నానాలు పతి పాదపూజతో సరి రావని కనుకప్రాణేశు పాదసేవ మానవలదుఅని స్త్రీలకు హితవు చెప్తుంది. ఎంతో కాలంగా గతానుగతికంగా స్త్రీధర్మాలుగా ప్రబోధించబడుతున్న వాటినే మళ్ళీ చెప్పింది.

పద్యరచనా శక్తి పరీక్షలలో సమస్యా పూరణ ఒకటి. ఒక పద్య శకలం సమస్యగా ఇచ్చి మిగిలిన భాగాన్ని పూరిస్తూ అర్ధవంతమైన పద్యం వ్రాయమనటం ఒకటి. ఆధునిక యుగపు తొలినాళ్ళ స్త్రీల పత్రికలలో సమస్యా పూరణ పద్యాలు వ్రాసిన మహిళలు చాలామంది కనబడతారు. శ్రీ రాజా బొడ్డు రాజ్యలక్ష్మమ్మ ( రాజ్య లక్ష్మీ దేవమ్మ ) ఒకరు. ఇచ్చిన సమస్యశునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్” ( డిసెంబర్ 1903)దానిని కలుపుకొని ఆమె రామాయణార్ధంలో పద్యం వ్రాసింది. “కనకాంగి వినుము రామునినని మార్కొని రావణుడు శరావళి గురియన్ \ ఘన శూరుడైన సీతే శునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్అన్నది ఆమె వ్రాసిన పద్యం. సీతేశునకు +అమ్ములు అని విడదీసి రావణుడు వేసిన బాణాలు సీతకు ఈశుడు , భర్త అయిన రాముడి మీద నాటుకొని పువ్వులై శోభించాయని చమత్కరించింది. ఆ సంచికలోనే పాలేపు మాణిక్యాంబ అదే సమస్యను తపస్సులో ఉన్న శివుడి మనసు పార్వతిపై లగ్నం కావాలని మన్మధుడు వేసిన బాణాలు శివుడి పై పూలై శోభావహించాయని పూరించింది.

వేప గుప్తాపు మహాలక్ష్మమ్మ ( జులై 1903 ) యే. కనకమ్మ ( సెప్టెంబర్&అక్టోబర్ 1903) కీర్తనలు వ్రాసారు. మహాలక్ష్మమ్మ కీర్తన సరస్వతీ స్తుతి. స్త్రీల కీర్తనలు  సాధారణంగా లక్ష్మీ పార్వతుల స్తుతి రూపకంగా ఉంటాయి. ఎందుకంటే నోములకు, వ్రతాలకు అధిదేవతలు వాళ్ళే కనుక. ఈ నేపథ్యంలో సరస్వతీ స్తుతి అరుదైనదే. “వందనంబులందు () వారిజాసను రాణి వందనంబు లంది  నా వంత దీర్పవమ్మఅన్న పల్లవితో ప్రారంభమైన ఈ కీర్తనలో అయిదు చరణాలు ఉన్నాయి. కవుల చెంత చేరి ఉంటుందని, విదుషులను బ్రోచు విద్యా కల్పవల్లి అని సరస్వతి స్థానాన్ని , దయను గురించి చెప్తుంది. “విద్యలేని స్త్రీ వెతల బాపవమ్మాఅని కోరటం లోవిద్యాశ్రీ నొసగి వేగ బ్రోవరమ్మాఅని ప్రార్ధించటంలో స్త్రీవిద్య పట్ల రచయిత్రి ఆర్తి కనబడుతుంది. యే. కనకమ్మ కీర్తన లో   “ సత్యముగాను  పణతూ లందరికీ పతిభక్తి భూషణమూ బాగుగానుండవలెన్అన్న పల్లవే చెబుతుంది దాని స్వభావాన్ని. సావిత్రి మొదలైన సతులు పతిభక్తి వల్లనే గణనకు ఎక్కారని ఆడవాళ్లు అబద్ధాలు ఆడరాదని నీతులు చెప్తుంది ఈ కీర్తన.

టి. రామలక్ష్మమ్మ (ఆగష్టు 1903), పేరు లేకుండా ఒక స్త్రీ అనే సర్వనామంతో మరొక స్త్రీ వ్రాసిన మంగళ హారతులు రెండు ఉన్నాయి. రామలక్ష్మమ్మ వ్రాసినది భగవంతుడి గురించిన కీర్తన కాదు. అప్పుడు భారతదేశపు బ్రిటన్ ప్రభువుగా ఉన్న  7 వ ఎడ్వర్డ్ గురించి. అతని పూర్తి పేరు ఆల్బర్ట్ ఎడ్వర్డ్. క్వీన్ విక్టోరియా పెద్దకొడుకు. 1901జనవరి 22 న అతను అధికారంలోకి వచ్చాడు. “ మంగళమని, మంగళమని మంగళమనరే మంగళమని పాడరే ఎడ్వర్డ్ గారికిఅనే పల్లవితో మొదలయ్యే ఈ పాటలో అయిదు చరణాలు ఉన్నాయి. భారతీయుల కోర్కెలు తీరేట్లుగా అతను ఇండియాకు ప్రభువు అయ్యాడని  మహిళలందరిని అతనికి మంగళ హారతులిమ్మని పిలుపు ఇచ్చింది ఈ పాటలో . సమకాలీన రాజకీయాల పట్ల స్త్రీలలో ఆసక్తి ని , ప్రతిస్పందనను నమోదు చేసిన పాట ఇది . ‘ఒక స్త్రీవ్రాసిన మంగళహారతి( సెప్టెంబర్ 1903)  “మంగళమూ నీకంబా మాతల్లీ జగదాంబా …”  అనే పల్లవి తో అయిదు చరణాలలో పార్వతికి ఎత్తిన హారతి. ఈ మంగళ హారతి కర్తగా ఆమె తనపేరు చెప్పుకొనటానికి ఇష్టపడలేదు కానీ ఆమె పేరు వెంకటరత్నము అని ఆ మంగళహారతే చెప్తున్నది. వరము లిచ్చి బ్రోవమని , దీన జనులను బ్రోవమని వేడుకొంటూదాసాను దాసురాలగునట్టి వెంకటరత్నము నే బ్రోవు మరి మరీ వేడేదా’  అని తనగురించి చెప్పుకొన్నది. మంగళహారతి, కీర్తన రచనలలో చివరి చరణాన్ని రచయిత నామాంకితంగా వ్రాసే సంప్రదాయాన్ని పాటించటం వల్ల ఇలా ఆమె పేరు వెంకట రత్నము అని తెలుస్తున్నది. కానీఅదే సంచికలో ‘“రామ రామ నన్ను నీ రచ్చశాయనేలరా , తామసంబు మానుమా కామితార్ద దాయకఅనే పల్లవితో ప్రారంభించి ఒక సుందరి’  వ్రాసిన నాలుగు చరణాల పాట రచనలో ఈ సంప్రదాయం పాటించబడలేదు కనుక ఆమె అసలు పేరు ఏమిటో మనకు తెలియకుండానే పోయింది.  

కథ, కవిత్వం, కీర్తనలు , మంగళ హారతులు వ్రాసిన ఈ ఎనిమిది మంది రచయితల తరువాత మిగిలిన వాళ్ళు తొమ్మిది మంది. వీళ్ళు వ్రాసినవి వచన రచనలు. వాటిలో వ్యాసాలు ఉన్నాయి. ఉపన్యాసాలు ఉన్నాయి. స్త్రీలకు సంబంధించిన సమస్యలపై స్త్రీల అవగాహనకు ఇవి అద్దం  పడతాయి. ప్రధానంగా ఇవి విద్యకు సంబంధించినవి. అందుకు మినహాయింపు రెండు వ్యాసాలు.

ఒకటి వైధవ్య సమస్యను చర్చించింది.ఆ వ్యాసంనిజమైన జననీ జనకులు.’ (జూన్, 1903).  రచయిత్రి  పార్నంది వెంకట రమణమ్మ. ఈ వ్యాసంలో ఆమె ఆడపిల్లలకు , మరీ ముఖ్యంగా వైధవ్యం పొందిన స్త్రీలకు  నిజమైన జననీ జనకులు   కందుకూరి వీరేశలింగం , ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ అని అంటుందికూతుళ్లు  భర్త మరణించి వైధవ్యం పాలైతే తల్లిదండ్రులు అల్లుడి సొమ్మును అపహరించి పిల్లకు జుట్టు తీయించి ముసుగేసి వంట పొయ్యిదగ్గర ఉంచి ఒంటిపూట తిండి పెట్టి ఏకాదశి ఉపవాసాలు చేయించిఆమె అత్తవారింటి రొక్కంతో వడ్డీవ్యాపారం చేస్తూ బాలవితంతువు ఘోష పుచ్చుకొని వాళ్ళు తల్లి                                                                                                                               దండ్రు లు ఎలా అవుతారన్నది ఆమె తర్కం. తల్లిదండ్రులు, బంధువులు ఎవరు వెనుకంజ వేసినా వితంతువులను చేరదీసి , ఆదరించి, జీతాలు కట్టి చదువులు చెప్పిస్తూ వాళ్ళ మంచి చెడ్డలు చూస్తున్న, వాళ్ళ జీవితానికి ఒక మార్గం చూపుతున్న వీరేశలింగం దంపతులే నిజమైన జననీ జనకులు అవుతారని ఆమె తేల్చి చెప్పింది

మరొకటి దేవగుప్తాపు మహాలక్ష్మమ్మ ది కాకినాడ శ్రీ విద్యార్థినీ సమాజం లో చేసిన చిన్న ప్రసంగం. (డిసెంబర్ )పోచిరాజు మహాలక్ష్మమ్మ అనే మహిళ ఉన్నతోద్యోగి అయిన భర్త తో ఆ వూరు వదిలివెళ్తున్న సందర్భంలో ఏర్పరచిన వీడుకోలు సభలో ఆమె ఈ మాటలు మాట్లాడింది. రక్త సంబంధాలకన్నా , బంధుత్వాల కన్నా ఆధునిక యుగంలో స్నేహ బంధాలు బలవత్తరం అవుతున్న విషయాన్ని, ఆ స్నేహాలు సాధారణ ఆసక్తులు, పాల్గొనే కార్యక్రమాలను బట్టి ఏర్పడుతాయన్న విషయాన్ని ఈ ప్రసంగం సూచిస్తుంది. శ్రీ విద్యార్థినీ సమాజంలో స్త్రీల ప్రయోజనాలకోసం పనిచేయటమే వాళ్ళ స్నేహ సూత్రం. తమతో కలిసి పనిచేసిన స్త్రీ , స్త్రీల విద్యకోసం ఇంకెంతో పని చేసి సమాజానికి మేలు చేకూరుస్తుంది అను కొన్న నెచ్చలి వియోగానికి విచారం ఇందులో వ్యక్తం అయింది

1903 ఫిబ్రవరి సంచికలో రుద్రవరపు కామేశ్వరమ్మ , వేమరుసు మహాలక్ష్మి స్త్రీవిద్యను ప్రస్తావిస్తూ వ్రాయటం మొదలుపెట్టారు. ఒక సుందరి అనే సర్వనామంతోనీతిని గూర్చిఅనే వ్యాసం ( ఏప్రిల్) ప్రచురించబడింది.సమాజ ప్రార్ధనకు స్త్రీలను ఇంటికి ఆహ్వానించిన ఒక స్త్రీ చేసిన ఉపన్యాసం ఇది. . సమాజ ప్రార్ధన అంటే  బ్రహ్మసామాజికులు సామూహికంగా చేసే ఏకేశ్వరోపాసన. అందుకోసం స్త్రీలు తోటి స్త్రీలను తమ ఇళ్లకు ఆహ్వానించటం, స్త్రీలకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుకొనటం, ప్రార్ధనలు చేసి కీర్తనలు పాడుకొనటం అదొక అలవాటుగా మారిన కాలం అది. అలా ఈ సుందరి కూడా తన ఇంట్లో సమాజ ప్రార్థనకు స్త్రీలను పిలిచింది. వాళ్ళను ఆహ్వానిస్తూ ఆమె చేసిన చిన్న ప్రసంగమే ఈ వ్యాసం

అబలా సచ్చరిత్ర రత్నమాల వ్రాసిన భండారు అచ్చమాంబ సకుటుంబంగా తమ నగరానికి వచ్చిన విషయం ప్రస్తావించింది. అచ్చమాంబ నాగపూర్ లో ఉంటున్నా రచయిత్రి గా స్త్రీ జనాభ్యుదయ ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా తెలుగు దేశపు స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకొన్నది. 1902 డిసెంబర్ నుండి కుటుంబంతో ఆంధ్రదేశంలోని వివిధ నగరాలను సందర్శిస్తూ కాశీకి వెళ్ళింది. బందరు లో మొదలుపెట్టి 1903 జనవరి ,ఫిబ్రవరి నెలలలో ఏలూరు, రాజమండ్రి కాకినాడ మొదలైన నగరాలలో పర్యటించి స్త్రీల సమావేశాలలో ప్రసంగాలు చేసింది. ఆమె తమ నగరానికి వచ్చి ఆనందం కలిగించిందని ఈ సుందరి చెప్తున్నదంటే ఈమె నివాసం ఏలూరు , రాజమండ్రి , కాకినాడ లలో ఎదో ఒకటి అయి ఉంటుంది. అచ్చమాంబ సద్గ్రంధాలు చదివితే ఆమె ఉన్నతమైన ఉద్దేశాలు అర్ధం అవుతాయని, విద్యామహత్యం వల్లనే ఆమె అందరి హృదయాలను ఆకర్షించగలిగిందని అంటుంది ఈ సుందరి.

చోరులు తస్కరించరానిది, పరులకు ఇచ్చినా తరగనిది విద్య అని , అలాంటి విద్య పురుషులకు మాత్రమే అందుబాటులో ఉందని, క్రైస్తవ స్త్రీలు కూడా ఉన్నత విద్యలో కనిపిస్తారని చెప్పి , ఇరుగుపొరుగు వారి అభ్యంతరాలకు, ఇంట్లో ముసలమ్మల సణుగుడుకు భయపడి ఆడపిల్లల చదువు మూడు నాలుగు తరగతుల లోనే మాన్పిస్తున్నారని ఒక వాస్తవాన్ని చెబుతూ స్త్రీలే చదువు చెప్తున్న బడులకు ఆడపిల్లలను పంపక పోవ టాన్ని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలు చదివిన ఆ కాస్త చదువు కూడా పెళ్లిళ్లు అయి సంసారాలు మీదపడిన తరువాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నదని బాధపడుతుంది. ఇంటి పనులు అయినా తరువాతనైనా సరే కాస్త సమయం కేటాయించి సద్గ్రంధాలు చదువరాదా అని వేడుకొన్నది. చదువు జనాభివృద్ధి సాధకం అని పేర్కొన్నది. విద్య కన్నా విలువైనది నీతి అని దానివలన విద్యకు వన్నె చేకూరుతుందని సీతను ప్రస్తావిస్తూ నీతి శ్రేష్ఠతను వక్కాణించింది.

దేశాభిమానము గల స్త్రీలకొక ప్రార్ధనఅనే వ్యాసంలో (జూన్ ) గొడవర్తి బంగారమ్మ దేశంలో అనేకరకాలైన పేదరికాలు ఉన్నాయని , విద్యలో ప్రత్యేకించి స్త్రీ విద్యలో దేశం కడు పేదరికంలో ఉందని కనుకనే ఈ దేశంలో స్త్రీలు బానిసలవలె ఏలబడుచున్నారని చెప్పింది. న్యాయంగా స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన స్నేహం కొరవడటానికి విద్య లేకపోవటమే కారణం అంటుంది. నాగరికతకు మూలభూతమైన విద్యను స్త్రీలలో వృద్ధిచేయటానికి మహా జనసభలు పూనుకోవాలని , గడచిన సంవత్సరం కలకత్తా సభ స్త్రీవిద్య గురించి ప్రస్తావించటం సంతోషం కలిగించింది అని చెప్పింది.

స్త్రీవిద్యకు తగిన వసతులు లేవని, క్రిస్టియన్ మిషనరీలు అందుకు కొంత పనిచేశాయని స్త్రీలకు బడులు పెట్టి స్త్రీలను ఉపాధ్యాయులుగా నియమించి నిర్వహిస్తున్నారని వాళ్ళ ప్రేరణతో విజయనగరం మహారాజా  ఆనందగజపతి రాజు వంటి వారు అలాంటి పనికి పూనుకున్నారని ఆయన బాలికల విద్య కొరకు చెన్నపురిలో నాలుగు , విజయనగరంలో ఒకటి పాఠశాలలు ఏర్పరచాడని పేర్కొన్నది. విజయనగరంలోని బాలికా పాఠశాలలో నాలుగేళ్ల క్రితం 150 మంది బాలికలు చదువుకోగా ఇప్పుడా సంఖ్య బాగా పడిపోయిందని సమాచారం ఇయ్యటమే కాదు అందుకు కారణాలను కూడా ఆమె వాస్తవ భూమిక మీద ఊహించింది. పదేళ్లు దాటినా ఆడపిల్లను బడికి పంపటానికి అవసరమైన సంస్కారం సమాజంలో లేకపోవటం దానికి తోడు  ఆ పాఠశాలలో అధ్యాపకులు అందరూ  పురుషులే కావటం అందుకు కారణం అంటుంది.

గొడవర్తి బంగారమ్మ కు స్త్రీవిద్య గురించి ఉన్న ఈ ఆరాటం ఆమెను ఆచరణలోకి  నడిపింది. ఈ వ్యాసాన్ని బట్టి ఆమె 1897 లోనే  ఒక బాలికా పాఠశాల ఏర్పరచినట్లు తెలుస్తున్నది. పదిమంది తో ప్రారంభమై ఇప్పుడు అందులో చదువుతున్న బాలికల సంఖ్య యాభైకి చేరిందని దానిని తాను ఒక్కతే నిర్వహించటం  కష్టంగా ఉందని తెలుగు, ఇంగ్లీష్ చెప్పటానికి ఇద్దరు, కుట్లూ అల్లికలు నేర్పటానికి ఒకరు సహాయకులు కావాలని అందుకు విజయనగరం మాహారాణి అయిదువందల రూపాయల చందా , నెలకు 20 రూపాయలు ఇయ్యటానికి అంగీకరించిందని ఈ వ్యాసంలో  ఆమె పేర్కొన్నది. స్త్రీలందరినీ తమతమ ప్రాంతాలలో స్త్రీ విద్యకు తోడ్పడాలని కోరుతూ ఈ వ్యాసాన్ని ముగించింది.

విద్య సమానత్వ సాధనమని , స్త్రీ పురుషులమధ్య స్నేహం అనే విలువను అభివృద్ధి చేస్తుందని భావించిన గొడవర్తి బంగారమ్మ అభివృద్ధికి తనదయిన నిర్వచనాన్ని ఇయ్యటం ఈ వ్యాసంలో గమనించవచ్చు. ఏది అభివృద్ధి కాదో చెప్పటం ద్వారా ఆమె ఈ పని చేసింది. ఆమె దృష్టిలో అభివృద్ధి అంటే

  • ఎట్టి వయసు ఉన్నా విధవలకు మారు మనువు చేయటం కాదు.
  • సముద్రపు ఇసుక కు పోయి పురుషులతో స్వేచ్ఛగా విహరించటం కాదు.
  • మతనాడీ భేదం లేకుండా ఎట్టి జనులతోనైనా కలిసి తిరగటం కాదు .

కేవలం విద్య మాత్రమే. అంటే ఆమె అభివృద్ధి నిర్వచనం పరిధి లోకి  స్త్రీ పునర్వివాహాలు, పురుషులతో సామాజిక సంబంధాలు, మత సమానత రావన్న మాట. అది గొడవర్తి బంగారమ్మ సంస్కరణ  పరిమితి. అయినప్పటికీ స్త్రీ విద్య వరకు ఆమె ఒక ఆచరణ వాది అన్నది స్పష్టం.

          వలివేటి బాలాత్రిపుర సుందరమ్మ రాజము నందలి జనానా సభలో చేసిన ప్రసంగం ( జులైకూడా స్త్రీ  విద్య కేంద్రంగానే సాగింది. స్త్రీలు సభలకు రావటం వల్ల ఇంటిపనులు కాస్త ఆలస్యం అయితే కావచ్చు కానీ అందరూ చేరి మాట్లాడుకొనటం వలన కలిగే లాభం అంతకంటే గొప్పది అని చెప్తూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించింది. మానవ జాతిలో పురుషుడు మొదటివాడుగా  శరీరదారుఢ్యం , విద్య కలిగి ఉండగా  స్త్రీ రెండవది గా అబల గా విద్య లేనిదానిగా ఉండిపోవటం గురించిన ప్రశ్నతో దానిని కొనసాగించింది. విద్య లేకపోతే జీవనం లేదా? లేకుండా ఆడవాళ్లు ఇప్పుడు జీవించటంలేదా? చదువుకొని ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలాలా అంటూ స్త్రీలకూ చదువు చెప్పించకుండా నిరుపయోగులుగా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేసింది.

విద్య అంటే తెలుసుకొనటం అని తెలుసుకొనటానికి విస్తృతమైన జ్ఞాన ప్రపంచం ఉందని బాలా త్రిపుర సుందరమ్మ అంటుంది. జీవ పదార్ధాలు , నిర్జీవ పదార్ధాలు అని  పదార్ధాలు రెండురకాలు అని మొదటి దానిలో మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు మొదలైనవి ఉంటే రెండవదానిలో భూమి, ఆకాశం, నీరు, గాలి , అగ్ని మొదలైనవి ఉంటాయని ఇవన్నీ తెలుసుకోవలసినవే అంటుంది. చదువు ఉంటే అన్నీ తెలుస్తాయని చెప్పింది. ప్రపంచంలో స్త్రీపురుషులకు ఏర్పాటైన పనులు సక్రమంగా నిర్వహించటానికి విద్య అవసరమని చెప్తూ చివరకు ఇల్లు చక్కదిద్దటం, పిల్లలను పెంచటం వంటివి చక్కగా చేయటానికి స్త్రీలకు విద్య అవసరమని చెప్పటంలో మళ్ళీ స్త్రీ విద్యను ఇంటి పనులకే పరిమితం చేయటం కనబడుతుంది. ఏమైనా స్త్రీలు తరచు కలుసు కొనటం కలిసి చదువుకొనటం ప్రయోజనకరమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించింది.

మొసలికంటి రమణాబాయమ్మ ( వెంకట రామణాబాయి ) కూడా రాజమునందలి జనానా సభలో చేసిన ప్రసంగం  స్త్రీవిద్య గురించే( సెప్టెంబర్ &అక్టోబర్). అందరికీ తెలిసిన విషయమే అయినా తన మాటలు బాలభాషితాలవలె  ఆనందపరచగలవని  అంటూ ఉపన్యాసం ప్రారంభించింది. తల్లిదండ్రులు చదువు చెప్పించకపోవటం వల్ల ఆడపిల్లలు కాపురంలోని కష్ట సుఖాలను అన్నదమ్ములకు ఉత్తరం వ్రాసి తెలుపుకొనటానికి వీల్లేక పోతుందని , ఎవరికైనా చెప్పి వ్రాయిద్దామంటే ఆ విషయం అత్తమామలకు తెలిసి పోతుందన్న భయంలో నిర్బంధంలో జీవితాలు గడిపేస్తున్నారని తనకెదురైనా ఒక స్త్రీ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పింది. ఇది అర్ధమైతే దానిని దాటటానికి ఇప్పుడు ప్రయత్నించి అయినా విద్య నేర్చుకోవచ్చని చెప్పింది. విద్యా  స్పర్శ వల్ల స్త్రీల చిత్తం పరిశుద్ధం అవుతుందని స్త్రీలకు అత్యంత ఆవశ్యకమైన పతిభక్తి , దైవ భక్తి, సత్యశీలత మొదలైన సద్గుణాలు సాధించటానికి సాధనం అవుతుందని , గృహకృత్య నిర్వహణ సమర్ధవంతంగా చేసుకొంటారని బాలా త్రిపుర సుందరమ్మ వలెనే అభిప్రాయపడింది.

కసవరాజు రంగమ్మ స్త్రీవిద్య గురించి వ్రాసినది ఈ వరుసలో చివరిది ( డిసెంబర్ ) చిన్న విన్నపం పత్రికాముఖంగా ప్రచురించండి అని కోరుతూ ఆమె వ్రాసిన అభిప్రాయాలు ఇందులో ఉన్నాయి. ఆమె భర్త పేరుమీద దేశోపకారి అనే పత్రికను తెప్పించుకొని కొన్ని నెలలుగా చదువుతున్నానని అందులో హిందూ సుందరి పత్రిక గురించి వ్రాసినది చూసి తెప్పించుకొని చదివానని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్  సంచికలు చదివాకా తనకు కూడా వ్రాయాలనిపించి వ్రాస్తున్నానని పేర్కొన్నది.

తనకు విశేష విద్య పరిశ్రమ లేదని , ఉన్న స్వల్ప విద్యనయినా అభివృద్ధి చేసుకొనటానికి ఎక్కువకాలం సంసార విషయాలలో వ్యయం అయిపోతున్నదని తప్పులెంచక తన వ్యాసం చదవమని కోరింది. వ్రాయటం, వ్రాసిన దాన్ని చదవటం మాత్రమే విద్య కాదని సత్యం , వినయం , వివేకం, భక్తి , పరోపకారం,  పత్ని వ్రతం ,పాతివ్రత్యం మొదలైన సద్గుణ సముదాయాలను పెంచుకొనటమని అభిప్రాయపడింది. ఇప్పటి వరకు స్త్రీలకు పాతివ్రత్యం గురించి చెప్పిన వాళ్ళే కానీ స్త్రీలకూ  పత్ని వ్రతం గురించి చెప్పిన వాళ్ళు, ప్రత్యేకించి స్త్రీలు ఎవరూ కనబడరు. దానిని చేర్చటం ద్వారా రంగమ్మ గుణాలను స్త్రీపురుషులిద్దరికి సమానమైనవిగానే భావించినట్లు. అందువల్లనే  ఇటువంటి విద్య స్త్రీపురుషులిద్దరూ పొందవలసినదే అని, అది పురుషులకు మాత్రమే హక్కు కాదని  చెప్పగలిగింది. విద్యాస్వాతంత్య్రం అందరికీ హక్కు అయిఉండగా మగపిల్లల చదువులో శ్రద్ధపెట్టి ఆడపిల్లలను నిర్లక్ష్యం చేయటం ఏమని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలను చదువు చెప్పించక పోవటం వల్ల వాళ్ళు కూపస్థ మండూకాలైవిద్యాగంధం లేని జ్ఞాన హీనులై  అందరికీ సంతాపకారకులు అవుతున్నారని అందువలన స్త్రీల చదువుకు సౌకర్యాలు కల్పించాలని అంటుంది. ఉత్తర సర్కారు జిల్లాలలో చదువుకొన్న స్త్రీలు ఎక్కువ కనబడతారని పరిశీలన మీద చెప్పింది. స్త్రీలకు చదువు పట్ల ఆసక్తిని పెంచే స్నేహం, సహవాసం, ప్రొత్సాహం ఇయ్యాలని పేర్కొన్నది. భండారు అచ్చమాంబను స్త్రీలు అనుసరించవలసిన నమూనా గా పేర్కొన్నది. భర్త కేశవరాజు నరసింగరావు తనకు రచనా స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పుకొన్నది.

రంగమ్మ అభిప్రాయాలను ఆమె చదివానని చెప్పుకొన్న హిందూసుందరి (1903, ఆగస్టు , సెప్టెంబర్, అక్టోబర్) సంచికలలో స్త్రీ విద్య గురించి వచ్చిన రచనలపై ప్రతిస్పందనగా పేర్కొనవచ్చు. వాటి మీద కొంత మెరుగైన అవగాహన , స్త్రీపురుష సమానత్వ భావన, హక్కుల స్పృహ ఈ వ్యాసంలో కనబడతాయి.

----------------------------------------------------------------------------------

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు